నీళ్ళద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు

నీళ్ళద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు

ప్రశ్న:

1 యోహాను 5:6-8 లో వ్రాసిన వాక్య రహస్యమేమిటి? నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడీయనే అంటే అర్థమేమి?

జవాబు :

అవును, ఇది కష్టమైన వాక్యమేగాని యితర వాక్యములతో దీనిని సరిచూస్తే దాని అర్థము విప్పుతుంది – క్రీస్తు చనిపోగా నీళ్ళు మాత్రము రాలేదు. గాయపరచబడిన ఆయన ప్రక్కలోనుండి వెంటనే రక్తమును నీళ్ళును వచ్చెనని యోహాను 19:34 చెప్పుచున్నది. మీ అనుభవములో ఈ రెండు నెరవేరవలెను

రక్తము – ఇది ప్రాధాన్యమైనది. రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదని హెబ్రీ 9:22 చెప్పుచున్నది. ఆ రక్తమువలననే మన పాపములు పోయి నీతి కలిగెను. (ప్రకటన 1:6).

క్రీస్తు రక్తముయొక్క విలువ భక్తునికి గోచరము కావలెను. దానివలన కొనబడెను. దానివలన విడుదల ప్రాప్తించెను. దానివలన నీతిమంతుడుగా తీర్చబడెను. గనుక క్రీస్తు రక్తము విశ్వాసికి అమూల్య రక్తముగా నుండవలెను. (1 పేతురు 1:19; 1 కొరింథీ 6:19,20; రోమా 5:9).

క్రీస్తు నీళ్ళతో మాత్రమే వచ్చినవాడు కాడని యోహాను నేర్పుచున్నాడు. అవును, ఆయన ప్రక్కలో నుండి కారిన రక్తముద్వారానే క్రీస్తు వస్తాడు-వస్తాడనగా కీర్తిలోకి అప్పుడే క్రీస్తు వచ్చెను, ఎట్లు? తన రక్తము కార్చినందుచేతనే గనుక క్రీస్తు రక్తమునకు మొదటి స్థానమివ్వవలెను. ఆయన ప్రాయశ్చిత్తము మిగుల గొప్పది. (2) నీళ్ళు – శుద్ధికి సూచనయైనది నీళ్ళు.

రక్తము ద్వారా పాపపరిహారము కలుగుతుంది. పాపముయొక్క శిక్ష నీళ్ళకు కాదుగాని రక్తమునకే తొలిగి పోతుంది. గనుక మీ యనుభవములో తొలిగా క్రీస్తుద్వారా నా యొక్క శిక్ష పోయెనని మీరు తెలిసికొని రోమా 8:1 లో వ్రాసిన దానికి ఆనందించి స్థిరపడవలెను. అటు తరువాతనే శిక్షపోయిన తదనంతరము మీ అనుదిన జీవితము చక్కపడేటట్టు చూచుకొనవలెను.

నీళ్ళంటే దానికే సూచన. క్రీస్తు తన రక్తముద్వారా మిమ్మును రక్షించేవాడు. అయితే రెండవదిగా క్రీస్తు మీ అనుభవములోకి నీళ్ళద్వారా కూడా వస్తాడు. దీని భావమేమనగా మిమ్మును పవిత్రపరచి మిమ్మును మార్చి క్రొత్తవారినిగా చేసి తిరిగి పాపములో పడిపోకుండ మిమ్మును కాపాడుతాడు. నీళ్ళద్వారా క్రీస్తు వచ్చినాడంటే అర్థమిది.

ఆయన ప్రక్కనుండి నీళ్లుకారెను – వచనమే యొక నీరు, ఎఫెసీ 5:25-27 లో వాక్యము ఉదకముతో పోల్చబడినది. ఆ వాక్యమనే యుదకముచేత దినదినము క్రీస్తు సంఘము పవిత్రపరచబడుచున్నది. నీళ్ళు పరిశు ద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మద్వారా క్రీస్తు తన వారిని పరిశుద్ధపరచుచున్నాడు. దీనికి ఆత్మవలన పరిశుద్ధత యని 1 పేతురు 1:1 లో వ్రాసినది తోడ్పడుచున్నది.

క్రీస్తు ఈ రెండురీతులుగా మీలో పనిచేయతగినది – ఆయన ప్రక్కలోనుండి రక్తము నీరును కారెను. నేడు కూడా మీరు క్రీస్తును నమ్మియుంటే రక్తముద్వారాను నీళ్ళద్వారాను మీలోకి వచ్చి ఆయన పనిచేస్తాడు. (1) ఆ రక్తముద్వారా రాబోవు యుగ్రతనుండి మిమ్మును తప్పిస్తాడు-అట్టి స్థలములోనికి మిమ్మును నడిపించి భద్రమైన స్థితిలో మిమ్మునుంచుతాడు.

మొదటి పని యిది. (2) అటుపిమ్మట తనకొరకు మీరు సాక్షులుగా నుండేటట్లు మీయందు తన ఆత్మచేత నివసించి మిమ్మును తన వాక్యముతో నింపి సరియైన రీతిని తన స్వరూపానికి రాజేస్తాడు.

నీళ్ల ద్వారా ఆయన చేయించే పని యిది. ఇట్టి క్రీస్తు మీకు గోచరమాయెనా కాలేదా? నిత్యమరణమని మీకుండిన దెబ్బ క్రీస్తు తన రక్తములో సరిచేసికొనెను. (రోమా 6:23). పాపముయెక్క యేలిక మీమీద నిక చెల్లకుండ క్రీస్తు నీళ్లద్వారా కూడ పనిచేసేవాడు. (రోమా 6:14), తాను వాడుకొను నీళ్లు ఏదనగా వాక్యమును, ఆత్మయును అనబడిన నీళ్లు.

నీళ్లతోమాత్రమే కాదని యెహాను వ్రాస్తున్నాడు. ఒకడు అతిశయించి యిన్ని వేదవాక్యములు నాకు తెలుసు నంటాడు మంచిదే గాని క్రీస్తు నెరుగుటలో వాక్యమను నీళ్లతో కూడ రక్తము అనేది మిళితమై పని చేయవలెను – ఇన్ని వచనములు గుర్తని గర్వించరాదు. క్రీస్తు రక్తముచేత రాబోవు శిక్షనుండి విడిపింపబడితివా లేదా అని విచారించవలసినది.

క్రైస్తవ బళ్లలో ఎన్నోమార్లు బైబిల్ పరీక్షలో మొదటి స్థానము గాంచినవారు అన్యులే. దీని భావమే మనగా నీళ్ళు అబ్బినది గాని రక్తమునకు చోటులేకపోయినది. క్రీస్తు నీళ్లద్వారా మాత్రము రాడు, నీళ్లద్వారాను అనగా వాక్యముద్వారాను, రక్తముద్వారాను మీ యనుభవములోకి రాగోరుచున్నాడు.

క్రైస్తవ కుటుంబములో జన్మించినవారికి నీళ్లు గిట్టుచున్నవి. వారి తలిదండ్రుల నేర్పుద్వారా వచనమేమో వారికి కలిగినది అయితే నేర్పులోనే కార్యము జరుగదు; రక్తము కూడ అవసరము. కాబట్టి క్రైస్తవులుగా జన్మించినవారు క్రీస్తు రక్తముపట్ల తమకున్న అవసరము తెలిసికొని ఆయనను అంగీకరించి క్రొత్తగా పైనుండి జన్మించవలెను.

ముఖ్యమైనది వేరొకటి కలదు – పాత నిబంధనలో కుష్ఠరోగమువలన అపవిత్రుడని నిర్ణ యింపబడిన యూదుడు రోగము బాగై పవిత్రుడని నిర్ణయింపబడవలసిన ఆచారములో రెండు పవిత్రమైన పక్షులు తేబడగా నర్పింపబడిన యొక దాని రక్తముతో కూడ పారునీరు అవసరము. (లేవి 14:1-9).

గుంట నీరు వేరు పారు నీరు వేరు. గుంట నీరు చచ్చినది. పారు నీరు జీవముగలది. పారు నీరే కావలెనని లేవీ 14:5 పలుకుచున్నది. పారు నీరు పరిశుద్ధాత్మకు సూచన. (యోహాను 7:37-39), పారు నీరు జీవముగలది గనుక జీవముగల దేవుని వాక్యమునకు సూచన. (హెబ్రీ 4:12) పారు నీటి పైని మంటి పాత్రలో ఆ పక్షులలో నొకదానిని చంపనాజ్ఞాపించెనెందుకు? బలిగా చంపబడిన ఆ పిట్ట రక్తముతోకూడ ఆ పాత్రలో ఆ పారు నీరు కలిసిపోవలెను.

నీళ్ళు మాత్రముకాక ఆ అపవిత్రునిమీద నీళ్లతోకూడ ఆ రక్తమును పడవలెను. యాజకుడే వానిని అట్లు ప్రోక్షించుట కద్దు. (లేవీయ 14:7). అతి స్పష్టముగా లేవీ 14:51 లో కర్రకు ఎర్రని నూలుతో కట్టబడిన హిస్సోపు రక్తములో మాత్రము గాక రక్తములోను పారునీటిలోను ముంచబడెననియు గనుక పవిత్రత పొందగోరువానిమీద నీళ్లు మాత్రము గాక లేక రక్తము మాత్రమే కాక రెండును ఒకదానితో నొకటి కలసి వానిమీద రక్తమును నీళ్లును పడెననియు తెలిసికొంటున్నాము.

ఈ పాత నిబంధన చట్టమునకు పూర్ణసిద్ధి వచ్చినట్లుగా క్రీస్తు చనిపోవుచు మనకు అవసరముగానుండిన ఆ రెండు పదార్థము లును అనుగ్రహించెను. ఆయన ప్రక్కలోనుండి రక్తమును, నీరును కారెను.

నేడుకూడ మీ అనుభవములో క్రీస్తు తన రక్తముతోను తరువాత తన వాక్యమను నీళ్లతోను తన ఆత్మయను జలముతోను మిమ్మును తాకి బాగుచేస్తాడు. వాక్యమనే నీళ్లుండవలెను గాని దానితోకూడ క్రీస్తు రక్తము రావలెను. వాక్యమే మిమ్మును ప్రతిష్ఠ చేయును. (యోహాను 17:17). అయితే దానికి ముందు మీ పాపములు క్రీస్తు రక్తమువలన క్షమింపబడక పోయియుంటే వాక్యము ద్వారా మీకు కలిగెడు మేలు సరియైనది కాదు. నీళ్లతోను రక్తముతోను క్రీస్తు రావలెను. ఇంకొకటి – నీళ్లు ఆత్మకు సూచనయై యుండగా నొకడు ఆత్మతో నింపబడి గొప్ప పనులు చేస్తానని అపేక్షించుచున్నాడను కొండి.

