పరిశుద్ధాత్మ నింపుదల

పరిశుద్ధాత్మ నింపుదల

ప్రశ్న:- పరిశుద్ధాత్మ కలిగియుండుటకును పరిశుద్ధాత్మతో నిండియుండుటకును గల తేడా ఏమిటి?

జవాబు:-

ప్రతి నిజ క్రీస్తు విశ్వాసికి పరిశుద్ధాత్మ కలడు, లేనియెడల నట్టి విశ్వాసి విశ్వాసియే కాడు. (రోమా 8:9). పరిశుద్ధాత్మ మన రక్షణకు ముద్రయైయున్నాడు. (ఎఫెసీ 1:13). ముద్రలేనిది సరియైనది కాదు. పేతురు కొర్నేలి యింట సువార్త చెప్పుచుండ గానే వినేవారిమీద ఆత్మ దిగివచ్చెను. ఎట్లు? అపొ.కా. 11:14 చూస్తే వారు ఆ గదిలో చేరినప్పుడు విశ్వాసులు కానివారైయుండి రక్షణ లేకుండిరి.

రక్షణలేని లోకస్థులు పరిశుద్ధాత్మను పొందలేరని యోహాను 14:17 చెప్పుచున్నది. అయితే విశ్వాసము లేనివారు రోమా పత్రిక 10:17 ప్రకారము సువార్త వినుటతో విశ్వాసులై, విశ్వాసులు కాగానే పరిశుద్ధాత్మను పొందిరి. అపొ. కార్య. 10:44. గనుక దేవుని నిజపిల్లలందరికిని పరిశుద్ధాత్మయున్నాడను సంగతి స్పష్టమైనను దేవుని పిల్లలందరును ఆత్మతో నిండియున్నారని చెప్పగలమా? చెప్పలేము.

ఎఫెసీ 1:13 చొప్పున ఆత్మతో ముద్రింప బడినవారు అదే పత్రిక 5:18 లో ఆత్మపూర్ణులై యుండుడను హెచ్చరికవంటి ఆజ్ఞ పొందుచున్నారెందుకు? ఆత్మకలిగి యుండుట ఆత్మతో నిండియుండుట అది యిది రెండు నొకటిగా లేవు. యొకటిగానుంటే అట్టి హెచ్చరిక అనవసరము.

ఆత్మ ముద్రింపు ఆత్మనింపుదలకు వేరైనందుచేతనే ఎఫెసీ భక్తులు ఆత్మ ముద్రింపు పొందిన పిమ్మట ఆత్మ నింపుదల మిగుల అవసరమని బోధింపబడిరి. ఒకానొకప్పుడు కొందరి యను భవములో ఆత్మ రాగానే ఆత్మతోకూడ నింపబడిరి. ఆది అపొస్తలులు ఆత్మలో బాప్తిస్మము పొందుదుమను వాగ్దానము క్రిందనుండి బాప్తిస్మము మాత్రము కాదు గాని ఆత్మ నూతనముగా వచ్చినప్పుడు అపొ. కార్య. 2:4 లో వ్రాసినట్లు ఆయన బాప్తిస్మముతో నింపుదలను కూడ పొందిరి.

పౌలు అనబడిన సౌలు రక్షింపబడి మూడు దినములకు ఆత్మ నింపుదలను గూర్చిన వాగ్దానమునకు యోగ్యుడాయెను – అపొ. కార్య. 9:17 చూడండి. కొరింథీ విశ్వాసులు విశ్వాసులే; మరియు దేవుని పిల్లలే గనుక ఆత్మ కలిగియుండిరి. (1 కొరింథీ 3:16). అయితే అదే అధ్యాయములో వారి పసితనమును గూర్చి లేక వారిపిల్లతనమునుగూర్చి వారిని గద్దించుచు మీరు చాలినంతగా నెదుగ నందున మీద్వారా నా కడ్డము కలిగెననియు, బోధింపవలసిన సంగతులు మీ వినికిడిలో బోధించలేక పోతిననియు, మీరింకను పసిపిల్లలే యనియు వారిలో పుట్టిన భేదము లనుబట్టి వారిని శాసించుచు రావలసి వచ్చెను. (1 కొరింథీ 3:1-3).

ఆత్మ వారికి లేడా? ఆత్మ కలడు – 1 కొరింథీ 3:16; 6:19. ఆత్మవరములు కూడ కలిగియుండిరి 1 కొరింథీ 1:7. వారికి రక్షణ కలిగినదానిలో 6:11 చొప్పున వర్ణించినట్లు ఆత్మయందు కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడిరి. అయినను ఆత్మ నింపుదలను అంతగా నెదుగక కొదువతోనేయుండిరి. భక్తులు పనికిమాలిన తీగెలు గలవారై ఆ తీగెలు తెగకొట్టివేయబడకముందు అడ్డగింపబడి ఆత్మ నింపుదల లేకున్నారు. (యోహాను15:1). విధేయులైనవారికే ఆత్మ అనుగ్రహింపు కలుగునని అపొ. కార్య. 5:32 తెల్పుచున్నది.

ఆత్మ నింపుదల గల అనుగ్రహింపు రక్షింపబడినవారి విధేయతను అనుసరించి ప్రాప్తించునని దీని నిజభావము. ఎంతోమంది క్రీస్తు పిల్లలే ఆయనను అంగీకరించి ఆత్మతో ముద్రింపబడిరి, గాని ఆయా విషయములలో చూపతగిన విధేయతను కనుపరచనందున ఆత్మగలవారైనను ఆత్మ నింపుదలగలవారు కాక పోయిరి.

ఈ దినములలో కూడ ప్రార్థన తక్కువాయెను. ఆత్మకొరకు ప్రార్థింపకూడదు గాని క్రీస్తును గైకొని క్రీస్తునుబట్టి ఆత్మను పొందినవారు లూకా 11:13 ననుసరించి ఆత్మనింపుదల నిమిత్తమై తండ్రిని వేడుకొన తగినది. వారు, వీరు ఆత్మను పొందిరి. సరేగాని ఆత్మ వారిని పొందలేదని తెలియుచున్నది. గనుక క్రీస్తు విశ్వాసులీ గొప్ప సంగతి తలంచి ఆత్మ నింపుదలకు వేగిరపడి అనుభవించి రంజిల్లవలెను.

క్రీస్తు సంతోషమిచ్చే వాడు. అయితే సంతోషముతో మాత్రము తృప్తిచెందరాదు. యోహాను 15:11 లో మన సంతోషము పరిపూర్ణము కావలెనని క్రీస్తు కోరుచున్నాడు. ఆత్మను పొందినవారు సంతోషముగలవారు. ఆత్మ నింపుదల పొందినవారి సంతోషము అంతకంటె పరిపూర్ణ సంతోషమాయెను.

క్రీస్తును నమ్మినప్పుడు పాపికి జీవము సంప్రాప్తమగును. కుమారుడు గలవాడు జీవము గలవాడే. (1 యోహాను 5:12). మరియు క్రీస్తు రక్తమును బట్టి సంపాద్యమైన ఈ జీవము పరిశుద్ధాత్మచేత నమ్మినవారిది అగుచున్నది. (యోహాను 6:63). అయితే జీవము మాత్రము కలిగి ఆనందించినను నిలిచిపోరాదు. యోహాను 10:10 లో వ్రాసినట్లు సమృద్ధిగా ఆ జీవము మీలో పారాడేవరకు మానరాదు.

ఆత్మను పొందిన వారు జీవముగలవారు. ఆత్మ నింపుదల నెరిగినవారు సమృద్ధియైన జీవము అనుభ వించేవారు. తొలిగా ఆత్మను పొందినప్పుడు 1 కొరింథీ. 12:13 లో కనబడుచున్నట్లు ఆ ఆత్మలో పానము చేస్తిమని తెలియుచున్నది. అయితే నోరు బాగుగా తెరచి లోతుగా పానముచేయుట వేరొక సంగతి.

నోరు తెరచుట యొకటి. నోరు బాగుగా తెరచుట వేరొకటి – కీర్తన 81:10 లో సూచింపబడినది. తెరచుట మాత్రము కాదు; దేవుని నిజమైన పిల్లలందరును నోరుతెరచి క్రీస్తుతో నప్పుడే సంయుక్తమై ఆత్మను పొందిరిగాని క్రీస్తు బిడ్డలందరును బాగుగా నోరు తెరచి ఆత్మనింపుదల పొందిరా? లేదు ఏదో భీతితో కొంత తెరచి మరికొంత తెరవకున్నారు.

మా దేశములో కొందరు చెప్పేదేమనగా నోరు బాగుగా తెరిస్తే నొకవేళ ఇండియాకు మిషనెరీగా వెళ్ళుమంటాడు. మాకిష్టము లేదు. ఇష్టము లేనందుచేతనే నోరు కొద్దిగా తెరచుకొన్నవారు కొద్దిగానే అనుభవించిరి. వారిదే తప్పు. ఈ దేశములో కొందరు క్రీస్తు భక్తులు నోరు బాగుగా తెరిస్తేనిక సినిమాలు బొత్తిగా మానవలెను. తమ జీవితములలో అడ్డముగానున్న కొన్ని వాడుకలు మానవలసివస్తుంది.

ఇష్టము లేనందున నోరు బాగుగా తెరువరు. వారిదే నష్టము మరియు వారినిబట్టి క్రీస్తుకుకూడ అభ్యంతరము కలుగుచున్నది. మీరైతే భయపడక నోరు బాగుగా తెరవండి. అంతట ఆయనే దానిని బాగుగా నింపగా ఆత్మ నింపుదల మీదయగును.

నా పిల్లలు తల్లి పాలు మాని ఆవు పాలు త్రాగవలెనంటే చాల అయిష్టముతో బహు తొందరచేసిరి. అప్పుడు సహాయానికి రమ్మని నా భార్య నన్ను మనవిచేయుట కద్దు. ఒకరోజు నా కుమారునికి పాలు త్రాగించవలెనని యుండి ప్రార్థించి ఆకలితో నేడ్చుచున్న పిల్లవానికి ఆ మంచి పాలు గరిటెతో అందించబోతే అబ్బో యెంతో తొందర చేసెను. నోరు తెరువమంటే ఆ చిన్నపిల్లవాడిది తల్లిపాలు కాదని యెరిగి తెరువలేదు. కొద్దిగా నోరుతెరిస్తే కొద్దిగా పాలు లోపలికి వెళ్ళుచున్నవి. గాని నాకు ఓర్పుచాలక చూచి చూచి తుదకు పెద్ద దెబ్బతో పిల్లవాని గొట్టితిని.

అయ్యో, వెంటనే మూసిపోయిన నోరు బాగుగా తెరచినాడు; గనుక పాలు కావలసినంత పోస్తిని. భక్తులారా, జాగ్రత్తలేనియెడల క్రీస్తు మిమ్మును కూడ దెబ్బకొట్టు తాడు. భద్రము. మీ నాశనానికి కాదు; మీరు బాగుగా నోరుతెరచి ఆత్మనింపుదల నెరుగుటకొరకే ప్రేమతో మిమ్మును కొట్టుతాడు-కీర్తన 119:67-71.

ఆత్మను పొందిన మీరు దెబ్బలేక ఆయన ప్రేమకే యిప్పుడు తిరిగి జీవితము దిద్దుకొని ఆత్మనింపుదల అనుభవించి ముందుకు సాగి పోవుడని క్రీస్తుపేరట మిమ్మునందరిని వేడుచున్నాను. ఆత్మను పొందియుండుట నిజమైన దేవుని పిల్లలందరికి నిర్భేదముగా అన్వయించుచున్నది. అయితే ఆత్మతో నిండియుండుట వేరొక సత్యము. అది నిజమైన దేవుని పిల్లలందరి యనుభవములో నెరవేరినది కాదు. మీరైతేనో నేడే ఆత్మతో నింపబడుటకు సమ్మతించి విశ్వాసముతోను విధేయతతోను రోమా 12:1,2 లో సూచింపబడిన గొప్ప అప్పగింపుతో దానిని వెదకి పొందండి.

దేవుడు

దేవుడు

ప్రశ్న:- దేవుడు అనే పదము ఏక వచనమా? బహు వచనమా?

జవాబు:-

అవును, బహు వచనమే. ఆదికాండము 1:1 లో “దేవుడు” అని కనబడుచున్నది. ఆ శబ్దము బయలుదేరినది. హెబ్రీ భాషలో ఏలోహీము అని వస్తుంది. ఈ “ఏలోహీము” అనేది రెండు శబ్దములలో నుద్భవించినది. (1) ఏల్ అని యొకటి సారి సారి దేవుడనే నామము ఏలోహీము అని రాక ఏల్ అని యొంటరిగానే వచ్చుచున్నది. ఏల్ అనగా బలముగలవాడని అర్ధము. ముఖ్యముగా యోబు, కీర్తన, యెషయా అను గ్రంథములందు బహుమారులు ఈ ఏల్ అనే శబ్దము వచ్చినది. తెలుగులో “దేవుడు” అని తెనిగించిరి. (2) అల్లాః అని రెండవ శబ్దము దానియేలు గ్రంథాలలో ముఖ్యముగా కనబడే శబ్దమిది. తెలుగులో దేవుడే.

అది దేవుడు, ఇదియు దేవుడు గనుక దేవుడు అనే పదము తెలుగులో నేక వచనమైనను దాని నిజోద్భావములో బహు వచనమే మ్రోగుచున్నది. ఈ అల్లా అనే దానికి ఒట్టు లేక ప్రమాణము అని అర్థము. కాబట్టి దేవుడు అనే శబ్దములో – ఏల్, అల్లాః, కలిసి ఏలోహీము అని వచ్చుచున్నది. ఒకటే పదము గాని శబ్దములు మూడు గనుక దీనిలో త్రిత్వమనేది గోచరించుచున్నది. దేవుడెట్టివాడు? (1) బలముగలవాడు దేవుడు-ఆయన ఏల్ అనేవాడు.

(2) దేవుడు మాటయిచ్చి తప్పనివాడు. తన భక్తులతో ప్రమాణము చేసి వారిని విడువక ఒట్టు క్రింద కాపాడేవాడు ఆయన పేరు అల్లాః (3) ఈ రెండు పేర్లు కొంత మార్పుతో కలసి “ఏలోహీము” అని వచ్చుచున్నది. హెబ్రీ బైబిల్ ఈ మూడు శబ్దములు అగుపడుచున్నవి. అవి సూచించే వాడొకడే. తెలుగులో దేవుడే అని తర్జుమా ఆయెను. కాబట్టి దేవుడు అనే శబ్దము బహువచనమే.

భాషార్థములో మాత్రముగాక నుచ్చరించిన పదములలో సైతము దేవుడు బహు వచనములో నున్నవాడని తేలుచున్నది. నరుని నిర్మాణమును గూర్చి ఆది 1:26 లో దేవుడనువాడు ఆలోచన చెప్పబోతాడు. గాని ఆ భాషరీతిని గమనించి చూడండి.

మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఉన్నది. దేవుడు పలికెనని యున్నది. అయితే మనము మన అనే బహువచన వాచక శబ్దము లేచినది. దీని తాత్పర్యమేమి? దేవుడు బహువచనములో నున్నవాడైయున్నాడు ఆది 2:7 లో మానవుని నిర్మాణరీతి వివరింపబడినదానిలో తిరిగి ఏకవచనమే వచ్చినది. నేల మన్ను తీసికొని రూపించి జీవవాయువు నూదినవాడెవడనగా దేవుడైన యెహోవాయే.

ఒకడే చేసినట్టున్నది గాని ఆది 1:26 లో ఆ యొకడే మరి కొందరితో కలిసి ఆలోచించి మాటలాడినట్టున్నది. మరియొకసారి ఆది 3:22 మాటలాడుచున్న దేవుడైన యెహోవా యొకడే గాని ఆదాము మనలో ఒకనివంటివాడాయెనని చెప్పుచున్నాడు. తర్కవాద మెంత జేసిన దేవుడనబడినవాడు బహువచనములో ఉన్నవాడై ఆయా తన కార్యములు తనకిష్టము వచ్చినట్లు జరుపుచున్నాడని నమ్మక విధిలేదు. తండ్రియైన దేవుడు గలడు. దేవుడైన కుమారుడు గలడు. ప్రభువైన ఆత్మయునున్నాడు.

బాప్తిస్మము జరుగగా ఈ ముగ్గురు చెప్పబడుచున్నారు గాని మూడు నామములలో బాప్తిస్మమిమ్మన్నాడా? లేదు. తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మ మియ్యుడని క్రీస్తు సెలవిచ్చెను. (మత్తయి 28:19). ముగ్గురు వ్యక్తులు చెప్పబడిరి సరి గాని నామము ఒకటేయని గ్రహించండి.

పాత నిబంధనలో సహా ఈ బహు వచన సంబంధమైన దేవుని నామము సూచింపబడినది. సంఖ్యా. 6:26 లో నా ‘నామము’ ఇశ్రాయేలీయులమీద నుచ్చరించుమని చెప్పినదానిలో నామము అనేది ఏక వచనములో చెప్పబడినను మూడు పర్యాయములు “యెహోవా” అని యుచ్చరించి ఆ యొక నామము వారిమీద పెట్టుమని సెలవాయెను.

  1. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాకని 6:24 లో వచ్చినది- కాపాడగల తండ్రియైన దేవునికి ఈ శబ్దము సరిపోవును.
  2. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాకని రెండవ శబ్దముగా వచ్చినది-6:25. మనకు కరుణ లభించునట్లు అవతరించి వచ్చి చనిపోయి లేచిన క్రీస్తుకు ఈ శబ్దము సరిపోవును.
  3. యెహోవా నీమీద తన సన్నిధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాకంటే ఈ పలుకు పరిశుద్ధాత్మకు సంబంధించియున్నది. ఆయనే ఆదరణ సమాధానములను మనకందించువాడై యున్నాడు. 6:26.

నెఫీలులు

నెఫీలులు

ప్రశ్న:-

ఆదికాండము 6:4 లో చెప్పబడిన నెఫీలులనబడినవారెవరు? వారు ఆదాము లేకుండ పుట్టిరా?

జవాబు:-

భూమిమీద నుండిరి అంటే ఆదాములేక జన్మించియుండిరని అనుకొనకూడదు. ఆ నెఫీలులనువారు ఆ దినములలో నుండిరని వ్రాయబడినది. ఆ దినములేవనగా అక్రమము విస్తరించి దేవుని కుమారులనబడిన వారు భ్రష్టులై ఆత్మ నడుపుదలకు విరుద్ధముగా కయీను వంశపువారనబడిన నరుల కుమార్తెలతో వివాహము చేసికొన్నప్పుడే ఈ నెఫీలులు కనబడిరి. తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరని వ్రాయబడినది.

ఆ దేవుని కుమారులు దేవుని యిష్టము కాక స్వంత యిచ్చనే కొనసాగించి కూడని సంబంధము పెట్టుకొని పిల్లలను కనిరి. అట్టి దుర్దినములలో వారు పాప ఫలితముగా కనినవారే ఈ నెఫీలులనబడినవారు.

అది హెబ్రీ భాష శబ్దము. తెనుగులో “ఉన్నత దేహులు” అని అర్ధము. ఆది 6:2 లో దేవుని కుమారుల పతనము వివరింపబడినది. వారు స్థానముతప్పి పడిపోయిరి. 6:3 లో ఆత్మ దానికెదురు వాదించిన సంగతి యున్నది.

ఆలకించే వారెవరు లేక పోయిరి. 6:4 లో ప్రత్యేకముగా కాదుగాని ముందువచ్చిన సమస్యతో విజ్జోడుగా దినములలో అనగా అక్రమము విస్తరించిన ఆ దినములలో ఈ ఉన్నత దేహులు భూమిమీద నుండిరని వ్రాయబడినది. అవును, ఆదాము లేకనే వారంతట వారే పుట్టి భూమిమీద తిరగడానికి మొదలు పెట్టిరని అనుకొనకూడదు. యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెనని అపొ.కార్య. 17:26,27 లో అనినది తప్పిపోకూడదు.

ఈ నెఫీలులు ఆదాము సంతతి వారే. ఎవరిద్వారా? ఆ కాలమందుండినవారిద్వారానే జన్మించిరి. అనగా కయీను సంతతివారి సంతానమే. మరియు ఆ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కూడి నప్పుడు పుట్టిన సంతతివానిలో నిమిడియున్నవారే. వీరుగాక ఆ సంయోగముద్వారా పేరుపొందిన అనేక శూరులైన వారును పుట్టిరని ఆది 6:4 చెప్పుచున్నది. పుట్టి లాభమేమి? వారు శూరులే, పేరుపొందినవారే.

ఉన్నత దేహులే గాని దైవభక్తిలో లేనందున జలప్రళయము రాగా వారందరును నశించిపోయిరి. ఉన్నత దేహులుండగా ఆ కాలమందలివారు ఇట్లు చెప్పుకొనిరి. నెమ్మదిగానున్నది, భయమేమియు లేదు, మనకు కొరతయేమియు లేదు. చూడండి మన సంతతివారెంత పెద్దవారైరి, పేరుపొందిరి. బలముగా నున్నారు, అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనమే తటస్థించెను. ఈ దినములలోకూడ ఇలాగే జరుగుచున్నది. (1 థెస్స. 5:1-3).