రోగులను బాగుచేస్తానంటున్నాడు. అద్భుతములు చేస్తానంటున్నాడు. అయితే ఆయననొక ప్రశ్న అడిగితిమి – నీవు రక్షింపబడితివా లేదా? నీ పాపములు పోయెనా పోలేదా? అయితే దానికి జవాబివ్వడు.

రక్షింపబడితినని ధైర్యముగా సాక్ష్యమివ్వ లేనివాడు ఆత్మపరిపూర్ణుడై గొప్ప కార్యములెట్లు చేయగలడు? అసాధ్యము, నీళ్లతో మాత్రమే అని వాపోతున్నాడు. ఇది సరికాదు. నీళ్లతోను రక్తముండవలెను. రక్తముతో నీళ్ళు కలిసియుండవలెను. నీళ్లుమాత్రము వద్దు. వచనము మాత్రము అనగా వట్టి అక్షరము మాత్రము చాలదు.

ఆ అక్షరమెవరికి సాక్ష్యమిచ్చుచున్నదో ఆ యేసుక్రీస్తే గోచరము కావలెను. ఆయన రక్తమే విశ్వసనీయము కావలెను. లేదా – ఒకడంటాడు – రక్తమే అవసరము. మరియు నాకొక కలకూడ వచ్చినది. ఆ కలలోనే రక్షింపబడితి నంటాడు. క్రీస్తు రక్తము ఎర్రగా కారినట్లు నేను చూచినానంటాడు. సరే గాని దానిలో లోటు పాటుగా నుండేది ఏదనగా రక్తము సరే – అయితే నీళ్లు యెక్కడ? వచనమను నీళ్లు లేకపోయినది – గమనించండి.

యోహాను చెప్పినది తప్పిపోరాదు. నీళ్ళద్వారాను రక్తముద్వారాను క్రీస్తు వచ్చేవాడు – వాక్యమును అనుభవమును వేర్వేరుపరచరాదు. అవును. నాకు తలంపు వాక్యమును ఆత్మను వేర్వేరుపరచరాదు. ఒకడంటాడు – వచ్చినది.

ఆ తలంపు ఆత్మద్వారానైనది, గనుక ఆ కార్యము చేస్తిని. అయితే అతడు చేసిన పని కేవలము అవినీతితో కూడినది. ఇదెట్లని అడిగితే ఆత్మ నాతో చెప్పెను గనుక చేస్తినన్నాడు. అయితే ఆత్మ వాక్యానికి విరుద్ధముగా నెప్పుడైన ఫలాని క్రియ చేయుమనునా? వాక్యానికి ఆత్మకును విరోధమున్నదా? అట్లనరాదు.

ఒక ప్రసంగికుడు సిఫారసు కావలెనని వైద్యునికి లంచమివ్వబోతే ఆ వైద్యుడు అన్యుడైనను నా దగ్గరికి వచ్చి సంగతి చెప్పెను. ఆ క్రైస్తవ ప్రసంగిని పిలిచి అయ్యా, లంచమిచ్చి మీరేమైన వ్రాయించుకొంటారా? ఇదెట్లని అడిగితే – దేవుడే అట్లు లంచమిచ్చి చేయుమని నన్ను ప్రేరేపిస్తే నేనడమేమి చేయగలనని ప్రత్యుత్తరమిచ్చెను.

ఇంకొక స్థలములో భార్యగల సువార్తికుడే, మరొకని కుమార్తెతో పరుగెత్తి పోదామనియుండగా పట్టుపడెను -దేవుడే ఆ పిల్లను, పెండ్లి భార్యగా చేసికొమ్మనెనే అన్నాడు. అయితే మీకు భార్యకలదే అన్నప్పుడు దేవుడే ఈ మంచిపిల్లను చేసికొనుమని పట్టినపట్టు వదలక తన పాపమును దేవునిమీదనే దులప ప్రయత్నించెను.

అయ్యో, ఇదెంత భయంకరము! వాక్యానికి విరుద్ధముగా ఫలానిది చేయుమని దేవుడైనను పరిశుద్ధాత్మయైనను చెప్పరు సుమీ. వాక్యమును పరిశుద్ధాత్మను వేర్వేరు చేయరాదు. ఆత్మ అనే నీళ్ళు మాత్రమే వద్దు. నీళ్ళతోను రక్తముతోను ప్రతి కార్యమును పరిశీలించి ముదంజవేసి సాగిపోవలయును.

తుదకు మరియొకటి చెప్పి దీనితో విరమించతగినది. అదేదనగా క్రీస్తు పుట్టుకతో కాదు బాప్తిస్మము నీళ్ళలో పొందినప్పుడే ఆయన దేవుని కుమారుడైపోయెనని కొందరు నేటివరకుకూడ దుర్బోధ చేయుచున్నారు. యోహాను దీనికి జవాబిచ్చుచు నీళ్ళతో మాత్రమేగాక నీళ్ళతోను, రక్తముతోను క్రీస్తు వచ్చెనని తెలియపరచుచున్నాడు – అనగా రక్తము మొదలుకొని అనగా మరియలో జన్మించినది మొదలుకొని పారంపర్యముగా రక్తముతో అబ్రాహాము మొదలు మరియు రాజైన దావీదు మొదలుకొని రక్తము ద్వారాను, రక్తముతోను క్రీస్తు దేవుని కుమారుడై వచ్చెనని యోహాను మనకు నేర్పు చున్నాడు.

నీళ్ళలో బాప్తిస్మము పొందినప్పుడు క్రీస్తు దేవుని ప్రియకుమారుడే-ఆలాగు ఆకాశమునుండి సాక్ష్యముకూడ వచ్చినది. (మత్తయి 3:17). క్రీస్తు నీళ్ళతో వచ్చినవాడు అయితే నీళ్ళతో మాత్రమే కాదు రక్తముతోకూడ క్రీస్తు వచ్చినవాడు. రక్తములో కూడ క్రీస్తు దేవుని కుమారుడని దీని అర్థము. పుట్టగానే గాబ్రియేలు లూకా 1:35 లో అన్నట్టు క్రీస్తు శిశువుగా నున్నప్పుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడుటకు యోగ్యుడైయుండెను.

అవును, పుట్టకముందుకూడ ఆదియందే వాక్యముగా దేవునియొద్ద నుండెను. మరియు దేవుడైయుండెను. (యోహాను 1:1). గనుక సాక్ష్యమిచ్చువారు ముగ్గురైరి.

  1. సత్మ స్వరూపియైన ఆత్మ సాక్ష్యమిచ్చుచున్నాడు. (రోమా 8:16).
  2. నీళ్ళు అనే వచనము సాక్ష్యమిచ్చుచున్నది. (యోహాను 5:39).
  3. క్రీస్తు చిందించిన రక్తముకూడ నోరుకలిగి మాటలాడినట్లు సాక్ష్యమిచ్చుచున్నది. (హెబ్రీ 12:24).

సత్యసాక్షియైన హేబెలు రక్తము దేవుని చెవిని మొర్రపెట్టెను. (ఆది 4:10). ఆలాగైతే క్రీస్తు విలువైన రక్తము పలకదా? ఓ పాపీ, క్రీస్తును నమ్ముము, ఆయన రక్తమే పరమ ప్రసాదమని విశ్వసించుము. వెంటనే ఆ రక్తమునుబట్టి క్షమింపబడి దాని మెల్లనైన సాక్ష్యముచే ఆదరింపబడి హర్షించెదవు.

బైబిలులోని సంఖ్యలు

బైబిలులోని సంఖ్యలు

ప్రశ్న:-

సంఖ్య అనేది బైబిలులో నాలాగే పడినదా లేక యుద్దేశ పూర్వకముగా కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలను దేవుడు నియమించినట్టు కనిపించుచున్నదా? నలభై యంటే అర్థమేమి? నలుబది దినములకు వర్షము, నలుబది సంవత్స రములు ఇశ్రాయేలీయుల ప్రయాణము, మోషే కొండపై నలుబది దినములు, యేసుప్రభువు నలుబది దినములు శోధింపబడుట వీటి యర్థమేమి?

జవాబు:-

వ్రాయబడినదానిలో పొల్లు సున్న అనే చిన్నవాటిమట్టుకు దిగి అట్టి అల్పమైనవి కూడ నెరవేరకపోవని మత్తయి 5:18 లో మన ప్రభువు చెప్పిన తరువాత వాక్యములోని ప్రతి సంగతి సంఖ్యలతోకూడ కనిపెట్ట తగినదని మనము తీర్మానించకుండలేము.

గలతీ 3:16 లో పౌలు – సంతానమైన క్రీస్తును ప్రకటించుచు పాత నిబంధనలో సంతానములు అని దేవుడు చెప్పక రాబోవునది సంతానమే అని చెప్పినందున క్రీస్తు ఒకడే అవసరముగాని క్రీస్తులు అనే పదము అసంభవమని విషయము విడదీసి వివరించుచు చెప్పినట్టున్నది. చూడండి. ఆలాగైతే వాక్యము చదివినప్పుడెల్ల మిగుల జాగ్రత్తతో పెద్దవాటిని మాత్రము కాక బహు వచనమునకును ఏకవచనము నకును గల చిన్నతేడాలవంటి వాటిని సైతము కనిపెట్టి చదువవలసినట్టున్నదని తెలిసికొంటు న్నాము.

ఇట్లుండ దేవుని వాక్యము చాలా లోతైనదని మనస్సుకు రాకపోదు. అవును, ఆ వాక్యము లోతైనదే కాక అందులోగల ప్రతి శబ్దము కూడ అర్థసహితముగా వ్రాతకు వచ్చెనని మనమెరుగ వలయును. మత్తయి 12:36 లో వ్యర్థముగా పలుకు ప్రతి మాటనుగూర్చి మనుష్యుడు విమర్శలో నిలుచుననిన ప్రభువు తాను వ్రాయించిన పుస్తకములో ఆయా సంఖ్యలను కూడ అనార్థముగా వ్రాయించి పెట్టుతాడా? పెట్టడు, కాబట్టి వాక్యములోనున్న సంఖ్యలనే అంశము మన పఠనమునకు యోగ్యమైనది.

పాఠకుడీసారి నలుబది అనే సంఖ్యనెత్తి విచారించినందున సంతసించుచు దీనిలో క్లుప్తముగా ఆయా కొన్ని సంఖ్యలను వివరించిన పిదప నలభై అనే దానికి వచ్చెదను. దీని సంబంధముగా మరియొకటియైతే కలదు. అదేదనగా ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయములో రాబోవు ఆ క్రూర రాజును వర్ణించుచు ప్రభువు తానే ఆ రాజుగారి పేరు తెల్పక అతని సంఖ్యనే మనకప్పగించుచున్నాడు. గనుక సంఖ్యలో గొప్ప భావమిమిడి యున్నదని ప్రభువే ప్రకటన 13:18 లో మనకు నేర్పుచున్నాడు. ఉదాహరణముగా ఆరు అనే సంఖ్యను చూడండి.