చదువు హెచ్చినది. అందరికి ధనము విస్తరించినది. ఆయా మతములుకూడ పునర్జీవమునకు వచ్చినది, భయమేమియు లేదంటున్నారు నెఫీలులవంటి విద్యా వంతులు మెడచాచి నడుచుకొంటున్నారు. అయితే నేమి? క్రీస్తు రెండవరాకడ అకస్మాత్తుగా వారిమీద దండనగా పడుతుంది గనుక వారు తప్పించుకొనలేరు, ఇప్పుడే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము.

చిన్నవారేమి నెఫీలులవంటి వారేమి క్రీస్తుకే వంగి నిర్భేదముగా రక్షణపొంది తీరవలెను. వేరొక దారి లేదు నెఫీలులు భూమిమీద నుండిరి. తరువాతను ఉండిరి యని యున్నది. అవును, జల ప్రళయము తీరిపోయి సరాసరి వెయ్యి యేండ్ల పిమ్మట పాలస్తీను అన్యులలో మళ్ళీ నెఫీలులున్నట్లు సంఖ్యా 13:33 తెల్పుచున్నది.

ఈ సారి నెఫీలీయులని పేరు వచ్చినను ఉన్నత దేహులే అని అర్థము. సంఖ్యా 13:32. దేహసంబంధముగా పెద్దవారే గాని ఆధ్యాత్మికములో సన్నవారై అసహ్యులై యెహోవా దృష్టికి నిలువలేనివారై యెహోషువ వచ్చి తీర్పు తీర్చగా ఆయన ఖడ్గమునకు పడిపోయి నశించిరి. వారు జరిపిన హేయకృత్యములకుగాను అసలు ఆ దేశము కంపుకొట్టుచు అపవిత్రపరచబడియుండగా వారి దోషశిక్ష వారి మీద దిగినట్టు వారాదేశములోనుండి వెళ్ళగక్కబడిరి. (లేవీ 18:25). పెత్తనము సలిపిరి. గప్పాలు కొట్టుకొనిరి. బడాయి చూపిరి. పేరుపొంది శూరులైరి.

నెఫీలులనబడిరి ఇష్టము వచ్చినట్టు కార్యము జరుపుకొనిరి గాని లాభమేమి? నియమింపబడిన ఎనమండుగురు రక్షణయోడలో విధేయులై చేరి రక్షింపబడియుండగా శూరులైన వారు నీటిలోనే మునిగి నశించిరి.

నెఫీలులుండిరి, తరువాత ను వుండిరి. ఇప్పుడునుకూడ ఆత్మీయమైన నెఫీలులు దండిగాగలరు గాని -తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నానని క్రీస్తు మత్తయి 11:25 లో జయఘోషనిడి తండ్రిని కొనియాడినట్టు, నెఫీలుల దిక్కుచూచి మోసపోక, చిన్న మంద నమ్ముకొనిన ప్రభువైన క్రీస్తువైపునే జూచి రక్షణ పొందండి.

పరమగీతము

పరమగీతము

ప్రశ్న: పరమగీతముమీద మీరు ప్రసంగించుట లేదే ఎందుకు?

జవాబు:-

పరమగీతముమీద ప్రసంగించెదము లెండి. అయితే పనికిమాలిన ఆయా వ్యాఖ్యానములు తిరుగుచుండగా కొంత వెక్కసముపుట్టి అంతగా దీనిలో దిగలేదు. కొందరు స్త్రీ అంటే వెంటనే మోహమునకు తిరుగుతారు.

పరమగీతములో మోహము లేదుగాని భార్యభర్తలకుండ తగిన పరస్పర సంబంధములే దివ్యముగా చెప్పబడినవి. అయితే తగినవారికే యిది బోధగా నుంటుంది.

పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును, అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదని తీతు 1:15 లో వ్రాసినది ఈ పరమగీతమను పుస్తకమునకు అన్వయించుచున్నది.

క్రీస్తు సంఘానికి పెండ్లికొడుకైనట్టున్నాడు, సంఘమైతే ఆయన భార్య. కాబట్టి పరిశుద్ధమైన పెండ్లిలోను భార్యభర్తల పరిశుద్ధమైన ఐకమత్యములోను, క్రీస్తుకును భక్తునికిని వుండతగిన ప్రేమ సంబంధములు కానవచ్చుచున్నవి. యిట్టి భావనతో పరమగీతము చదివితే భాగ్యము చాలయున్నది.

ఆయన ఆ స్త్రీని పిలిచెడు ప్రేమగల పలుకులు చూడండి – నారీమణీ, సుందరీ, ప్రియురాలా, సుందరవతీ, నీవు అధిక సుందరివి, నీయందు కళంకమేమియు లేదు; ప్రాణేశ్వరీ, నా సహోదరీ, నా పావురమా, నా నిష్కళంకురాలా, రాజకుమార పుత్రికా – ఈ నామాంకితముల నొక్కొక్కటి తలపోసి ఆలోచించి విశ్వాసి తనతోనే వీటిని పొత్తుచేసికొంటే క్రీస్తుకును తనకు నెంత సమీప బంధుత్వ ప్రేమలుండునో యెంతవరకా ప్రేమభావము పుట్టి వర్ధిల్లగలదో చెప్పలేము గాని క్రీస్తు యింతగా తన భక్తులను ప్రేమించి, ముందుప్రేమగా వారితో చర్చించవలెనని యున్నట్టు దీనిలో తెలియవచ్చుచున్నది – ఇట్టి సమీప సహవాసము క్రీస్తుతో సలుపుకొనుట మీకేమైన అనుభవమాయెనా? అలాగే అగుగాక! క్రీస్తు మిమ్మును ప్రేమించుచున్నాడని దీనిలో నేర్చుకోండి. క్రీస్తు మిక్కిలిగా మిమ్మును ప్రేమించుచున్నాడని యెరుగండి.

ఆ ప్రేమకు దూరముపోక దగ్గరనే నిలువబడి అందులో నిమిష నిమిషము జీవించుడి. 1:8,9,15; 2:11; 4:7,8,10; 6:9; 7:1 మొదలైన వచనములను వల్లించి తీపి గ్రోలుడి. సొలోమోను కూలికత్తెగానున్న ఆమెను చూచి ప్రేమించి తన పెండ్లిభార్యగా తీసికొని వచ్చి విందుశాలలో చేర్చుకొనెను. 1:6; 2:4.

ఇట్టి ప్రేమ ఆశ్చర్యకరముగానున్నది మరియు యెరూషలేము కుమార్తెలకు అగోచరమైయుండెను. 2:7; 3:5. ఇట్లు ఆరంభ ములో బీద ఆమెను లేవనెత్తిన రాజుగారు తుదకు ఆమెను బహుగా గౌరవించి రాజ కుమార పుత్రికా అను గొప్ప స్థితికి తీసుకొనివచ్చిరి. 7:1.

విశ్వాసి కూడ క్రీస్తున్నంత పై పదవికి పైకి రావలెను. రాజుగారు ఆమెను పోల్చిన దివ్య పోలికలను కనిపెట్టండి.

ఫరోయొక్క రధాశ్వములతో నిన్ను పోల్చెదనంటున్నాడు. 1:9 క్రీస్తు సంఘము వేగిరముగా సువార్త ప్రచారములో అభిప్రాయము గల్గి యుండవలెనని దీని దీటు.

బలురక్కసి చెట్లలో ఈమె వల్లీ పద్మమువంటిది. 2:2. అవును క్రీస్తు సంఘము ముండ్లలోనున్న లిల్లీపుష్పమువంటిది … పాత తర్జుమాలో లిల్లీ అని యున్నది. లిల్లీ యెంత పరిశుద్ధమైనది, వింతైనది. బురదలోనే పైకి పెరుగుచు వచ్చునది మరియు నెంతో నిర్మలమైనది! క్రీస్తు సంఘమీ మాదిరిగా లోకములో ప్రకాశించవలసినది.

ఉద్యానము అని ఆమె పోలిక. 4:12. మూయబడినది అనగా పరిశుద్ధాత్మచే క్రీస్తు సంఘము ముద్రవేయబడి భద్రముగా నున్నది. (ఎఫెసీ 1:13, 4:30).

జలకూపమని ఆమెను పోల్చుచున్నాడు. 4:12. క్రీస్తును నమ్మితే లోలోపల నూరెడి నీటిబుగ్గవంటి సంతోషకరమైన ఎడతెగని అనుభవము దొరుకుతుంది. యోహాను 4:14. మూతవేయబడినదంటే భద్రపరచబడినదని అర్థము. (యూదా 1).

వనమని 4:13 లో నున్నది – అవును. ప్రభువు తన భక్తులను కాయుచు చెట్లుగా వారిని పెంచుచున్నాడు. (కీర్తన 92:12).

సఖీ అని ఆమెను పిలుచుచు తిర్సా పట్టణమంత సుందరమైన దానివి నీవని ఆమెను కొనియాడుచు వర్ణించుచున్నాడు. 6:4. తిర్సా చాల యేండ్లు పదిగోత్రముల వారి ముఖ్యపట్టణము. (1 రాజులు 15:33). సంఘమే యొక పట్నము-ఆ పట్నానికి క్రీస్తు సొగసుండియున్నది. (మత్తయి 5:14, కీర్తన 149:4).

సైన్యముతో ఆమెకు దీటు. (6:10) వ్యూహితసైన్య సమభీకర రూపిణియని ఆమెను పిలిచెను-క్రీస్తు సంఘము సువార్తసేవలో యుద్ధమాడినట్టు శౌర్యముదాల్చి కార్యాల
చేయవలెనని దీని భావన. (2 తిమోతి 2:3, 1 తిమోతి 1:18).

సంధ్యారాగముతోను సూర్యచంద్రాదుల ప్రభావముతోను ఆమె అలంకరింప బడినట్టున్నది. (6:10). అవును, క్రీస్తు పునరుత్థాన శక్తి ప్రభావములు నమ్మినవారి కున్నవి గనుక వారు శోభిల్లకుండలేరు.

ఎఫెసీ 5:14 దీనికి సరిపోవుచున్నది. యెషయా 60:1 కూడ చెల్లుతుంది. కాబట్టి పరమ గీతమును మానివేయుము. దానిలో భక్తుడు మునుగుచును తేలుచును తగిన మేతకూడ కనుగొని సంతోషిస్తాడు. అయితే లేనిపోని విపరీతమైన వ్యాఖ్యానములనుగూర్చియు సరికానివారు దీనిలో పాప ప్రేరితముగా బోధించుచున్న అన్యబోధలను గురించియు జాగ్రత్త పడుమని చదువరులను హెచ్చ రించుచున్నాను.