మానవుడు ఆరంభములో ఆరవ రోజులోనే సృష్టింపబడినందుచేత (ఆది 1:24-28) ఆరు అనే సంఖ్యతోనే కట్టబడియున్నాడు. ఆ భావముతో బైబిలులోని ఆయా ఆరు అనే సంఖ్యగల సందర్భములను పరీక్షించండి. వాటిలో మానవుడే పైగా తేలుతాడు. యోహాను రెండులో ఆ కానాను వివాహము వ్రాయబడినది. బాసలు ఆరు అని కనిపించుచున్న దెందుకు? ఏ ప్రకారము ఆ ఆరు రాతి బానలు అల్లనాడు క్రీస్తు తన మహిమను కనుపరచెనో ఆ ప్రకారమీ దినములలో బానలు అక్కరలేదు గాని ఆరు బాసలు సూచించే నరుడే క్రీస్తుకు అవసరము.

నరుడు రక్షింపబడి పనిముట్టుగా క్రీస్తు చేతిలోనుంటే నేడు కూడ గొప్ప పని జరిగి క్రీస్తుకు మహిమ కల్గును. ఆరు అర్థ సహితముగా వచ్చినది. రక్షింపబడిన మానవుని సేవను వివరించుచు 7 లేక 8 రకములు చెప్పక 1 కొరింథీ 3:12,13 లో నెంచి చూడండి.

ప్రభువు దాసుడైన పౌలు ఆరు విధములైన సేవ కార్యములను మాత్రము సూచించుచున్నందుచేత? ఆరు మానవుని సంఖ్య గనుక ఆయన చేసే సేవ ఆరు అను అంకములో వర్ణింపబడియున్నది. ఇది యూరకనే వచ్చినదా? కాదు. అర్థ సహితముగా సంఖ్యలను వాడుచున్నాడు. నరుడైన నెబుకద్నెజరు విర్రవీగుచు పూజకొరకు అన్యాయముగా చేయించిన విగ్రహము కొలతలను కనిపెట్టండి. ఎత్తు ఆరు అనే సంఖ్యకు సరిపోయినది. వెడల్పు కూడ ఆరులోనున్నది – దానియేలు 3:1 చూడండి. అట్లనే వచ్చినదా? రాలేదు.

మనకు దీనిలో నొక సంగతిని దేవుడే చూపు చున్నాడు. ఎట్లనగా మానవుని నిష్ప్రయోజన యత్నముగా ఆ బొమ్మ కట్టబడెను. కాబట్టి ఆరు అనే సంఖ్య క్రింద కట్టబడినది. ఈ కార్యము సరికానందుచేత త్వరలో ఆ బొమ్మతోకూడ అతిక్రమించిన ఆ రాజుగారు కొట్టివేయబడిరి. గొప్ప నెబుకద్నెజరు యెట్లొక మతమును స్థాపించి రాజ్యములోని సమస్తమైనవారిని ఆ మతములోనే కలుపవలెనని ఉండి ఆఖరికి నోడిపోయెనో అట్లనే రాబోవు కొంతకాలానికి మరియొక రాజు కీర్తిశేషముగా పేరుగొని లేచి క్రమేణ ప్రకటన 13 లో వివరింపబడినట్లు సర్వత్ర మతము నొకటి పుట్టించి అందులో కలియని వారిని హతసాక్షులనుగా కావించి తుదకు తానే నశించిపోతాడని తెలియుచున్నది. ముందుండినదే మళ్ళీ సంభవిస్తుంది.

లౌకికములో కొత్తవి లేవు. రాబోవు ఆ రాజుగారి పేరేమి? అతని పేరు మనకివ్వబడలేదు గాని అతని సంఖ్య చెప్పబడినది మరియు ఆ సంఖ్య ఆరుతోనే నిండినది. వ్రాస్తే సరిగా 666 అని వస్తుంది. ఇందులో మనము నేర్చుకో వలసినదేమనగా సర్వలోకమును మోసపుచ్చి వశపరచుకొన నపేక్షించేవాడు నరులలో గొప్ప నరుడు కాని పక్షమున అంత పదవికి రాలేడు.

ఆరు అనగా నరుని సంఖ్య. ఆరు అంటే బలమైన నరుడని అర్థము. అయితే దీనికిమించి ప్రకటన 13:18 లో కనబడుచున్నట్లు ఆరు ఆరు ఆరు అనగా ఆర్నూట అరువదియారు వస్తే నిట్టి బలమైన అంకము గలవాడు రాజైన సౌలువలె నరులలో అతిశ్రేష్ఠుడై అందరికంటె భుజము మొదలుకొని పైకి నెత్తుగలవాడై ఆరంభములో మంచి ముఖముండినను తుదకు క్రూరముఖము గలవాడై యుక్తిగలవాడై యుపాయము తెలిసికొని లోక రాజ్యములను స్వాధీనపర్చుకొని కొట్టకొనకు దేవునిమీదను దేవుని అభిషిక్తునిమీదను చెయ్యియెత్తి నియమింపబడిన దండనకు వెళ్ళిపోతాడని గ్రహించుచున్నాము. దానియేలు 8:23; 1 సమూయేలు 10:23 చూడండి. మనుష్యులలో అతడు గొప్పవాడేగాని ఏడు అనేదానికి రాక ఆరులోనే నిలిచెను. గనుక దండనకు పాత్రుడాయెను.

విస్తరించి మాటలాడరాదుగాని బైబిలు సంఖ్యలలో చాల అర్థమున్నదని చదువ రులు గ్రహించియుంటారని నా నమ్మకము. ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైనది. గనుక బైబిల్ యొక్క కడపటి గ్రంథములో కార్యములన్నియు సంపూర్తికి వచ్చుచుండుట చేత సారిసారి ఆరుగాని తొమ్మిది గాని కనబడక ఏడు నక్షత్రములు ఏడు సంఘములు ఏడు దీపస్తంభములు ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు మొదలైన విషయ ములు ఏడు అనే సంపూర్ణ సంఖ్యలో యోగ్యముగానే మనకు తెల్పబడుచున్నవి.

యోహాను 4 లో సమరయ స్త్రీ ఐదుగురుతో నుండి ఆరవవాని దగ్గరకు వచ్చి యుండెను. అతడుకూడ ఆమెకు పెనిమిటి కాడు అయితే నేమి? – క్రీస్తు చిక్కుటతో ఆమె కార్యము సరిపోయినదిలెండి. క్రీస్తు తానే సంపూర్ణుడు మరియు ఆమె అనుభవ ములో ఆమెకు ఆరుగురు తరువాత ఏడవవాడుగా చిక్కెను. 7 అనే సంఖ్యకు తగినట్టు ఆమె రక్షణలోనికి వచ్చినది. స్తోత్రము.

పదమూడు అను సంఖ్య వాక్యములో చాల విశేషమైనది. అది తిరుగుబాటుతో చేరియున్నది, ఆది 14:4 లో తొలిగా కనబడుచున్న ఈ పదమూడవ సంఖ్య ఆలాగే తుదివరకు నానా భాగములలో చెడ్డ అర్థముతోనే కూడియున్నది. మానవుని హృదయములోనున్న చెడుగును క్రీస్తు తెలియ జేయుచు పదిహేనుగాని పదిగాని చెప్పక సరిగా తిరుగుబాటునకు సూచనయైన పదమూడు దుర్గుణములనే వెలిబుచ్చెను – మార్కు 7:21,22 తీసి లెక్కపెట్టండి. మానవుడు దేవునిమీద తిరుగుబాటు చేసిన వాడు అని వ్రాయబడియున్నది.

పది అనే అంకము పరిశోధనతో కూడినది-పదిమంది కన్యకలు, యూదులకు విరోధియైన హామానుకు పదిమంది కొడుకులు, పది ఆజ్ఞలు, ప్రకటనలోని పదిమంది రాజులు, సారిసారి చెప్పబడిన పది దినములనేది. (దానియేలు- 1:12,14). ఇవన్నియు పది అనే సంఖ్యయొక్క ప్రత్యేక ఆత్మీయమైన భావమునకు సాక్ష్యమిచ్చుచున్నవి. ప్రశ్న వేసినవాడు సూచించిన నలుభై అంటే మరి విశేషమైనది. నియమింపబడిన నిర్ణయ సమయమునకు సాక్ష్యమిచ్చుచున్నది.

నోవహు దినములలో వారు ఓడలో ప్రవేశించినది మొదలుకొని జలములు విస్తరించి ఆ పెద్ద యోడ తేలువరకు నలువది ప్రత్యేకమైన దినములు జరిగెను. (ఆది 7:17).

ధర్మశాస్త్రమివ్వబడుటకు మోషే నలువది దివారాత్రులు సీనాయి కొండమీద యెహోవాతో గడిపెను. (నిర్గమ 24:18), తిరిగి నలువది రేయింబగళ్లు గడిపెను. (నిర్గమ 34:28).

నలువది దినములు వేగులవారు కనాను దేశము సంచరించి చూచిరి. (సంఖ్యా 13:25). పిమ్మట నలువది యేండ్లు దండనగా అరణ్యభూమిలో నిలిచిపోయిరి. (సంఖ్యా 14:34).

గొల్యాతు ఇశ్రాయేలీయులను తిరస్కరించినది నలువది దినములు -ఆ తరువాత శిక్షింపబడెను గనుక నలుభైయనే సంఖ్య నిర్ణయితమైన పరిశోధనను మనకు చూపుచున్నది. (1 సమూ. 17:16).

క్రుంగిపోయిన ఏలీయా ధర్మశాస్త్రమివ్వబడిన కొండకు వెళ్ళిపోయిన ప్రయాణమునకు సరిగా నలువది దివారాత్రులు పట్టెను. (1 రాజులు 19:8).

ప్రవక్తయైన యోనా స్వరమెత్తి ‘నీనెవె’ మీద ప్రకటించిన నాశన దినములు నలువది దినములు. (యోనా 3:4). దేవునికి స్తోత్రములు-ఆ ప్రసంగము విని ఘనులేమి అల్పులేమి మారుమనస్సునొంది దేవునివైపు తిరిగి, చాటింపబడిన నాశనము తప్పించుకొనిరి.