క్రీస్తు శిష్యులు – ఆయన రాజ్యము

క్రీస్తు శిష్యులు – ఆయన రాజ్యము

ప్రశ్న:- నా రాజ్యము వచ్చుట చూడనిదే మీలో కొందరు మరణము రుచిచూడరని క్రీస్తు మత్తయి 16:28 లో అనెను. అలాగైతే క్రీస్తు శిష్యులు కొందరు నేటివరకు బ్రతికియున్నారా? లేక ప్రాణముతో ఆ శిష్యులలో కొందరు అప్పుడే ఆ రాజ్యమును చూచిరా?

జవాబు :- ఆ శిష్యులలో నెవరైన నేటివరకు బ్రతికియున్నారా అంటే – అవును, బ్రతికే యున్నారు గాని భూలోకములో లేరు. పరదైసులోనే క్రీస్తు నిజమైన శిష్యులు నేటివరకు బ్రతుకుచున్నారు. అయితే క్రీస్తు చెప్పిన ఆ శిష్యులలో కొందరు అప్పుడే ఆ రాజ్యము చూచిరని తెలిసికొంటున్నాము. ఒక హెచ్చరిక – ఎప్పుడైన సత్యవేదములో నొక వచనము తొందరగా తీస్తే దానిముందు వెనుకలను పరిశీలించి చూడవలెను. లేకపోతే దాని అసలు అభిప్రాయం తేలదు.

క్రీస్తు చెప్పి చేయకుండునా? ఉండడు, గనుక మళ్లీ అవే వచనములను గమనించండి. మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట మీలో కొందరు చూతురని మత్తయి 16:28 లో నున్నది. సరే అయితే అధ్యాయము ముగిసినందున సంగతి ముగిసినదా? లేదు. అధ్యాయములనేవి దేవుని ఏర్పాటు కాదు. మత్తయి సువార్త యిన్ని అధ్యాయములుగలదానిగా మత్తయి వ్రాసెనా? లేదు. మత్తయి సువార్త యొకటే వ్రాతగా వ్రాయబడినది.

నాలుగు వందల సంవత్సరముల క్రిందట మనుష్యులే అధ్యాయములను నియమించిరి. త్వరలో ఫలాని వచనము దొరకే నిమిత్తమాలాగున చేసిరి. కాబట్టి 16:28 వరకు వచ్చి నిలిచిపోకూడదు. చదువుచునే ముందుకు వెళ్ళవలసినది. అప్పుడు 17 అధ్యాయములో దాని నిజసంగతి తెలిసికొండి. మీలో కొందరు నా రాజ్యమును జూతురని చెప్పిన ఆరు దినములైన తరువాత జరిగినదేమిటి? ఆ శిష్యులలో క్రీస్తు కొందరిని ఏర్పరచుకొని కొండెక్కి వారియెదుట రూపాంతరము పొందెను.

17:1-8 లో వ్రాసినది యిది గనుక క్రీస్తు 16:28 లో తానిచ్చిన వాగ్దానము 17:1-8 లో నెరవేర్చినట్లున్నది. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు అన్నట్టు ఆ పన్నెండుగురిలో ముగ్గురిని పిలుచుకొనిపోయి తన గొప్ప మహిమను వారికి కనుపరచగా నప్పుడే క్రీస్తు తన రాజ్యముతో వచ్చినట్టు పూర్ణముగా కాదుగాని చిన్నగానే జరిగెను. సూచనకొరకు అప్పుడే ఆ ఎత్తైన కొండమీద క్రీస్తు రూపాంతరము నొంది రాజుగా కనబడెను. ఆరు దినములైన తరువాత అంటే ఏడవదినము వచ్చినట్లున్నది. ఏడు బైబిల్లో పూర్ణసంఖ్యగా నున్నది.

క్రీస్తు రాజ్యము ఏడవ అనే అంకము అనుసరించి వస్తుంది. ఇదివరలో లోక చరిత్రలో అమాయక యుగము, మనస్సాక్షి యుగము, మానవపరిపాలన యుగము, వాగ్దాన యుగము, ధర్మశాస్త్ర యుగము, మొదలగు అయిదు యుగములు జరిగిపోయెను. ఇప్పుడు కృపాసువార్త యుగము ఆరవ యుగముగా సాగుచున్నది. దీని పిమ్మటనే ఏడవ యుగము క్రీస్తు వెయ్యియేండ్ల రాజ్యము అనే యుగము వస్తుంది. దానికి సూచనగా ఫలాని ఏడవ దినమున ఆ కొండమీద వారికి తన రాజ్య సంబంధమైన మహిమను ప్రత్యక్షపరచెను. మార్కు 9:1 లో వాగ్దానము చేసెను.

ఆరు దినములైన తరువాత సరిగా 9:2-8 లో వ్రాసినట్లు తానిచ్చిన ఆ వాగ్దానమును తాను నెరవేర్చెను. లూకా 9:27 లో వాగ్దానమిచ్చెను. 9:28, 36 లో ఆ వాగ్దానము నెరవేరినట్లున్నది. అయితే లూకా 9:28 లో కొంత మార్పు జరిగెను. రమారమి ఎనిమిదిదినములు జరిగెనని లూకా సూచించుచున్నాడెట్లనగా వారా దర్శనము చూచినది రాత్రిపూటని నమ్ము చున్నాము.

ఎందుకనగా నిద్రలో నుండిరని లూకా 9:32 చెప్పుచున్నది. కాబట్టి ఆరు దినములు జరుగగా ఏడవ రోజున కొండయెక్కి రాత్రి అనగా ఏడవ దినముయొక్క రాత్రిలోనే ఆ రాజ్యమును గాంచిరి. గనుక రమారమి అది ఎనిమిదవ దినమున జరిగిన దర్శనమని మొత్తానికి చెప్పిన చెప్పవచ్చును. ఆలాగే క్రీస్తు రాజ్యమేలి కడకు దానిని తండ్రి కప్పగిస్తే అంతట ఎనిమిదవ కడపటి నిత్యయుగమారంభించునని నమ్ముచున్నాము. (1 కొరింథీ 15:24-28).

అయితే కొందరు ఆక్షేపిస్తారేమో అనగా కొండమీద జరిగినది రాజ్యమేనా? అయితే పేతురు తానే తన రెండవ పత్రిక 1:16-21 లో స్పష్టముగా అప్పుడే కొండమీద ఆయనతో నుండగా ఆయన శక్తిని ఆగమనమును కన్నులారా చూచితిమని ఒప్పుకొంటున్నాడు. మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద నుండగానే వచ్చిన ఆ శబ్దము వింటిమి.

ఆయన ఘనతయు మహిమయు పొందగా జూచితిమని పేతురు సాక్ష్యమిచ్చి ఆ రూపాంతరమనేది రాబోవు క్రీస్తు రాజ్యసంబంధమైనదని వ్యాఖ్యానించి చెప్పు చున్నాడు. తండ్రియైన దేవుడు ఆ సమయమున ఆకాశమునుండి ఈయన నా ప్రియ కుమారుడని పలికి ఆ శిష్యుల యెదుట క్రీస్తుకు ఘనతను మహిమను యిచ్చెను. రాబోయే గొప్ప రెండవ రాకడకు చిన్న సూచనగా అదంతయు జరిగెను గనుక ఆ పన్నెండుగురిలో ఫలాని ముగ్గురు అప్పుడే క్రీస్తు తన రాజ్యముతో వచ్చుట చూచి ఆనందించిరి. మీలో కొందరు చూస్తారని క్రీస్తు పలికెను.

ఆ మాట పలికిన క్రీస్తు వారమురోజుల లోపలనే దానిని సంపూర్తి చేసెను. కాబట్టి నేటివరకు ఆ శిష్యులలో కొందరు బ్రతికియున్నారా అనే ప్రశ్న అసంగతమైనది. అప్పుడే నమ్మకస్థుడైన క్రీస్తు తాను పలికినదానిని నెరవేర్చెను. రాజ్యములో క్రీస్తు నీతిసూర్యుడుగా ప్రత్యక్షమగును. మలాకీ 4:2). దానికి ముంగుర్తుగా క్రీస్తు ముఖము ఆ కొండమీదనే సూర్యునివలె ప్రకాశించెను. రాజ్యములో క్రీస్తు గొప్పగా తండ్రివలన ఘనత మహిమలను పొంద బోతాడు. దానికి ముంగుర్తుగా ఆ కొండమీద ముగ్గురి యెదుట క్రీస్తు ఘనపరచబడెను. మోషే ఏలీయాకూడ నుండిరి.

మోషే అనగా చనిపోయి లేచినవారికి గుర్తు. ఏలీయా అనగా చనిపోక సజీవులుగా నిలిచే వారికి గుర్తు. క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తునందుండి చనిపోయినవారు మొదట లేచి నిలుస్తారు. సజీవులుగా నిలిచియుండేవారు మార్పు చెంది నిలుస్తారు. వారు వీరు కలిసి మేఘములమీద కొనిపోబడి క్రీస్తు మహిమ చూచెదరు. (1 థెస్సలోని 4:16-18). ఆయన మాట వినుడి యని ఆ దివ్య మహిమలోనుండి శబ్దము వచ్చినట్లు క్రీస్తు తన రాజ్యముతో సరిగా వస్తే సర్వ లోకమును సహస్ర సంవత్సరమువరకాయన మాట విని ఆయన చెప్పినట్టే నడుచు కొనవలెను. (జెకర్యా 14:9).

కాబట్టి ఆ కొండమీద నప్పుడే తాను వాగ్దానము చేసినట్టు క్రీస్తు చిన్నగా చిన్నగుంపులవారికి తన రాజ్యము వచ్చుటను కనుపరచెను. మీలో కొందరు నా రాజ్యమును చూతురనెను, ఆలాగే వారము రోజుల లోపలనే ఆ కొండమీద జరిగెను. దీని సరియైన వ్యాఖ్యానమిది, మీరాయన రాజ్యము చూడ బోతారా.

క్రీస్తు దేవుడు కాడా?

క్రీస్తు దేవుడు కాడా?

ప్రశ్న: క్రీస్తు సర్వాధికారియైన దేవుడని నమ్ముచుంటిమి గాని 1 కొరింథీ 15:28 ఎట్లు? క్రీస్తు దేవుడైతే ఆయన దేవునికి లోబడుట ఎట్లు?

జవాబు:-

క్రీస్తు దేవుడనియు దేవునితో సమానుడనియు వారిరువురొక్కరే యనియు నిరూపించతగిన వచనములు దండిగానున్నవి. ఫిలిప్పీ 2:6, యోహాను 1:1, 10:30. అయితే ప్రశ్న పంపినవాడు వారిరువురిలో జగడమున్నట్టు భావించి ప్రశ్న అడుగు చున్నాడు. కుమారుడు తండ్రికి లోబడితే లోబడు కుమారుడెట్లు తండ్రితో నేకమై యుండగలడని ప్రశ్న లేచుచున్నది గనుక లోబడుటలో హీనభావమున్నదా? మనలో నట్లుండవచ్చును గాని తండ్రి కుమారులలో నట్టిది లేదు.