దెబ్బలు కొట్టితే నలుభై లోపల కొట్టి చాలించుకొనవలెను గనుక నలుభై యనే సంఖ్య నిర్ణయితమైన కాలముతో కూడినది. (ద్వితీయో. 25:3). అరణ్యములో నలువది యేండ్లు మన్నాను భుజించినది, ఏలీ న్యాయాధిపత్యము, దావీదు సొలొమోనులు రాజ్యమేలిన సంవత్సరములు నలుభైయనే సంఖ్య మిళితమైనవి. యిట్టి మొదలగు విషయములు అనేకములు గలవు గాని అన్నియు వివరించ సమయము లేదు.

క్రొత్త నిబంధనలోకూడ క్రీస్తు ఉపవాసముండి యడవిలో పరిశోధింపబడినది నలువది రోజులే. (మార్కు 1:13). మళ్ళీ దీనిలో నలుబది పరిశోధన సంఖ్య అని బోధపడుచున్నది. లేచిన పిమ్మటకూడ శిష్యులకు కనుపించిన కాలము నలుభై రోజులు (అపొ.కార్య. 1:3). మొన్ననే 1 యోహాను పత్రికను పరిశోధించుచుండగా ముప్ప దెనిమిది కాదు నలువదిరెండు కాదు గాని సరిగా నలువది పర్యాయములు ఎరుగు, ఎరిగితిమి, ఎరుగుదుము, అనేది వచ్చెనని కనుగొని మిక్కిలి ఆశ్చర్యపడితిని. అవును. ఈ లోకమే యొక బడి.

క్రీస్తువారీ బడిలో పరిశోధన క్రిందనున్నారు గనుక నలుభై మార్లు ఎరుగుమని హెచ్చరింపబడుచున్నాము. ఎరుక లేనిది దేవునికిష్టము లేదు. కాబట్టి భయభక్తులతోనే బైబిలు చదువుచు అందులోని ప్రతి సంఖ్యనుకూడ గమనముతో గుర్తించండి. గొప్ప లాభము లేకపోదు.

బలులు నాకు వెక్కసము

“బలులు నాకు వెక్కసము”

ప్రశ్న:-

నిర్గమ కాం. 20:24 ప్రకారము ఆయా బలులను అర్పించవలెనని చెప్పిన దేవుడు – బలులు నాకు లెక్క సమాయెనని యెందుకు చెప్పుచున్నాడు?

జవాబు:-

బలి మాత్రము చెల్లదు. ఆ బలి అర్పించువాని ఆత్మస్థితి లెక్కకు రావలెను. యెషయా 1:11 లో ప్రశ్న వేసినవారు హెచ్చరించినట్లు యూదులా కాలాని కర్పించు బలులు దేవునికి వెక్కసమాయెను. బాహ్యముగా బలులిచ్చిరి, అయితే వారి అంతరంగమున భక్తి లేకపోయినది.

  1. రక్తముతోనే వారి చేతులు నిండినవి. అనగా బలాత్కారులైరి. యెషయా 1:15.
  2. అపవిత్రులై దుష్క్రియలు చేయుచు వచ్చిరి. (1:16. 3)
  3. మేలు తప్పిపోగా కీడే సింహాసనాసీనమాయెను. (1:17. 4)
  4. వారి కార్యములలో న్యాయము తప్పిపోయినది. (1:17. 5)
  5. తండ్రిలేని అనాధలను హింసించుచుండిరి. (1:17.)

దేవునికిని వారికిని వివాదము లేచినది. కెంపువలెను రక్తమువలెను వారి పాపములు విస్తరించినను దానిని విచారించక పైపైగా మతాచార సంబంధముగా బలుల నర్పించుచు దినములనెంచుచు వచ్చిరి. బహిరంగమున మతము మట్టుకు సరిగా నుండిరి. అంతరంగమున నేమియు లేదు. (యెషయా 1:18).

దేవునికి కోపమును రేపి – తుదకు కుమ్మరింపబడిన అగ్ని గంధకములచే నాధీనమైపోయిన సొదొమ గొమొర్రాల పట్టణ నివాసులను పోలి, రాబోవు దేవుని న్యాయమైన కోపమునకు యోగ్యులైన వారిదగ్గిర యెహోవా బలులను తీసికొనునా! యెషయా 1:10 ని ప్రకటన 11:8 తో సరిపోల్చుము. లోతు ఆ పట్టణములలో కొంత సాక్ష్యమిచ్చినను వారు వినకుండ లోతు ప్రకటించిన క్రీస్తుప్రభువును సిలువవేసిరి. గనుక అగ్ని గంధకములకే గురియైన ప్రవక్తయైన యెషయా దినములలో యూదులీ భయంకరమైన స్థితికి వచ్చిరి, పాపిష్టి జనమైరి. దోషభరితమైన ప్రజలైరి.

తమ్మునొక కాలమున ఐగుప్తునుండి విడిపించి రక్షించిన వానిమీద తిరుగబడిరి. (యెషయా 1:2-4). ఇట్లుండగా వారెన్ని బలులర్పించిన చెల్లునా? చెల్లవు. బలి ముఖ్యమైనది కాదు. ఆ బలి యిచ్చినవాడే బలి కావద్దా? దేవుడు వట్టి బలిని కోరడు. దహనబలి మాత్రమే ఆయనకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే, విరిగి నలిగిన హృదయమే ఆయనకింపు. (కీర్తన 51:16-17).

క్రొత్త నిబంధనలలో కూడ వెలపట నెన్ని చేసిన సరిపోదు. హృదయమే దేవునికి స్వాధీనము కావలెను. బలి తెచ్చినదానిని మరుగుపరిచెడి దోషము మనస్సులోనుంటే బలిని విడిచిపెట్టి వెళ్ళి అన్యాయముగా నొప్పిపరచిన ఆ సహోదరునితో సమాధానపడి మరలవచ్చి ఆ బలినర్పింపవచ్చునని క్రీస్తు మత్తయి 5:24 లో నేర్పెను.

ఈ దినములలో క్రైస్తవ బాప్తిస్మము సరేగాని ముందొకని హృదయము సరిపోవద్దా? గారడీ సీమోను నమ్మినట్టున్నది. నమ్మి బాప్తిస్మమొందెనుగాని, పేతురు తరువాత అతని శాసించుచు – నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదనెను – అవును, వెలపట సరే నీళ్ళలో మునిగియుండెను. లోపలనేమో మార్పు కలిగినట్టు లేదు- (అపొ.కార్య. 8:17-24).

రాత్రి భోజనము సరే కాని తండ్రి భార్యను వుంచుకొని పాపము చేయుచునే బల్లయొద్దకు వస్తే సరిపోతుందా? కాదు-ఒకడు తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఆ రసమును త్రాగవలెను. (1 కొరింథీ 11:27-34).

మనుష్యులకు కనబడు నిమిత్తము అనేది నిండు మోసకరమైనది. (మత్తయి 23:5). ఇది కపట భక్తి గనుక మిక్కిలి గొప్ప ఖండమునకు యోగ్యమైనది. ఈ దినములలో ఆరంభము క్రీస్తును అంగీకరించి రెండవసారి పైనుండి ఆత్మమూలముగ పుట్టి తీర వలెను. (యోహాను 3:3-9). అటుపిమ్మట బాప్తిస్మము నొంది అనుదిన జీవితములో ముందుకు సాగవలెను.

సాగుచుండగా కూడ సమస్తమైన కపటమును మానివేయ వలెను. (1 పేతురు 2:1-2). దినము ఆత్మీయముగా క్రీస్తునుబట్టి పండుగ నాచరించ యుక్తమైనది గాని తొలిగా పండుగను చెరచెడి ఆ పులిసిన పిండిని విసర్జించి నిష్కాపట్యమను పులియని రొట్టెతోనే పండుగ ఆచరించవలెనని 1 కొరింథీ 5:7-8 తెల్పుచున్నది. కాబట్టి బలి కావలెనని కోరిన దేవుడు తుదకు జనుల బలిని నిషేధించ వలసి వచ్చినది. మీరుకూడ జాగ్రత్తగానుండి బాల్యర్పణముగా సేవ మాత్రము క్రీస్తు కొరకు చేయవద్దు. ఆ సేవ యెంతో అని కాదు. యెట్టిదో అనేది ముఖ్యము. (1 కొరింథీ 3:12).

పౌలు దమస్కు దర్శనము

పౌలు దమస్కు దర్శనము

ప్రశ్న:-

దమస్కుదారిలో పౌలుతో కూడ ప్రయాణము చేసిన మనుష్యులు స్వరము వినిరా, వినలేదా? అపొ. కార్య. 9:7 లో వినిరని యున్నది. 22:9 లో వినలేదని యున్నది. ఏది ఒప్పు? ఏది తప్పు?

జవాబు:-

అనేకుల భావమేదనగా బైబిల్లో తప్పులెన్నోయున్నవి – వాటినెత్తి చూపుతామని యిట్లు వ్రాస్తారు. అయితే బైబిల్ తప్పని నిరూపించగలిగితే పునాది కదిలిపోయినది. నీతిమంతుల పునాది పాడైపోతే వారేమి చేయగలరు? అయితే బైబిలు యెప్పుడైన మనుష్యుల చమత్కారముచేత తప్పని తీర్చబడుతుందా? తీర్చబడదు. ఆ వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

1 పేతురు 1:24; కీర్తన 119:89 చెప్పుచున్నది వాస్తవము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ప్రశ్నవేసిన ఆయన తాను చూచిన రెండు వాక్యములతో మూడవదిగా అపొ. కార్య. 26:14 కలిపియుంటే మంచిది. 9:7; 22:9; 26:14- ఈ మూడు వచనములలోనున్న సంగతి యొకటే వాక్యముగా స్వరమనేది కనబడుచున్నది.

9:7 లో వ్రాసినట్లు పౌలుతో కూడనుండిన మనుష్యులు ఆ స్వరము వినిరి. అయితే 26:14 లో తేటగా హెబ్రీ భాషలో వినబడిన ఆ స్వరము సౌలును అన్వయించి యుండెనని తెలియుచున్నది. ఒక స్వరము నాతో పలుకుట వింటినని వ్రాయబడినది. అవును, సౌలా! సౌలా! నీవేల నన్ను హింసించు చున్నావని చెప్పినది. ఆ పని మనుష్యులకేమి పట్టినది? అసలు ఆ మాటలు వారికి అర్థమే కాలేదు. ఆ మాటలు వారివి కావు. ఆ మాటలు వారికి సంబంధించినవి. కావు కాబట్టి 22:9 లో వ్రాసినది సరిగానే యున్నది.

నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు. శబ్దమేమో గుర్తొయెను. గొప్ప ప్రకాశము ప్రకాశించెనని తెలిసినది. అయితే జరిగిన సంభాషణ వారికి తెలియక పోయెను. వట్టి పిలుపు మాత్రము వచ్చినది కాదు, ఆ దారిలో గొప్ప సంభాషణ జరిగెను. 9:4-6 చూడండి.