తండ్రీ, మనమేకమై యున్నామని క్రీస్తు అనగలడు. (యోహాను 17:11,22). మరొకప్పుడు యోహాను 5:23 లో తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని చెప్పగలడు గాని అదే క్రీస్తు మరొకప్పుడు తన తండ్రి యాజమాన్యమున నొప్పుకొనుచు యోహాను 10:29 లో నా తండ్రి అందరి కంటె గొప్పవాడని వెలిపుచ్చెను. దీనికిని ముందు తాను చెప్పినవాటికిని ద్వంద్వార్థమున్నదా? లేదు. అందులో మనకూ నేర్పు రావలెను. అందులో మర్యాదక్రమము లెట్టివో నేర్చుకొనవలెను.

1 కొరింథీ 11:3 లో మరియొకసారి శిరస్సత్వమునుగూర్చి బోధింపబడు చున్నాము. సంఘములో కృపమట్టుకు స్త్రీగాని పురుషుడుగాని భేదము లేదు. గలతీ 3:28 సరిగానే యున్నది. అయితే పరిచార ధర్మము నిమిత్తము వారివారి క్రమములు చెల్లవద్దా? గనుక రక్షింపబడిన ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సైయుండగా సంఘములోని స్త్రీకి కూడ పురుషుడే శిరస్సుని చెప్పబడినది. కృపలో భేదము లేకుండగా సేవ క్రమములో కూడ భేదము లేదంటారా? భేదమున్నది. స్త్రీ క్రీస్తు సంఘములో అధికారము వహించరాదు. గనుకనే ఆమెకు పురుషుడు శిరస్సని వ్రాయబడినది. దేవుడును క్రీస్తును ఏకమే గాని మన పాఠముకొరకును నేర్పుకొరకును క్రమము అనే దాని క్రిందను శిరసత్వమనే అంశములోను వ్రాయబడినదేమనగా క్రీస్తుకు శిరస్సు దేవుడే.

ఈ భావము క్రిందనే 1 కొరింథీ 15:28 వ్యాఖ్యానము కావలెను. వెయ్యియేండ్లేమో క్రీస్తు తన స్వంత సింహాసనముమీద నాసీనుడై రాజ్యమేలును. నా సింహాసనమని ప్రకటన 3:21 లో లిఖింపబడినది గమనించండి. ఆరు పర్యాయములీ సహస్ర రాజ్య కాలము చెప్పబడినది. (ప్రకటన 20:2,3,4,5,6,7). ఆ వెయ్యి సంవత్సరముల పిమ్మటనే 1 కొరింథీ 15:28 చొప్పున క్రీస్తు సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి రాజ్యపరిపాలన చేసి ఆఖరికి గొప్ప శత్రువైన మరణమును నశింపజేసి దేవుడే సమస్తములో సర్వమగు నిమిత్తము కుమారుడైనను తండ్రికి లోబడి రాజ్యమును ఆయనకే నప్పగించును. (1 కొరింథీ 15:24-28).

ఆ రాజ్యము నిత్య రాజ్యమనియు అంతము లేని రాజ్యమనియు చెప్పబడినందున రెండు భాగములుగా దాని విభజించి వెయ్యియేండ్ల మట్టుకు క్రీస్తు తన భక్తులతో పరిపాలన చేసిన పిదప మిగతా కాలము అనగా నిత్యత్వములో మొదటి సహస్ర సంవత్సరములు జరిగితే బాకీకాలము క్రీస్తు తండ్రితోకూడ ఆ రాజ్యము నేలునని తెలిసికొంటున్నాము. వెయ్యి యేండ్ల తదనంతరము ప్రకటన గ్రంథములో జూస్తే రాజ్యము ఉమ్మడి రాజ్యమై పోయినట్టు గోచరించుచున్నది. దేవునియొక్కయు గొర్రెపిల్లయొక్కయు సింహాసనమని కనబడుచున్నది. (22:3, 21:22,23).

ఈ వచనములలో దేవుని శబ్దము ముందు, కుమారుని శబ్దము వెనుక వచ్చినవి. 1 కొరింథీ 15:28 నెరవేరినట్లుగా తండ్రియైన దేవుడు సర్వమాయెను. (నిత్యత్వమునకు అంతములేదు. గనుక నిత్యత్వములోని బాకీ కాలమనేది అసంభవము. అయితే సంగతి వివరణకొరకే అట్లు వ్రాస్తినంతే).

ఇస్కరియోతు యూదా

ఇస్కరియోతు యూదా

ప్రశ్న:- మీరు పన్నెండు సింహాసనములమీద ఆసీనులై రాజ్యమేలుతారన్నప్పుడు యూదా ఇస్కరియోతు గుంపులో లేడా? గనుక తప్పక అతనికి గతియున్న ట్లున్నది గదా? పశ్చాత్తాపపడెను గనుక పాపక్షమాపణ అతనికి లేదా? ఎందుకు లేదు?

యేసుప్రభువు మత్తయి 19:28 లో పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పుచు మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములకు న్యాయము తీర్తురని చెప్పెను.

అయితే అపొస్తలుల కార్యములలో 1:25,26 వచనములలో ఉరివేసు కొని చనిపోయిన ఇస్కరియోతు యూదా పోగొట్టుకొనిన ఆ స్థానమునకు మత్తీయ అనువాడు పన్నెండవ అపొస్తలుడుగా నియమించబడెను. యేసు ప్రభువు మత్తయి 19:28 లో “మీరును” అని వాగ్దానము చేసినపుడు యూదా కూడా వారిలో ఒకడుగా నుండెను. అనగా ఆ వాగ్దానము అతనికికూడ చేయ బడెను. వాగ్దానము చేయబడిన యూదా, లేక అతని స్థానములో నియమింప బడిన మత్తీయ, ఎవరు ఆ పన్నెండవ సింహాసనమునకు అర్హ్వుడు?

అసలు మత్తయి 27:5 లో యూదా ఉరివేసికొని ఆత్మహత్య చేసి కొనెను. అట్టివాడు పరలోకము చేరడుగాని నరకమే వాని గతి అని నా నమ్మకము. అయితే ఇస్కరియోతు యూదా యేసుయొక్క శిష్యుడే గదా! ఆయనను అప్పగించినప్పటికిని మత్తయి 27:3 లో తిరిగి పశ్చాత్తాపపడెను గదా! అతనికి క్షమాపణ ఎందుకు లేదు? పరలోకములో అతనికి స్థలము
ఎందుకు లేదు?

జవాబు:-

ఇస్కరియోతు త్రోసివేయబడెను. ఇకను పన్నెండుగురిలో అతడెంచబడరాదు. మీరు అని క్రీస్తు ఆ వచనములో ఇస్కరియోతుతోకూడ మొత్తమునకు పన్నిద్దరని సూచించి చెప్పినను, మీరనిన ముందెలివిగల ప్రభువు జరగబోవు కార్యములన్నియు నెరిగి ఆ మీరు అని వచించెనని నమ్ముచున్నాము. తన్ను అప్పగింపబోవువాడెవడో మొదటినుండి యేసుకు తెలియును. (యోహాను 6:64). కాబట్టి మీరు అని యూదా ఇస్కరియోతును కలిపి మాటలాడినను ఆ వేళకు మొత్తముమీద మాత్రము ఆ వాక్యము పలికెనని అర్థమవుచున్నది.

మీరు ఆ పన్నెండు సిహాసనములమీద ఆసీనులై యుందురని వక్కాణించిన క్రీస్తు తానే అటు పిమ్మట తన్నప్పగించినవానిని గురించి ఆ మనుష్యుడు పుట్టకుంటే వానికి మేలని సెలవిచ్చెను. (మత్తయి 26:24) ఇస్కరియోతు యూదా నిత్యగతి నాశనమే అని చెప్పుటకే సందేహము లేదు.

అతడు అపవాదియని పిలువబడెను. క్రీస్తు తానే యిట్లు అతని పిలిచెను. (యోహాను 6:70). అపవాది పరదైసులో నుండగలడా? ఇస్కరియోతు ఉరిపోసుకొని తన చోటికి వెళ్ళెనని అపొ.కా. 1:25 లో వ్రాయబడినది. అపవాది చోటేది? సందేహించుటకు వీలున్నదా? లేదు.

మరియొకప్పుడు నాశనపాత్రుడని అతని పిలిచిన క్రీస్తు యోహాను 17:12 లో తేటగా అతడు నశించెనని తెలియచెప్పెను. అవును అతడే తప్ప ఆ గుంపులో నింకెవ్వరును నశించలేదు.

అతడు విశ్వాసి కాడు. (యోహాను 6:64).

అతడు పవిత్రుడు కాడు. (యోహాను 13:10,11).

అతడు దొంగ, చందాసొమ్ము సహితము అతని కడ్డము లేదు. (యోహాను 12:6)

పనిలో నుండెను సరే గాని ఆ గొప్ప పనిలోనుండి తప్పిపోయి యివ్వబడిన పరిచర్య పోగొట్టుకొనెను. (అపొ. కార్య. 1:25). కాబట్టి పన్నెండు సింహాసనములలో నొకటి ఇస్కరియోతు యూదాది కాదని అతి స్పష్టముగా గ్రహించియున్నాము.

అతడు పశ్చాత్తాపపడలేదా అంటే పశ్చాత్తాపమువంటి మారుమనస్సు అనేది రెండు విధములైనవి. మరణార్థమైనది. జీవార్థమైనది. 2 కొరింథీ 7:10 లో దేవుని చిత్తానుసారమైన దుఃఖమును, లోకసంబంధమైన దుఃఖమును రెండు చెప్ప బడినవి. ఒకటి రక్షణకరమైన మారుమనస్సు కలుగజేయునుగాని రెండవది మరణము నకే కారణమగును.

ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడి వచ్చి రూకలు పడవేసిన సంగతి మత్తయి సువార్త 27:3 లో వ్రాయబడినది. సరిగాని యిట్లు దుఃఖపడుచు దారికి వచ్చెనా? రాలేదు. చీకటిలోనే యుండిపోయి తన పాపములో నశించిపోయెను. పశ్చాత్తాపము సరే గాని రాజైన ఫరో యొక మాదిరిగా పశ్చాత్తాపపడలేదా? పడిలాభమేమి? ఇశ్రాయేలీయులను తరుమక మానలేదే. నిర్గమ 9:27 లోను 10:16,17 లోను చక్కగా రెండు మారులు నేను పాపము చేసియున్నానని మోషేతో నొప్పుకొనెను.