సౌలును పేరు పెట్టి పిలిచిన సంగతి ఆ భాగమందు కొద్దిగానే వివరింపబడినది. గాని పౌలు ఆ తరువాత అగ్రిప్ప రాజునెదుట సంగతి వివరించి చెప్పగా 9:4-6 లో వ్రాయబడని యెన్నో మాటలు జరిగినట్టు వివరముగా వ్రాయబడినది – 22:15-18 చూడండి.

నిన్ను పరిచారకునిగాను, సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నానని క్రీస్తే అలనాడు దర్శనముతోకూడ కొంతసంభాషణ క్రిందపడిన సౌలుతో జరిపెను. అదంతయు 9:4-6 లో వ్రాయబడియున్నదా? లేదు. మరియు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని 26:14 లో వ్రాసినది 9:4-6 లో లేనే లేదు. ఎందుకు లేదు? ఒక స్థలమందు వ్రాసినది, క్లుప్త వివరముతో నుంటుంది. మరొక భాగము చూస్తే పూర్తిగా దాని వివరాలివ్వబడుతుంది. భాగము లన్నియు నొకటిగా కలిపితే విషయము వికసించును.

ఆ మనుష్యులు జరిగిన సంభాషణ వినిరా? ఎక్కడిది? శబ్దము మట్టుకేమో ఆ స్వరము వినిరి. (9:7). అయితే పౌలుతో పలికిన మాటలు వారు వినలేదు గనుక పౌలుతో మాటలాడినవాని స్వరము వారు వినలేదని 22:9 లో వ్రాసినది తప్పు కాదు. ఎందుకంటే 26:14 లో నున్నట్లు కేవలము ఆ స్వరము సౌలుతోనే పలుకబడినది. 22:9 లో ఆ వెలుగు చూచిరని యున్నది గాని 9:7 లో యెవనిని చూడక మౌనులై నిలువబడిరనియున్నది.

దీనిలోకూడ తప్పు వచ్చినదా? రాలేదు. మొత్తానికి ప్రకాశించిన గొప్ప వెలుగు జూచిరి. అయితే వెలుగులో నుండిన క్రీస్తును వారు చూచినది అబ్బినదా? అంతమట్టుకు వారికేమియు తెలియలేదు. శబ్దమేమో వినిరి, స్వరమేమో వినిరి. ప్రత్యేకముగా పలుకబడిన మాటలేమో వారు వినలేదు. అంతే దీని వివరము.

క్రీస్తు యోహాను 12:28 లో చేసిన ప్రార్థన నాలకించి జవాబిచ్చుచు నేను నా నామమును మహిమపరచితిని. మరల మహిమపరతునని ఆకాశమునుండి శబ్దముగా దేవుడు పలికితే ప్రజలేమనిరి?

1) ఉరిమెననిరి. 2) దేవదూత యొకడాయనతో పలికెననిరి. అవును, శబ్దమేమో వారు వినిరి. అయితే శబ్దములోని మాటలు క్రీస్తుకే గాని వారికేమి తెలిసెను? గ్రీకు భాషలో స్వరము అనేది ఫోనే యని వచ్చినది. 9:7; 22:9; 26:14 వచనములలో అగుపడే వాక్కు అదే. ఫోనే అనే గ్రీకు శబ్దములో టెలిఫోను అనే ఇంగ్లీషు పద ముద్భవించినది. ఇప్పుడు పెద్దపెద్ద ఆఫీసులలోను రైలు స్టేషన్లలోను టెలిఫోన్ అనేది యున్నది. దానిలో నొకరికొకరు దూరముగా నుండినను ఆ టెలిఫోనుద్వారా నొకరితో నొకరు మాటలాడగలరు.

టెలిఫోను శబ్దము వేరు. టెలిఫోను మాటలు వేరు. టెలిఫోను కొట్టితే ఆ గంట శబ్దము చాలమందికి వినబడుతుంది. టెలిఫోను స్వరము వింటిరా అంటే వింటిమంటారు. సరిగాని టూకీగా మాటలాడుట యొకటి: పూర్తిగా మాటలాడుట మరొకటి. టెలిఫోనులో ఫలాని మనుష్యుడు కావలసివచ్చి నప్పుడాయన పేరు చెప్పుదురు. ఆయన దగ్గరకు వెళ్లి చెవికి ఆ టెలిఫోను భాగము పెట్టుకొని తన్ను పిలిచిన వానితో సంభాషిస్తాడు. దగ్గిరనుండి చెవికి ఆ చిన్న సామాను పెట్టుకొనిన వానికేగాని రెండవవానికి టెలిఫోనులో జరిగిన సంభాషణ తెలుసునా? తెలియదు.

పరలోకమునుండి ఆనాడు టెలిఫోను కొట్టినది గట్టి శబ్దముతోను పెద్ద వెలుగు సమేతముగాను కొట్టినది. ఆ మనుష్యులు ఆ వెలుగును జూచి ఆ టెలిఫోను శబ్దము వినిరి గాని టెలిఫోనులో జరిగిన సంభాషణ వారికి గుర్తుకాలేదు. ఆ స్వరము వినిరి. మరొకప్రక్క జూస్తే అది వారి నిమిత్తము రానందున వారా స్వరము వినలేదని స్పష్టమగుచున్నది. దీని వివరమిది. ఇది చదివి బైబిల్లో తప్పులున్న వంటారా? లేక శిరసావహించిన క్రీస్తుకును బైబిలుకును విధేయులగుదురా? మీరే దీనికి జవాబియ్యవలయును.

పాతాళము-నరకము

పాతాళము-నరకము

ప్రశ్న:-

ధనవంతుడు – లాజరు కథలో వారిరువురు చనిపోయిన తరువాత ధనవంతుడు నరకములో వుండి లాజరును – “తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమనుచున్నాడు!” ఇదివరలో ఒక అంత్య తీర్పు, తీర్పుదినము జరిగినట్లు ఋజువున్నట్లు కనబడుచున్నది! అంత్యదినము జరిగినదా? లేక ఉపమానమా? రాబోవు తీర్పు ఒక్కటేనా?

జవాబు:-

ధనవంతుడు “పాతాళములో” బాధపడెను గాని నరకములో కాదు. లూకా 16:23 జాగ్రత్తగా చదువండి. నరకము వేరు, పాతాళము వేరు. చనిపోగానే పాపులకు చిక్కేది పాతాళము. ఆ పాతాళములో అగ్ని కలదు. ఆ అగ్నిలో అక్కడివారు యాతన పడుదురు. (లూకా 16:24). అయితే నరకమనేది దానికంటే విశేషమైనది. నరక మనగా ప్రకటన 20:15 లో సూచింపబడిన అగ్నిగుండము.

పాతాళము క్రొత్త నిబంధనలో పది పర్యాయములు చెప్పబడినది – మత్తయి 11:23; 16:18; లూకా 10:15; 16:23; అపొ. కార్య. 2:27-31; ప్రకటన 1:18; 6:8; 20:13,14. అయితే ప్రకటనలోని పదములు మృతుల లోకమని తర్జుమా చేయబడినవి. మిగత ఆరు వచనములు పాతాళమని యున్నవి. గ్రీకు భాషలోనైతే పదమొకటే – హేడిస్ అని యున్నది.

ఈ హేడిస్ యిట్లు పది సార్లు వచ్చినది. హేడిస్ – నరకము వేర్వేరుగా నున్నవి. ఎట్లంటే ప్రకటన 20:14 లో వ్రాసినట్లు వెయ్యియేండ్ల రాజ్యము పిమ్మట జరిగే కడపటి పాపుల తీర్పు పిమ్మటనే హేడిస్ అనగా మృతులలోకము లేక పాతాళము అగ్నిగుండములో పడవేయబడెనని తెలిసి కొంటున్నాము. ఎందుకంటే దానితోనిక అవసరములేదు – దాని పని తీరిపోయెను – పాతాళములో నుండేవారు కడపటి పునరుత్థానములో బయటికివచ్చి తీర్పు పొంది అగ్ని గుండములో పడవేయబడుదురు గనుక పాతాళము అగ్నిగుండములో పడవేయబడునని చదువుచున్నాము.

ఆ ధనవంతుడు అప్పుడే బాధపడెను కాని అది అకాల బాధ మరియు అసంపూర్ణ బాధయై యున్నది. అంతేకాదు – గమనించుడి – పాపులైన మృతుల పునరుత్థానములో అతడు లేచి తీర్పు పొంది పేరు జీవగ్రంథమందు లేనందుచేత అగ్నిగుండములో పడవేయబడును. కొంత అగ్నిలోనుండిన వాడు సంపూర్ణమైన అగ్నిలోకి తేబడి పడత్రోయబడుతాడని తెలియుచున్నది. అబ్బో! ఆ దుర్గతి రాకుండ చూచుకొండి.

క్రీస్తులో దాగితేనే అది తప్పుతుంది – రోమా 8:1. గనుక పాతాళము వేరు, అగ్ని గుండము వంటి నరకము వేరు. పాపములోనుండి చనిపోయినవారు ప్రస్తుతముండే తావు పాతాళము. అటుపిమ్మట పాతాళమునుండి నరకానికి తేబడుదురు. చనిపోగానే తీర్పు కొంత జరిగినట్లు హెబ్రీ 9:27 ప్రకారము పాపి అప్పుడే ఆ ధనవంతునితోపాటు పాతాళములో దిగిపోతాడు. అయితే పుస్తకముల తీర్పు సంపూర్ణముగా జరిగిన పిమ్మట పాపికి చిక్కే భయంకరమైన కడపటి తావు ఏదనగా నరకమనేది. నరకము క్రొత్త నిబంధనలో పన్నెండుమార్లు వచ్చినది – మత్తయి 5:22, 29, 30, 10:28; 18:9; 23:15,33; మార్కు 9:43, 45, 47; లూకా 12:5, యాకోబు 3:6.

లాజరుది యొక కథయని ప్రశ్నించినవారు వాడుకచొప్పున వ్రాసినది తప్పు. ధనవంతుడొకడుండెననియు లాజరు అను నొక దరిద్రుడుండెననియు క్రీస్తు పలికి యుండగా ఇదొక కథయని యూహించరాదు. క్రీస్తు యొక కథ చెప్పినను అందులో తప్పు చెప్పుడులెండి గనుక లాజరుది కథయైతేనేమి కథయైనందున దానిలో దుర్బోధయుండునా? ఉండదు. మరియు అది కథ కాదు. అది వాస్తవముగా జరిగిన సంభవము అని చెప్పి వివరించెను. ఉపమానములతో చెప్పి వివరించెను.

ఉపమానము లలో వ్యక్తుల పేరులు లేవు. ధనవంతుడుండి సిద్ధపడియుండక భ్రమసిపోయి తరుణము పోగొట్టుకొని చనిపోయి పాతాళము చేరెను. ఇది ఖాయము. ఆ దరిద్రుడు దరిద్రుడైనను సిద్ధపడియుండి చనిపోయి అబ్రాహాముండే తావుచేరి విశ్రమించెను. ఇదికూడ ఖాయము. ఇవి వాస్తవముగా జరిగిన సంభవములు. మరియు క్రీస్తు తానే మనకు ఈ అవసరమైన విషయములను తెల్పుచున్నాడు. రక్షకుడైన క్రీస్తులో దాగినవానికి శిక్షావిధియు లేదు.

క్రీస్తు సిలువలో సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మనప్పగించిన దానివలన పాపి తీర్పు అప్పుడే క్రీస్తు వలన సమాప్తమునకు వచ్చినది. నమ్మినవానికి రూఢియైనది. యిది రోమా 8:1. అట్టి క్రీస్తు భక్తుడు చనిపోయినా చింతలేదు.

క్రీస్తులోనుండి చనిపోయినందుచేత గతి కల్గియున్నాడు – క్రీస్తు రెండవసారి వస్తే వెంటనే అతడు అక్షయుడుగా లేచి ఆకాశమండలములోనుండే క్రీస్తును కలిసికొని సదా ఆయనతోనుండిపోయేటట్టు మేఘములమీద కొనిపోబడును – 1 థెస్సలోనీ. 4:16-18 లో ప్రచురింపబడిన సువిశేషమిది.

క్రీస్తులో లేకుండ పుట్టి పెరిగిన పాపములలోనే యుండి చనిపోయినవాడు యోహాను 8:21 లో క్రీస్తు అతిస్పష్టముగా తెల్పినట్టు క్రీస్తు పైకి వెళ్ళిపోయిన పరదైసుకు వెళ్లలేక ఆ ధనవంతుని పోలి పాతాళమునకు దిగి పోతాడు. ఈ సంగతులు నిర్వివా దాంశములే.

క్రీస్తు వచ్చినప్పుడు చనిపోయినవారందరును లేవక అయనయందుండి చనిపోయినవారు మాత్రమే మొదట లేస్తారు. (1 కొరింథీ 15:23). ఇది సుభాగ్యముతో కూడినట్టు ప్రకటన 20:1-4 భాగములో వర్ణింపబడిన మొదటి పునరుత్థానము. వెయ్యియేండ్ల పిమ్మటనే మిగిలిపోయిన పాపులు తీర్పుకు బయటికివస్తారు. (ప్రకటన 20:7-15).

మీది ఏ గుంపో చూచుకొండి. మొదటి పునరుత్థాములో నుంటారా, రెండవ దానిలో నుంటారా? మొదటిది జీవ పునరుత్థామని పిలువబడినది; రెండవది తీర్పు పునరుత్థానము – యోహాను 5:29 చూడండి. దానికి దీనికిని మధ్య వెయ్యి యేండ్లున్నది. ఇత్యాది తీర్పువిషయములు తెనుగులో నేను రచించిన “సప్త విమర్శ”లనే పుస్తకములో విశదమవును. ఏది ఎట్లున్నను రాబోవు తీర్పు తప్పించుకొని క్రీస్తును నేడే పట్టుకొని రక్షింపబడితే నుత్తమమును మిక్కిలి అవసరమునైయున్నది.

పారిపోయిన పడుచువాడు

పారిపోయిన పడుచువాడు

ప్రశ్న:-

మార్కు సువార్త 14:51,52 లో ఒక పడుచువాడు దిగంబర శరీరము మీద నారబట్ట వేసికొని రాణువవారు వచ్చి యేసును పట్టుకొనగా తన నారబట్ట వదిలి పారిపోయెను. అతడు ఎవడు? అతని చరిత్ర యేమిటి? అతను అంతకుముందు క్రీస్తు వారితో యున్నాడా? లేక ఎక్కడనుండి అతను వచ్చి యున్నాడు?

జవాబు :-

నేనుకూడ ఇది చదివి వీడెవడని ప్రశ్నించుకొన్నాను. గాని లాభమేమి? ఎక్కడా యీ సంగతి విశదము కాలేదు. వేరొక సువార్తలో కూడా నెంత వెదకిన ఈ పడుచువాని సంగతి కనబడదు. అవును, బైబిల్లో సంగతులన్నియు వ్రాయబడలేదు. అసలు క్రీస్తు చేసి చెప్పినవన్నియు వ్రాయబడలేదని యోహాను 21:25 లో తెలిసికొంటున్నాము. వ్రాసినవే మనకు మించినవి. వ్రాసినవే చేతకాకుండగా లేనివి యేల వ్రాయబడ లేదని అడుగ తగదు. నిత్యజీవము కొరకెన్ని అవసరమో అన్నియు వ్రాతకు వస్తే భూలోకమైనా అట్టి గ్రంథములకు చాలదని తోచుచున్నది. అయినను దీని సంబంధ ముగా కొన్ని యూహలు మాత్రము గలవు.

ఈ సువార్త వ్రాసినవాడే పడుచువాడని నమ్ముచున్నాము. రెండు అభిప్రాయములున్నవి. (1) మార్కు సువార్త వ్రాసినవాడెవ డనగా బర్నబా పౌలులతో కూడ మొదటిసువార్త యాత్రమీద వెళ్లి వెనుక మళ్లినవాడైన యోహాను, మార్కు రెండు పేరులు అతనికి గలవు. యోహానుతో కూడ మార్కు అని యున్నది. (అపొ. కార్య. 12:12, 25, 13:5,13). (2) లేదా, 1 పేతురు 5:13 లో నా కుమారుడైన మార్కు అని చెప్ప బడినప్పుడు వేరొకడు కాబోలు. అతడే సువార్తకు గ్రంథకర్త. అతడు పేతురు శిష్యుడట. అనగా పేతురు ఆత్మీయ బిడ్డ గనుక అతడే సువార్తను వ్రాసెనని చెప్పడము. అందువలన అనేకులు రెండవ సువార్త పేతురు సువార్త యంటారు ఎట్లనగా పేతురు కుమారుడైన మార్కే వ్రాత వ్రాసినను ఆత్మ చేత నడిపింపబడిన పేతురు సలహా యివ్వగా వ్రాసెనని పెద్దలంటున్నారు. అవును, మార్కే వ్రాసెను.

పేతురు చెప్పియుంటే చెప్పి యుంటాడు గాని ఆ వ్రాత యావత్తు దేవునిదేయనియు దేవుని ప్రేరణ క్రింద జరిగెననియు చెప్పబడిన ఈ మార్కులు అన బడిన వారొక్కరే అనియు నమ్ముచున్నాము. ఇటువంటి యితిహాసముతోనే మరొకటి మ్రోగుచున్నది.

ఈ సువార్త వ్రాసినవాడు పేతురు ఆత్మీయకుమారుడు గనుక ముసలి వాడు కాడు. పడుచువాడే గనుక మార్కు 14:51,52 లో పేరు లేకుండ వర్ణింప బడిన పడుచువాడు మార్కు తానే. తన సంగతి వ్రాసినప్పుడు స్వంత పేరు చెప్పలేక అలాగే వ్రాసిపెట్టెనని హామీ యిచ్చేవారు గలరు. అలాగే యుండవచ్చును. అవునని యైనను కాదనియైనను గట్టిగా నెవరు చెప్పలేరు.

పౌలు రెండవ కొరింథీ 12:1 లో తన కనుగ్రహింపబడిన దర్శనములను వివరింపబట్టి రెండవ వచనములో స్వంత పేరు చెప్పక ప్రథమ పురుషముగా నొక మనుష్యుని నేనెరుగుదునని వ్రాస్తున్నాడు. పేరులేకుండ చేసి వ్రాయుట దీని ఛాయ. మార్కు కూడ నొకవేళ తాను క్రీస్తు పట్టబడిన ఆ గొప్ప రాత్రిలో పడిన భీతిని వివరింపనారంభించి యిదే ఛాయకు వచ్చి తన స్వంత పేరు లోపించి ఫలాని పడుచువాడు పట్టబడితే శత్రువులకు చిక్కుటకన్న బట్ట పోగొట్టుకొనుట మేలని యెంచినవాడై దిగంబరిగా పారిపోయెనని వ్రాసెను. కొన్ని దినములాగి మహిమలో నన్నీ ప్రశ్న అడిగితే ఖుద్దున మార్కును విచారించి మీకుండే సంగతి చెప్పుతాను.

మహిమలో నుంటారని ధైర్యమున్నదా? ఎందుకు లేదు? ఇట్టి భీతి కలిగి క్రీస్తు నొప్పుకొనకుండపోతే భయంకరముగా నుంటుంది. పిరికివారిదే అగ్నిగుండమని ప్రకటన 21:8 లో నున్నది జాగ్రత్త! మత్తయి 10:32,33 దీనిలో చెల్లుచున్నది. ఈ ఫలాని పడుచువాని పేరు మనకు పట్టియుంటే తేటగా ప్రభువు వ్రాయించి సంగతి తెలిపేవాడు. అతని పేరేమిటో మనకు తెలియనక్కరలేదు. అతడు పడుచువాడే అని తెలిసినది.

పడుచువారు పిరికివారని దీనిలో తేలినది. అవును, గిద్యోను న్యాయముగా నొకనాడు తన కుమారునికి శిక్ష విధించు పని అప్పగించి ఫలాని క్రూర శత్రువులమీద పడమంటే ఆ కుమారుడు బొంకెనెందుచేత? యెతెరు చిన్నవాడే గనుక భయపడి కత్తిని దూయలేదని న్యాయాధి. 8:20 లో వ్రాయబడినది. అవును, దీనిలో కూడ పడుచువారు ధీరులు కారని తేలినది జాగ్రత్త! క్రీస్తును నమ్మి రక్షింపబడి గొప్ప కార్యములు చేయబూనుకొండి – రక్షణ పొందకుండ అనేకులు భయముచే వెనుకతీస్తారు.