ఒప్పుకొని ఆలాగే 9:34 లో నున్నట్లు ఇంకను పాపము చేయుచు తన హృదయమును తానే కఠినపరచుకొనుచు వచ్చెను. ద్రోహియైన రాజగు సౌలు దావీదుతో “నేను పాపము చేసితిననెను” (1 సమూయేలు 26:21). అయితే ఆలాగు పాపము ఒప్పు కొనిన సౌలు దారికి వచ్చి రక్షింపబడి దావీదును తరుముట మానివేసెనా? లేదే, గనుక ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడెనంటె రక్షణ వేరు పశ్చాత్తాపము వేరని తెలిసికొనవలెను. రక్షణకరమైన పశ్చాత్తాపము యూదాకు లేదాయెను. అపొ. 11:18 లో వర్ణింపబడిన జీవార్ధమైన మారుమనస్సు యూదాకు లేదాయెను.
మనోవేదన కలిగి ఆ రూకలు తీసుకొని వచ్చెను గాని 2 తిమోతి 1:3-5 ప్రకారమైన నిష్కపట మైన విశ్వాసము అనేది యూదాకు లేదాయెను.

ఏడ్పు రక్షణ కాదు, దుఃఖము రక్షణ కాదు, దొంగిలిన కొన్ని వస్తువులు వాపసు తీసుకొని వచ్చి యిచ్చివేస్తే రక్షణ కాదు. పశ్చాత్తాపము రక్షణ కాదు, మారుమనస్సు రక్షణ కాదు. దగ్గరకు వచ్చి పొందకుండ పోయిన ఇస్కరియోతులో మానవుని హృదయమెంత మోసకరమైనదో గ్రాహ్యమగు చున్నది.

ఆలాగైతే పన్నెండవ అపొస్తలుడెవడు? ఇస్కరియోతు తప్పిపోతే పన్నెండుగురు పదకొండుమందియైరి. పదకొండనే సంఖ్య గమనించండి. (మత్తయి 28:16; మార్కు 16:14; లూకా 24:9,33; అపొ. 1:13; 1:26; 2:14). అయితే పదకొండు మంది మత్తీయతో మళ్ళీ పన్నెండు గురైరి. (అపొ. 2:14; 6:2; 1 కొరింథీ 15:5). అయితే ఈ మత్తీయ కొద్దిగా ఆరంభములో చేర్చబడినట్లుగా కనబడి మళ్ళీ ఇంకెక్కడ కనిపించ కుండ పోయేది ఆశ్చర్యమే. మొత్తానికి అపొ. 2:14 లో నున్నాడు, 6:2 లో నున్నాడు. గాని ఆయన పని వివరము కొంచెమైన లేకపోవుటవలన అతని అపొస్తలత్వమును గూర్చి సంశయించుచున్నాము.

వట్టి చీట్లు వేయుట వలన వీడు తేలెను ఇది సరియా?

పెంతెకొస్తు జరుగకముందే ఇది జరిగెను.

ప్రభువే మత్తీయను నియమించినట్టు తేటగా నెక్కడ సూచన లేదు. గనుక మానుష్యముగా అపొస్తలత్వము నకు పిలువబడెనేమోయని కొంత ఆలోచన మనస్సులో జన్మించుచున్నది.
“నేను అపొస్తలుడను కానా? నేను ప్రభువైన యేసును చూడలేదా?” అని మరియొకడు 1 కొరింథీ 9:1 లో అంటున్నాడు. అపొస్తలునియొక్క గుర్తువంటి చిహ్నములు వీనిలో దండిగ నున్నవి. 2 వ కొరింథీ 12:12 మరియు 1 కొరింథీ 15:10 లో వాస్తవముగా వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితినని సాక్ష్యమిచ్చుచున్నాడు. వీడెవడు? అవును. పౌలే కాబట్టి సరిగా మహిమపరచబడిన క్రీస్తుచేత పన్నెండవ అపొస్తలుడుగా ఏర్పరచబడినవాడు ఈ పౌలే అని నమ్ముచున్నాము. మత్తీయ మానవుని కృతముగా వచ్చినవాడు. పౌలైతే పరలోకమునుండి నియమింపబడినవాడు.

ఏది యెట్లున్నను సింహాసనములు పదమూడు లేవు. అపొస్తలుల సంఖ్యకూడ పద మూడు కాకూడదు. రాబోయే పట్టణముయొక్క ప్రాకార పునాదులు గొర్రెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పన్నెండు పేళ్ళతోనే యున్నవని ప్రకటన 21:14 తెల్పుచున్నది. కాబట్టి అపొస్తలుల లెక్క హెచ్చినట్లు పదమూడుగాని తక్కువైనట్టు పదకొండుగాని రాకూడదు.

పన్నిద్దరే అపొస్తలులుగా నియమింపబడవలెను. కాబట్టి ద్రోహము చేసి వెళ్ళిపోయిన ఇస్కరియోతు యూదా స్థానాన్ని పౌలే తీసుకున్నాడనియు రాబోయే కాలమందు మత్తయి 19:28 చొప్పున పన్నెండు సింహాస నములలో నొకటి యూదాకు కాదు గాని యూదామతస్థుడుగానుండి మార్పుచెంది రక్షింపబడిన పౌలు అనబడిన సౌలుకే చెందునని దృఢముగా తీర్మానించుచున్నాము.
గనుక మత్తీయ స్థానానికి పౌలే వచ్చినాడా రాలేదా యని సందేహించవచ్చును గాని ఆ పన్నెండు సింహాసనములలో నొకటి ఇస్కరియోతు యూదాకు వస్తుందా రాదాయని సందేహించరాదు.

నిర్వివాదాంశ ముగా ఇస్కరియోతు యూదా ఆ గుంపులోనుండి మంచి నేర్పుక్రింద జీవించి మంచి మాదిరితో ఆవరింపబడినను పట్టిన పట్టు వదలక తుదకు విశ్వాసము లేనివాడై పోయినందున తప్పిపోయి తనచోటికి వెళ్ళి నశించెనని తేటతెల్లమాయెను.

చదువరీ, మీరుకూడ నింత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినయెడల నెట్లు తప్పించుకొందురని మిమ్మును హెచ్చరించుచున్నాను.

ఆదివారము పనిచేయవచ్చునా?

ఆదివారము పనిచేయవచ్చునా?

ప్రశ్న:- ఆదివారమునాడు పనిచేయవచ్చునా? వాక్యమేమనుచున్నది? ఆది వారమున పనికిపోయే క్రైస్తవుని నిర్గమ 20:10; లేవీ 23:7 ప్రకారము వెలివేస్తామా, సంఘములో నుండ నిచ్చెదమా?

జవాబు :-

ఆచారము క్రింది కాడిగా దేవుని ప్రస్తుతపు పిల్లలను చేర్చి దాసత్వము వారిచేత జరుపుట అసాధ్యము. ఆలాటి దాస్యమును కాడిక్రింద కాలమిప్పుడాచరణలో లేదు. గలతీ 5:1 చూడండి. అయితే ఫలాని ఆదివారము ఆచరణలో లేదు గనుక దినములన్నియు మనమే యిష్టానుసారముగా ఆదివారమును కూడ వినియోగించి వెళ్లబుచ్చుకొందామంటే అవసరముగా కూడుకొనుట అనేది ఏమాయెను? అది లేకుండ పోవచ్చునా? సంఘముగా లేక సమాజముగా కూడుకొనుట తప్పిపోవచ్చునా? అది వలదా? హెబ్రీ. 10:25 దీనికి జవాబు.

క్రీస్తు భక్తులు సమాజముగా కూడుకొని 1 వ కొరింథీ 14:26-28 లో వ్రాసినట్లు ఒకరి నొకరు హెచ్చరించుకొని బోధపరచి మరియు 1 కొరింథీ 10:16, 11:25 లో నున్నట్లు ఆ రొట్టె విరిచి ఆ రసము త్రాగి క్రీస్తును జ్ఞాపకము చేసికొనుట మిక్కిలి అవసరము. అట్లు కూడుకొనుట మానరాదని హెబ్రీ 10:25 లో నున్నది. సరి, ఏ దినమున కూడుకొన యుక్తమైనది? దానికికూడ జవాబున్నది. యాత్రలో నుండి త్రోయకు వచ్చిన భక్తులా పట్నములో ఏడు దినములు గడిపిరి గాని ఆ ఏడు దినముల సంబంధమైన వారి చర్య మనకు తెలుపబడలేదు. అపొ. 20:6 లో చూడండి.

అయితే 20:7 లో వ్రాసినది గమనించండి. ఆదివారము రాగానే వారు కూడుకొని రొట్టె విరిచి ప్రసంగము విని యొకరితో నొకరు సహవాసము సలిపినట్లు మన నేర్పు నిమిత్తమును మరియు మన మాదిరి కొరకును వ్రాయబడినది. ఆ రోజు కొరకే వారు కనిపెట్టినట్లున్నది. ఆ రోజే ప్రభువు దినము. (ప్రక 1:10). ఆ రోజున క్రీస్తు భక్తులు కూడుకొని తమ చందాలు తమ దగ్గిర నిలువచేసికొనిరి. (1 కొరింథీ 16:2). కాబట్టి ఆరంభకాలమందుండిన క్రీస్తు భక్తులు చేసినట్టు క్రీస్తును నమ్మిన మీరీ దినములలో చేస్తే మంచిది.

ప్రశ్నలో క్రీస్తు దినమైన ఆదివారముతో కూడ క్రీస్తును నమ్మిన వారిమట్టుకు గతించిపోయిన పాత ధర్మశాస్త్ర సంబంధమైన సబ్బాతు దిన సంబంధమైన వచనము లను చేర్చుట సరికాదు. ఆదివారము వేరు. శనివారము వేరు. క్రీస్తును నమ్మినవారు ధర్మశాస్త్రము క్రింద నేటివరకుంటే వాదమే లేదు. నిర్గమ 20:10, లేవీ 23:7 అనుసరించి శనివారము నాడు ఏ పనికీ వెళ్లకూడదు. అయితే శని ఆదివారములను కలుపుట సరిలేదు. మరియు రోమా 6:14 ప్రకారము నమ్మినవారు ధర్మశాస్త్రము క్రింద లేరని స్పష్టమాయెను. రోమా 7:4 ప్రకారము క్రీస్తు పిల్లలిప్పుడు ధర్మశాస్త్రము విషయమై మృతులైరి. దాని విధులనుండి విడుదల పొందిరి. (రోమా 7:6).