సేవలో కూడ భయమే పెద్ద శత్రువు – క్రీస్తు యిచ్చే ధైర్యముతో పాతభయమును జయించతగినది. రక్షణతో కూడ పాపి నీతిమంతుడు కాగానే ఆ గొప్ప ధైర్యము అబ్బుతుంది. (సామెతలు 28:1). అబ్బినది అబ్బినట్టు శక్తిహీనముగా ప్రవర్తించవద్దు- ఆఖరిగా పడుచువాడైన మార్కు సువార్తలో వ్రాసినట్టు పారిపోయెను. మళ్ళీ అపొ. కార్య. 13:13 లో వ్రాసినట్లు పారిపోయెనని తెలియుచున్నది-ఇట్టి భయస్థుడెప్పుడైన పనికి వచ్చునా? అవును. రెండవ తిమోతి 4:11 లో చెప్పుచున్నట్లు భీతితో నిండిన యీ మార్కు ఆ భీతిని జయించి కడకు నమ్మకస్థుడై మంచి పనివాడై రెండవ సువార్త వ్రాయుటకు నియమింపబడెను. అట్టి పారిపోయినవారే క్రీస్తును పట్టుకొండి ఆయనలో మీ కొరకు చాలిన ధైర్యము దాగుకొనియున్నది. (కొలస్సై 2:3).

క్రీస్తు సాతానుకు ఓడిపోయెనా?

క్రీస్తు సాతానుకు ఓడిపోయెనా?

ప్రశ్న:

క్రీస్తు సిలువలో నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివని కేకవేసెనుగదా. గనుక ఆ వేళ భయపడి సాతానుకు ఓడిపోయినట్టున్నదా? పేతురు అవిశ్వా సముచేత సముద్రముపై భయపడినట్లు ప్రభువు కూడ భయపడెనా? అట్లు క్రీస్తుకూడ ఒకసారి సాతానుకు ఓడిపోయినట్లు దీనినిబట్టి భావించవచ్చునా?

జవాబు:-

ప్రభువు భయపడెనని ప్రశ్నవేసినవాని యూహ. ఆలాగైతే క్రీస్తుయేసు పరిపూర్ణుడు కాకపోవును. భయమనేది నరమాత్రులకే గాని దైవత్వముగలవానికి చెందుటలేదు. క్రీస్తు వట్టి నరుడైతే సరి భయపడి తీరవలెను. క్రీస్తు మరియ కుమారుడు మాత్రమైతే మనవలెనే జడిసేవాడు గాని ఆలాగు లేదే, ఆయన అట్టివాడు కాడే. క్రీస్తును గురించి పౌలు రోమా 9:5 లో వ్రాయుచు ఆయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు. ఆమేన్.

క్రీస్తు దేవుడైయుండగా నెట్లు భయపడతాడు? ఇట్టి సరికాని తలంపు మనకు దూరమగుగాక. అంతేకాదు క్రీస్తు తనకు సంభవింపనైయున్న ఆ మరణము ముందుగానే యెరిగి ప్రార్థించి జయము నొంది ఆ మరణమునుండి తన్ను రక్షించగలవానికి యాచనలను సమర్పించి భయభక్తులు గలిగియున్నందున ఆయన అంగీకరింపబడెనని హెబ్రీ 5:7 లో వ్రాయబడినది. చచ్చి లేస్తానని తనకు తెలుసును. నా ప్రాణము పెట్టుచున్నాను. దాని తిరిగి తీసికొనుటకుకూడ నా కధికా రము గలదని ధైర్యముగా ముందెలివి కల్గి సాక్ష్యమిచ్చినవాడెట్లు భయపడతాడు? అసాధ్యము.

ప్రశ్న వేసినవారు దీనిలో నిండు పొరబడిరి. యోహాను 10:18 గట్టి బండగా నిలిచినది. దేవుడైన క్రీస్తు తనంతట తానే తన ప్రాణమును పెట్టెను. తెలిసి పెట్టెను. మనలను ప్రేమించి పెట్టెను. పెట్టిన తరువాతకూడ దానిని మళ్లీ తీసికొందునని పూర్వమునుండి యెరిగియున్నాడు. నేను పునరుత్థానమును జీవమునై యున్నానని పలికినవాడు తానే యెట్లు మరణానికి భయపడతాడు? వీలుకాదు.

ప్రశ్న వేసినవాడు రెండవదిగా గొప్ప తప్పుచేసి భయపడిన పేతురుతో క్రీస్తును పోల్చి ప్రశ్నించెను. అబ్బో, పేతురును సృజించినవాడు క్రీస్తు. సృష్టికర్త క్రీస్తు. సృజింపబడినవాడు పేతురు. ఇట్లుండగా పేతురుతో సమానునిగా క్రీస్తును భావించుట చాల పొరబాటు. పేతురును సృజించినది మాత్రము కాకుండ క్రీస్తు పేతురు విమోచకుడై యుండెను. విమోచకుడు వేరు. ఆ విమోచనకు అర్హుడైన వ్యక్తి వేరు. వారిద్దరిని నొకటిగా చేయలేము. పేతురు తక్కువైనవాడు, క్రీస్తు యెక్కువైనవాడు.

అయితే మూడవదిగా ప్రశ్న వేసినవారు క్రీస్తుకూడ నొక పర్యాయమైనను సాతానుకు ఓడిపోయెనని భావించుచున్నారు. అయ్యో ఇందులో కేవలము గొప్పపొరబాటు వచ్చినదని యెల్లరు గాంచవలసినది.

క్రీస్తు సాతానుకు ఓడిపోయియుంటే క్రీస్తు సామాన్యుడనియు మనవలె పాపియనియు తేలినది. ఇది సరియా? వాక్యమేమనుచున్నది? ఆయన పాపముచేయ లేదని పేతురు తన మొదటి పత్రికలో సాక్ష్యమిచ్చి 2:22 లో వ్రాయుచున్నాడు. ఆయనందు పాపమేమియులేదని అపొస్తలుడైన యోహానుకూడ 1 యోహాను పత్రిక 3:5 లో పలుకుచున్నాడు. మరియు హెబ్రీ పత్రిక వ్రాసినవాడు క్రీస్తు మహాత్మ్యమును వర్ణించుచు ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా నున్నవాడును ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చైనవాడునైయున్నాడని చెప్పి యిట్టి పాపములేని ఆయనే మనకు సరిపోవు ప్రధానయాజకుడని వక్కాణించు చున్నాడు. క్రీస్తు తానే యొకనాడు శత్రువులైన ఆ యూదులతో నాయందు పాప మున్నదని మీలో నెవడు స్థాపించునన్నప్పుడెవరును ప్రత్యుత్తరమిచ్చినట్టు కనబడుటలేదు ఎందుకు? అట్టి నిరూపణ యెవరిచేత కాజాలదు. క్రీస్తు నిష్పాపియై యుండెను. (యోహాను 8:46). కనుక నొక నిమిషమైన క్రీస్తు సాతాను కోడిపోయెనని అనవద్దు. అది సత్యము కాదు.

క్రీస్తు యొకడే నా తండ్రి కిష్టమైన కార్యములు నేనెల్లప్పుడును చేయువాడనని చెప్పగలడు. (యోహాను 8:29). నరవంశములో ఆయన యొకడే పాపరహితుడైనవాడు. క్రీస్తు యొకడే లోకాధికారియైన సాతాను విషయమై – ఇదిగో నాతో వానికి సంబంధమేమియు లేదని పలుకగలవాడు. (యోహాను 14:30). అసలు మరణముయొక్క బలముగలవాడైన ఆ సాతానును నశింపజేయుటకే క్రీస్తు వేంచేసె ననియు వేంచేసి మరణమునొంది లేచుటద్వారా సాతానును ఓడించెననియు హెబ్రీ 2:14,15 లో తెలిసికొని చదువుచున్నాము. సాతానును గెల్చినవాడెట్లు సాతానుకు యోడిపోతాడు? కాబట్టి క్రీస్తుకు పాపము నారోపింపకండి. మరియు జయవీరుడైన క్రీస్తు సాతాను కోడిపోయెనని యైనను చెప్పకండి.

దీనిలో మరొకటి కలదు క్రీస్తు సాతాను కోడిపోయి పాపియై యుంటే కేవలము వాక్యానికి విరుద్ధము వచ్చినది కాకుండ ఆయన ప్రాయశ్చిత్తమునకుకూడ లోటు కలిగెను. క్రీస్తు తానే పాపియైయుంటే పాపుల విమోచనార్థమై యింకనేమి సహాయము చేయగలడు? ఏమియు లేదు. తానే గ్రుడ్డివాడైతే అంధులకెట్లు త్రోవజూపగలడు? క్రీస్తు లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లయైనవాడని యోహాను 1:29 లో మ్రోగుచుండే గొప్ప సువర్తమానము. అయితే నొకటి – క్రీస్తు బలియైన గొర్రెపిల్ల అంటే ముందొకసంగతి పరిష్కారము కావలసినది. అదేది? పాత నిబంధనలో జూస్తే బలికి తేబడు ప్రతి గొర్రెపిల్ల ముందు పరీక్షకు నిలిచి అది ఏడాదిగాను నిర్దోషమైనది గాను తేలితేనే తప్ప అది బలికి యోగ్యము కాకపోతుంది.

నిర్గమ 12:6 లో వ్రాసిన యీ చట్టముగాక లేవీయ 22:21 లో ఆ బలి అంగీకరింపబడినట్లు దోషము లేనిదై యుండవలెను. దానిలో కళంకమేదియు నుండకూడదని వ్రాసినది. కాబట్టి క్రీస్తు యొకసారియైనను సాతానుకు ఓడిపోయియుంటే బలికి యోగ్యుడు కాకపోతాడు. కాబట్టి క్రీస్తుయందు దోషమున్నదని సూచించుట గొప్ప పాతకమైయున్నది. అది ఆయన ప్రాయశ్చిత్తమున కడ్డము తగులుతుంది. మరియు పునాదియైన ఆ ప్రాయ శ్చిత్తమునకు భంగమువస్తే యిల్లు పడిపోయినట్టే. అసలు గొర్రెపిల్లలో నొక చిన్న యెముకైనను విరిగిపోకూడదని నిర్గమ 12:46 లో ఆజ్ఞాపించబడినది.

అందుచేత బలిగా వచ్చిన క్రీస్తులో లేశమైనను పాపదోషముంటే అనగా నొక యెముకైనను విరిగినట్టు ఆయనలో కళంకము కనబడియుంటే అట్టిది మరి యేదైనను ఆయనలో నుంటే ఆయన దైవత్వము నిలువక పోవును. అసలు ఆయన లోకరక్షకుడు కాలేక పోవును. కాబట్టి యెంతమాత్రమును క్రీస్తు సాతానుకోడిపోయె ననవద్దు. ఈలాగైతే మిగిలినదేమనగా ఎందుకు క్రీస్తు సిలువమీద ఆ కేక వేసెను? జవాబు దీనికున్నది. ప్రవచనములోనే దాని నిమిత్తము కనబడు చున్నది.