కాబట్టి యిట్టి స్వాతంత్ర్యము పొందినవారిమీద చట్టముగా నిర్గమ 20:10, మరియు లేవీ 23:7 మోపలేము. ధర్మశాస్త్రముయొక్క అక్షరమునకు చనిపోతిమి గనుక ఆ పాత శనివార సంబంధమైన హక్కులిప్పుడు చెల్లవు, అక్షరముగా చెల్లవుగాని నీతిగా చెల్లుతవి అంటే ఆ పాత అక్షరము కూడదు. 2 కొరింథీ 3:6 చూడండి. కావున అక్షరాలగా నిప్పుడు క్రీస్తును నమ్మిన వారిమట్టుకు నిర్గమ 20:10, లేవీ 23:7 ఆచరణలో లేవు. అక్షరము అమలులో లేకపోయిన ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి అనేది గతించిపోలేదు. అది విశ్వాసులలో నెరవేరవలెను. రోమా 8:3,4 ప్రకారము ఆ నీతి విధి అవసరముగా నిలిచినది. తేలినదేమనగా-

ఏడు దినములలో నొక దినమును వేరుగా నుంచేది నీతివిధిగా నిప్పుడు నెరవేరుట కావలెను. మోషేకు ముందు మరియు ధర్మశాస్త్రము నకు ముందు యెహోవా దేవుడు తానే యేడు రోజులలో నొకటి వేరుగా నుంచి పెట్టెను. (ఆది 2:1-3). ప్రతి దినము నరుడు పనిచేస్తే త్వరలో సమసిపోతాడు. పశువుకూడ యేడు రోజులలో నొక రోజు పనికిపోకుండ విశ్రాంతిగా నుండేది మంచిది. శాస్త్రజ్ఞులు జీవములేని తమ యంత్రములనుగూర్చి కూడ యేడు దినములలో నొక రోజు యంత్రమును విశ్రాంతిగా నుంచకపోతే వేగిరముగా చెడిపోతుందంటున్నారు. కాబట్టి చట్టముగా కాదు, ధర్మశాస్త్రము ప్రకారముగా కాదు గాని దేవుని పాత నీతి చట్టము అనుసరించి నట్టుగా ఏడు దినములలో నొక దినమును వేరుగా నుంచిపెట్టేది న్యాయమైయున్నది.

ఆ దినము శనివారము కాదు ఆదివారమే అని తెలియుచున్నది. గనుక క్రీస్తు విశ్వాసులు ఆదివారమును పెట్టుకొంటే మంచిదని యెరుగుచున్నాము.

శరీర సౌఖ్యముకొరకును, ముఖ్యముగా క్రైస్తవ సహవాసము కొరకును, పాత నీతి విధిని నెరవేర్చేదానికొరకును ఆ దినమును ప్రత్యేకపరచ యుక్తమైనది. యేడు దినములు పనికిపోతే అత్యాశ పెరిగినదని తేలినది జాగ్రత్త! వారములో యేడు దినములు పనికిపోతే క్రైస్తవ కూటాలెట్లు? గనుక నిలుపుదలచేసి రూపాయలమీద నెక్కువ ఆశపడకుండ వారములో నొక రోజును వేరుపరచి జీవనోపాధియైన పనిచేయకుండపోతే చాలా యోగ్యమైనది. కొన్ని పర్యాయములు నమ్మిన వారందరికి నిట్లు వీలుపడదు. రైలు పనివారేమి, పోలీసు పనివారేమి, ఆస్పత్రి పనివారేమి ప్రతి దినము జరిగే పని వారిది. అయినను ప్రభువు సహాయముచేసి ఆదివారములోకూడ యుక్త ప్రవర్తనగా విధేయులైన వారిని నడిపిస్తాడు. మోపైన చట్టముగా శనివారమును ఆచరించుట పాలస్తీనులో జూచితిని.

శుక్రవారం సాయంకాలము ఆరుగంటలు కొట్ట గానే ఇశ్రాయేలు రాజ్యములో బండ్లు, మోటార్లు, రైలుబండ్లుకూడ అన్నియు నిలిచి పోవును. అంగళ్ళనుకూడ మూసివేస్తారు. శనివారము సాయంకాలము ఆరుగంటల దాకా యూదుల రాజ్యమైన ఆ ఇశ్రాయేలు వారు నిర్గమ 20:10; లేవీ 23:7 అనే వాక్యముల క్రింద మూయబడియున్నారు. వారు క్రొత్త నిబంధన క్రిందికి నింక రాలేదు. గనుక పాతదానిలోనే నిలిచి, యిట్లు ఆ పాత వాక్యములను అక్షరాలగా అనుసరించుచున్నారు. వారి సంగతి వేరు. క్రీస్తును నమ్మి క్రొత్త నిబంధన క్రిందికి వచ్చినవారి సంగతి వేరు.

గనుక ఆదివార సంబంధముగా చెల్లని శనివార వచనములను తీసుకొని వచ్చి క్రీస్తు భక్తునికి తీర్పు తీర్చి ఫలాని రోజున పనిచేసినందుకే సంఘములోనుండి వానిని వెలివేయరాదు. సంఘములోనుండి యొకని వెలివేయతగిన కారణములు 1 కొరింథీ 5:11 లో అతి స్పష్టముగా చెప్పబడినవి. ఆదివారమునాడు పనిచేసిన కార్యము వాటిలో నిమిడివున్న యొక కారణము కాదు జాగ్రత్త ! అయితే నొకటి – లోభి అనే మాట యున్నది.

ఒకడు విశ్వాసియైనట్లు పేరుపొంది రూపాయిలు సంపాదించేదానిలో దిగి అవసరము నిమిత్తము కాదు మరియు నిర్బంధన క్రింద కాదు గాని రాగలిగినప్పుడు సహా సారి సారి ఆదివవారము వచ్చినప్పుడు కూటాలకు రాక అలాగే లోభిత్వముగలవాడైనట్టు అన్యాయముగా తన జీవితములో ఆ చెడు మనస్సు చూపితే నట్టివానిని విచారించి అతడు దిద్దుకొనకపోతే సంఘములోనుండి వెలివేయవచ్చును. వట్టి ఆచారముగా ఆదివారమును మీరినందుకు కాదు. అతడు రాగల్గి రాక సరిగా నుండగల్గి సరిగా నుండక తన లోభిత్వములో క్రీస్తును అవమాన పరచినందునను క్రైస్తవ సహవాసమును కేవలము నిర్లక్ష్యము చేసినందునకును వెలికి యోగ్యుడాయెను. త్వరపడి వాక్యమును మించి వారిని వీరిని వెలివేయరాదు. వాక్యమును లోపించి చేయవలసినది చేయక పాపులను సంఘములో నుండనియ్య రాదు. వెలివేయ తగిన కారణములు గలవు. వెలికి యోగ్యము కాని కార్యములు గలవు. కనిపెట్టి అతిక్రమించకుండ జాగ్రత్తపడవలెను.

ఆవగింజంత విశ్వాసము

ఆవగింజంత విశ్వాసము

ప్రశ్న :- ఆవగింజంత విశ్వాసముతో కొండలను పెల్లగించుట అంటే అర్ధమేమి? మత్తయి సువార్త 17:20,21 లోని భావము వివరించుడి.

జవాబు :-
ఆవగింజ బహు చిన్నది గాని దాని విషయమై క్రీస్తు విరివిగాను ఆశ్చర్యకరము గాను బోధించెను. గింజలన్నిటిలో బహుగా పెరిగేది ఈ ఆవగింజని క్రీస్తు బోధించెను. మత్తయి 13:32, మార్కు 4:31,32; లూకా 13:19. దేవుని రాజ్యమెట్లో అట్టి వృద్ధి చెందు గుణము ఆ గింజలో నున్నదని క్రీస్తు వెలిపుచ్చెను. కాబట్టి ఆవగింజంత విశ్వాసము మనకుండవలెనంటే చచ్చిన విశ్వాసము పనికి రాదని తేటపడుచున్నది. మృత విశ్వాసము గలదు. కొందరి కట్టి క్రియలు లేని విశ్వాసమున్నది. (యాకోబు 2:26), మరియు కపటమైన విశ్వాసము 2 తిమోతి 1:3-5 లో సూచింపబడుచున్నది.

ఎట్లనగా తిమోతిలో నిష్కపటమైన విశ్వాస ముండగా అనేకులలో జాగ్రత్తలేనియెడల కపటమైన విశ్వాసముండ గలదని స్పష్టము. 1 థెస్స 3:10 లో విశ్వాసము చెప్పబడినది గాని దానిలో లోపమున్నట్లు వ్రాయబడినది. కాబట్టి నానా రకములైన విశ్వాసములు గలవు. అల్ప విశ్వాసము గలదు గనుక క్రీస్తు సారి సారి తన శిష్యులను గద్దించుచు అల్ప విశ్వాసులారా అని వారిని పిలిచెను. (మత్తయి 6:30, 8:26, 14:31, 16:8, లూకా 12:28). నమ్ముచున్నానని ఆ తండ్రి ఒప్పుకొనెను గాని అది యొప్పుకొను చుండగానే ఏమనెను? నమ్ముచున్నాను నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని క్రీస్తును వేడుకొనెను. (మార్కు 9:24).

విశ్వాసమున్నది గాని దాని ఆనుకొని అవిశ్వాసము కూడ నున్నది. కాబట్టి ఆ విశ్వాసము ఈ విశ్వాసముండగా జరుగదు, ఆవగింజంత విశ్వాసమే అగత్యము అనగా పెరిగే విశ్వాసము సరియైనది. పెరిగేది అంటే జీవముండి పెరుగుతుందని అర్థము కాబట్టి జీవముగల విశ్వాసము సరియైన విశ్వాసము. జీవముగల విశ్వాసము తప్పక వృద్ధిచెందుతుంది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నదని పౌలు ఆ థెస్సలొనీ భక్తులకు వ్రాస్తున్నాడు. (2 థెస్సలొనీ 1:3). ఇట్టి జీవము గల్గి పెరుగుచున్న విశ్వాసమే ఆవగింజవంటిది. ఇట్టి విశ్వాస ముండగా గొప్ప కార్యములు చేయగలము.

ఆవగింజంత విశ్వాసము రెండు పర్యాయ ములు చెప్పబడినది. (1) మత్తయి 17:20లోను (2) లూకా 17:6 లోను, కొండలను పెల్లగించుట ఎట్లనగా మనకు కల్గిన కష్టములే కొండలవంటివి లేదా మనమీద విరోధముగా లేచిన శత్రువులే కొండలవంటివారు. పడిపోయిన యెరూషలేము గోడలు కట్టవలెనని లేచిన జెరుబ్బాబెలు మీద ఆ పని ఆపుటకు గొప్ప చక్రవర్తియైన అర్తహషస్త నిలువబడెను. (ఎజ్రా 4:23,24). అయితే ప్రభువేమనెను? ఈ గొప్ప విరోధి కొండకాదు కొండకంటె పర్వతమంత పెరిగి అడ్డముగా నిలిచినను గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నెదుట నీవు చదును భూమిగా నుంటావని చెప్పబడినది. గనుక జెకర్యా 4:6,7 ప్రకారము భక్తుడైన జెరుబ్బాబెలు తనయెదుట నిలిచిన పర్వతమును పెల్లగించ గలిగియుండెను.

ఈ కాలమందు విశ్వాసులు క్రీస్తు గొప్ప శక్తి నెరిగి లోకులయెదుట జంకక ముందుకు సాగి సువార్తపని ధైర్యముగా చేయవలెను. వారు వీరు పర్వతముల వలె అడ్డముగా నిలిస్తే విశ్వాసముద్వారా అనగా ఆవగింజవంటి జీవముగల విశ్వాసము ద్వారాను జీవముగల తమ ప్రభువునందు వారానుకొనినందువలనను లోకమును లోక జనులను ఆ గొప్ప సువార్త విరోధులను జయించగలరు. (1 యోహాను 5:4).

లూకా 17:6 లో నైతే వేరొక అంశమున్నది – కంబళి చెట్టును పెల్లగించవలెనట. ఇదికూడ ఆవగింజంత విశ్వాసముతో జరుగవలెను, ఈ కంబళి చెట్టు ఏదనగా సహోదరుని సరిగా క్షమించకపోతే అడ్డముగా నొకనిలో పెరిగెడి గొప్ప ఆటంకమును సూచించుచున్నది. దినము ఏడుమారులు మీ పట్ల తప్పిదము చేసిన సహోదరుడు మారుమనస్సు పొందితిని గనుక నన్ను క్షమించుమని అడిగిన అనగా దినము ఏడుమారులు అట్లు అడిగిన నోర్పుతో ఆలాగే వానిని క్షమించవలసినదని క్రీస్తు దీనిలో వెలిబుచ్చెను. (లూకా 17:1-4).

ఇది వినగానే అపోస్తలులు ఆశ్చర్యపడి దీని పాటించలేక మా విశ్వాసము వృద్ధిపొందించుమని క్రీస్తును వేడుకొనిరి. పనిచేయు టకు విశ్వాసము కావలెను. అసలు ఆరంభములో రక్షణ పొందుటకు విశ్వాసము అగత్యము, అంతేకాదు క్షమించవలసినంత ప్రేమించి సహోదరుని క్షమించుటకు విశ్వాసము గొప్పగా కావలెను. మరియు ఈ మాటలు వినుచునే ప్రభువు ఆవగింజంత విశ్వాసమును మరియు దానితో కంబళి చెట్టును పెల్లగించడమును వివరించి చెప్పెను. అనేక భక్తులలో నొక చెట్టు అడ్డముగా పెరిగినది అది ఏ చెట్టు? కంబళి చెట్టే. అది దేనిని సూచించుచున్నది? మీ సహోదరుని మీద మీరాయాసపడినదే దీనిలో సూచించ బడుచున్నది, నేడే ఆ సహోదరునితో సమాధానపడుము. సహోదరీ నేడే ఆ స్త్రీతో మాటలాడుము. ఇట్లు చేయవలెనంటే విశ్వాసమే మిక్కిలి అవసరము.

క్రీస్తే విశ్వాసము నకు కర్తయు దానిని కొనసాగించువాడునై యున్నాడు గనుక విశ్వాసము పెట్టుకొని ఆ పాత ఈర్ష్యను, పగను, అసమాధానమును తీసివేసికొనండి. అప్పుడేమైనట్లు? మీరు ఆవగింజంత విశ్వాసముతో అడ్డముగానున్న చెట్టును పెల్లగించినట్టే ఆలాగు చేతురని ప్రార్థన.

ఎండిన యెముకలు

ఎండిన యెముకలు

ప్రశ్న:- యెహెజ్కేలు 37 వ అధ్యాయము వట్టి యుదాహరణము అని కొందరు చెప్పుచున్నారు. అవునా? ఈ అధ్యాయముయొక్క అర్థమేమి? వట్టి యెముకలు జీవము వచ్చి లేచి గొప్ప సైన్యమాయెనే, దీని భావమేమి?

జవాబు:-

క్రొత్త నిబంధనలో రాబోయే క్రీస్తు రాగా యాకోబుకే అగుపడి వారిలోనుండి భక్తిహీనతను తొలగించి వారిని జ్ఞాపకము చేయుటతో ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురని చెప్పబడియున్నది. (రోమా 11:25-27). వారు దేవుని పాత ప్రజలు. మరియు క్రీస్తుయేసును లోకమునకు దయచేసిన సంతతివారు. ఎందుకనగా శరీరమునుబట్టి క్రీస్తు యూదుడుగా పుట్టెనని మరువరాదు. గనుక దేవుడు తన పాత ప్రజలను విసర్జించెనా? అవును, మొత్తానికి విసర్జనక్రింద నున్నారు.

ఎందుకనగా మెస్సీయను చంపిన నేరముక్రింద నున్నారు. ఆయన రక్తము మా మీదను మా పిల్లలమీద నుండుగాకని కేకలువేసి శపించుకొన్నారు. అయినప్పటికిన్ని అన్యులమైన మన లెక్క సంపూర్ణము కాగా తాను విసర్జించిన ప్రజలను దేవుడు తిరిగి దీవించనైయున్నాడు. (రోమా 11:1). ఇప్పుడు యూదులు తొట్రుపాటులోనున్నారు, ఇప్పుడు క్షీణదశలోనున్నారు, విసర్జింపబడియున్నారు, విరిచివేయబడియున్నారు. అవును, ఈ వచనములు క్రొత్త నిబంధనలో సరిగానే చెప్పుచున్నవి.

అయితే క్షీణదశలో నున్న యూదులికమీదట ఐశ్వర్యములోకి వస్తారు. (రోమా 11:12). విసర్జింప బడిన వారిని ప్రభువికమీదట చేర్చుకొనబోవుచున్నాడు. (రోమా 11:15). విరిచి వేయబడిన కొమ్మలు తిరిగి అంటుకట్టబడును. కాబట్టి క్రీస్తు సంఘ చరిత్ర తీరిపోయిన పిమ్మట యూదులకు గొప్ప గతి చిక్కనైయున్నది. యెహెజ్కేలు 37:1-14 అదే సంగతి తెల్పుచున్నది.

దర్శనములో ప్రవక్త చూచిన ఆ బహుగా నెండిపోయిన యెముకలు పడిపోయిన ఇశ్రాయేలీయులకే సూచన – యెహెజ్కేలు 37:11. ఆ యెముకలు లేచి జీవముతో నిండి గొప్ప సైన్యముగునా? ఎవరును నమ్మరు. అసలు ప్రవక్తయైన యెహెజ్కేలు సహా ఈ యెముకలు బ్రతుకగలవా అని ప్రభువు తన్ను అడిగితే చెప్పలేక ప్రభువా, నీకే తెలుసునని అవిశ్వాసముతో ప్రత్యుత్తరమిచ్చెను.

ప్రస్తుతము చాలమంది క్రైస్తవులు, నికముందు యూదులకు గతియేమియు లేదని చెప్పుకొనుచున్నారు. అయితే ప్రకటన జరుగగా నెట్లు జీవము వచ్చి ఆ యెముకలలో ప్రవేశించెనో యికముందు అదేలాగున యూదులు దేవుని రాజ్యమును గురించిన ప్రకటన విని క్రమేణ దారికి వస్తారు, తప్పదు.

క్రమేణ కాదు క్షణములో వచ్చుచున్న క్రీస్తును చూచి ప్రలాపించి దారికి వచ్చి ఆయనను అంగీకరించి యొక దినములోగానే రక్షింపబడుదురు. (జెకర్యా 3:9; యెషయా 66:8). ఇప్పుడు యూదులు చచ్చి యెండిపోయినట్టున్నారు. వారిలో శేషము కృపచేత నీ దినములలో క్రీస్తును నమ్మియున్నప్పటికిన్ని విశేషము అనేది చావులోనే నిలిచియున్నది. అయితే మృతులైన యూదులిక సజీవులవుతారు, స్తోత్రము. (రోమా 11:15) ఇద్దరు దిగివచ్చి యూదులకు ప్రకటిస్తారు. (ప్రకటన 11:3).

యూదులలో ప్రథమఫలముగా నూట నలువది నాలుగువేలమంది ముద్రింపబడి సేవలో చేరుదురు. (ప్రకటన 7:1-8). ఏదియెట్లు న్నను మేఘారూఢుడై వచ్చుచున్న క్రీస్తును ఆయనను పొడిచిన ఆ యూదులే చూడ మార్పుచెందుదురు. (ప్రకటన 1:7; జెకర్యా 12:10). ప్రకటనచేతను, పరిశుద్ధాత్మ పనిచేతను, రాబోవుచున్న క్రీస్తు దర్శనముచేతను యూదులు మార్పుచెందుట నిశ్చ యము. (యెహెజ్కేలు 37:12-14). వారి సమాధులు తెరువబడునంటే వారున్న దేశాలు, వారున్న రాజ్యాలు, వారిని పట్టుకొనిన ఆయాశక్తులు విప్పబడగా యూదులు స్వతంత్రులై తమ అసలు దేశానికి మళ్ళీ వెళ్ళి సుఖింతురు. తూర్పు దేశాలలో యూదులు చెదరియున్నారు. పడమటికి పోయిరి.

ఉత్తర దిక్కున నున్నారు. దక్షిణములో సైతము దాగియున్నారు. అయితే యెషయా 43:5,6 చూడండి – నా ప్రజల నప్పగించుమని చెప్పితే నలుదిక్కులు కదిలి సమాధులు తెరచినట్లుగా యూదుల కుపకారము చేసినప్పుడు దేవుడు పలికినది నెరవేరును. ఆ లోయలో అలనాడు ఆత్మవశుడైన యెహెజ్కేలు ఈ సంగతులు జూచి వ్రాసిపెట్టెను.

ఈ మాటలు వట్టి యుదాహరణములని బోధిస్తే సరిపోదు. ఇవి దైవోక్తులు గనుక అక్షరాల నెరవేరును. సమయము మాత్రము అనుకూలించవలెను, దానికొరకు వేచియున్నాము. అవును, నానా రకములైనవారు నానా అభిప్రాయములు గల్గి యున్నారు. నమ్మేవారు గలరు, పరిహసించేవారు గలరు. గాని ప్రభువు ప్రవచించినది ఖాయమని యెరుగండి. ఈ సంగతులు నిశ్చయములు. వట్టి యుదాహరణములు కావు. (ప్రకటన 22:6).