క్రీస్తు రాక పూర్వము విరివిగా ఆయననుగూర్చిన ప్రతి సంగతి ప్రవచనములలో చెప్పబడెను. ఆయన కన్య జననము, జన్మించు గ్రామము, చిన్న శిశువుగా నున్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోయేది, మున్నగు కార్యములన్నియు ముందుగానే సూచింపబడెను. ఆయన సిలువ శ్రమలు బహు వివరముగా చెప్పబడెను. కీర్తన 22:16 లో ఆయన కాలుసేతులు పొడువబడునని వ్రాయబడెను.

వస్త్రములకొరకు చీట్లు వేసి పంచుకొన్న సంగతి 18వ వచనములో నున్నది. సిలువమీద నుండగా చూచువారు హాస్యము చేసి పెదవులు విరిచి తల ఆడిస్తారని 7 వ వచనమునందు వ్రాయబడెను. 22:8 లో కొందరు వచ్చి చావకుండ ఆయనను తప్పిస్తారేమో అను సంగతి వివరింపబడెను. సిలువమీద నుండగా కొందరాలాగే ఏలీయా వచ్చి అతని రక్షించునేమో చూతమని కాచుకొనిరి. (మత్తయి 27:49). అనగా ముందు వ్రాయబడినట్లే కార్యమంతయు జరిగెను.

కీర్తన 22:22 యైతే చనిపోయిన క్రీస్తు లేచి తన సంఘమును స్థాపించి నమ్మినవారిమధ్య నివసించి ఆ సహోదరులకు తండ్రి నామమును ప్రచురము చేయునని వ్రాయబడి యుండగా హెబ్రీ పత్రిక వ్రాసినవాడు 2:11,12 లోకి వచ్చి ఆ మాటలు క్రీస్తునే అన్వయించినవని తేటగా వివరించుచున్నాడు గనుక కీర్తన 22 లో ప్రాముఖ్యముగా దాని సారాంశమంతయు వచ్చి చనిపోయి లేవబోవు క్రీస్తుని గురించినది. ఆలాగైతే ఆ చెట్టుమీద ఆయన వేసిన కేక సహితము ప్రవచనములో నెందుకు లేదని యడుగవచ్చును.

ప్రతి సంగతి వివరింపబడియుండగా ఆ కేక సంగతి కూడ ప్రవచనములో లేదాయెనా ఏమి? కీర్తన 22:1 లో సరిగానే ఆ కేక కనబడుచున్నది. దావీదు రాజు తానే ఆ కేక వేసినట్టున్నదిగాని క్రీస్తు వస్తాడనగా వెయ్యియేళ్ళకు పూర్వమున్న దావీదు ప్రవక్తగా నుండి రాబోయే క్రీస్తు విషయమై ఆయన వచ్చి శ్రమపడగా ఆలాగు కేక వేస్తాడని దావీదు ఆత్మవశుడై వ్రాసెనని వ్యక్తమగుచున్నది. ఇప్పుడు తెలిసినది. క్రీస్తు భయపడి ఆ కేకవేయలేదు. అట్టి భయమనేది రక్షకుడుగా నుండే ఆయనకు తగదు.

ప్రవచనము నెరవేరుటకే ఆయన ఆ భయంకరమైన కేక వేసెనని తీర్మానించుచున్నాము. ముందుగానే వ్రాయబడెను. వెయ్యియేండ్ల తరువాత అక్షరాల నెరవేరెను. అదే దీని మర్మము. కనుక ఆ కేక వేయుటద్వారా క్రీస్తు దైవత్వము తగ్గిపోవుటకు ప్రతిగా మరి బలపరచబడెను. ఆ కేక వేయుటద్వారా ప్రవచనములలో సూచింపబడినవాడాయనే అని మరి స్పష్టమాయెను. కనుక ఆ కేక క్రీస్తుకు సహాయమాయెను.

క్రీస్తు ఆలాగు నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివని అరువకపోతే కీర్తన 22:1 లో లిఖింపబడిన ఆ లేఖనమాలాగుననే నిరర్థకమైపోవును. అట్లు కాకూడదు. యోహాను 10:35 చూడండి. గనుక రావలసినవాడు వచ్చెను వచ్చి చేయవలసిన పనిచేసి ముగించెను. అంతే కాదు, ఇవ్వబడిన వివరములో ప్రవచన భావము నెరవేరులాగున అసలు ఆయన ఆ చెట్టుమీద అరువవలసిన అరుపులుకూడ ముందుగా చెప్పబడెను గనుక ముందివ్వబడిన లేఖనమును ఘనపరచి సంపూర్ణము చేయుటకై క్రీస్తు ఆ కేక వేయవలసియుండి వేసెనని తేటపడుచున్నది. ఇంక నున్నది.

విమోచన క్రయము చాల గొప్పది. రాబోయే ఆ గొప్ప కార్యమునకు ముంగుర్తుగా ఇశ్రాయేలీయులలో అజాజేలు ఆచారము సంవత్సరమున కొకతూరి జరుగుచుండెను. అదేది? లేవీ 16 లోనే యిది వివరింపబడినది. సంవత్సరమున కొకతూరి అనగా ఏడవ నెల పదియవ దినమున యూదులందరును సమాజముగా కూడుకొని ఆనాడే సంవత్సరము పొడుగున చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము చేసి దేవుని దీవెన నొందవలెను. దానికొరకు రెండు మేకలు నియమింపబడెను.

ఒక మేక అప్పుడే వధింపబడియుండగా చీటీపడిన ఆ రెండవ మేకమీద ప్రధాన యాజకుడు చేతులుంచి దానిమీద వేసినట్టుగా నిరుడు జనులు చేసిన పాపమునంతయు నొప్పుకొని మోపుతాడు. (16:21). అంతట జనుల సమస్త పాపమును మోసికొన్నట్టు నియమింప బడిన ఆ మేక యెచ్చటికి పోవలెను? 16:22 చూడండి. ఆ మేక వారి పాప దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును. అరణ్యములోకి దాని పంప వలెనని 16:21 లో నున్నది.

తెలిసినవాడు దాని తోలుకొని వెళ్ళి అచ్చటనే దానిని ఒంటరిగా విడిచి రావలెను (16:22). పాత తర్జుమాలో – నిర్జనమైన దేశమునకు వెళ్ళి దానిని విడిచి రావలెనని యున్నది. అరణ్యము, ఎడారి, నిర్జనము ఈ మూడు పదములు దోషమును భరించిన ఆ మేకను సంబంధించియున్నవి. కొట్టి వేయుటకు కాదు, నెరవేర్చుటకొరకే క్రీస్తు వచ్చి గొర్రెపిల్లయై మేకయై మన పాపదోషములను భరించుటయందు జనులుండే తావుకు పోకూడదు – నిర్జనమైన స్థలములోనే మేకయుండి చనిపోవలెను.

ఎడారి అనే మాట నెరవేరవలెను. అరణ్యమనే భావము క్రీస్తుకు వచ్చి సంపూర్ణము కావలెను. కాబట్టి సిలువలో నున్నప్పుడు క్రీస్తు ఆ కేకలోనే తనకు కలిగిన గొప్ప విపత్తు కనుపరచుచున్నాడు. ఆత్మీయముగా క్రీస్తు యెవరును లేని స్థలములో చనిపోయెనని గ్రహించుచున్నాము. అప్పుడు శిష్యులు ఆయనను విడిచిపోయిరి. దానికి ముందే ఖజానాదారుడైన యూదా ఇస్కరియోతు డబ్బు కాశపడి అప్పుడే క్రీస్తును విడిచిపెట్టెను. నిన్ను ఎన్నడును విడువననిన పేతురు సహా దూరమై పోయెను. అంతేకాదు, తుదకు దేవుడే దూరము కావలసివచ్చెను.

మన పాపమునుబట్టి మనమే దేవునికి దూరమైపోయి నశించియుండవలెను గాని క్రీస్తు మన స్థానానికి వచ్చి మన పాపదోషములను భరించుచు దేవునికి దూరస్థుడాయెను. మనలను సమీ పస్థులనుగా చేయుటకే తానింతగా మనలను ప్రేమించి ఆ గొప్ప విమోచన క్రయము కట్టుటలో అంతగా అధముడాయెను. ఎల్లప్పుడు తండ్రి సాన్నిధ్యములోనున్న యేసు ఆ వేళ మన పాపములను మోసికొని అజాజేలు పేరట చీటి వచ్చినట్లు సమ్మతించి-

  1. లోయలో చచ్చినట్టె
  2. అరణ్యమునకు వెళ్ళిపోయినట్టె 3) నిర్జనమైన తావులో నిలిచినట్టె

ఆ భయంకరమైన కేకవేసి క్రయము కట్టి మనలను విడిపించెను.
ఆ మొదటి మేక వధింపబడియుండగా దాని రక్తము అడ్డతెర లోపలికి తెచ్చి ప్రోక్షించినట్టు 16:15 లో వ్రాయబడియున్నది. ప్రధానయాజకుడే ఆ రోజున ఈ గొప్ప పని చేయవలెను. ఆయన ఆ రక్తమును లోపలికి తీసికొనివెళ్ళి బయటికి వచ్చేవరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదని తేటగా లేవీ 16:17 లో శాసనముగా ఆజ్ఞాపింపబడెను. క్రీస్తు ఆ రెండవ మేకగా నిర్జనభూమికి పోయి చనిపోవలెను. అయితే మొదటి మేక కూడ క్రీస్తుకు ముంగుర్తుగానున్నది. గనుక మొదటి మేకవలె క్రీస్తు వధింపబడి మరియు ఆయన రక్తము అడ్డతెర లోపలికి రావలెను. బలి క్రీస్తే మరియు ప్రధానయాజకుడు కూడ నిప్పుడు క్రీస్తే, ఇదంతయు

క్రీస్తులోనే నెరవేరెను. కాబట్టి యెట్లు ఆ ప్రధానయాజకుడు ఒంటరిగా లోపలికి వెళ్ళి ఆ బలిరక్తము ప్రోక్షించెనో ఆలాగే క్రీస్తు ఒంటరిగా పనిచేయవలెను. నా దేవా, నా దేవా, నీ వేల నన్ను చెయ్యి విడిచితివి అంటే ఆ ఒంటరితనమనేది పూర్ణముగా నప్పుడే క్రీస్తుకు తగిలి రుచి ఆయెనని నమ్ముచున్నాము. ఏ మనుష్యుడా వేళ క్రీస్తుకు సహాయము చేయరాదు. దేవుడు సహా తన ముఖము త్రిప్పి తన కుమారుని ఒంటరిగా విడిచిపెట్టెను. అతి పరిశుద్ధుడు దేవుడే గనుక హబక్కూకు 1:13 లో వ్రాయబడినట్లు ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కాబట్టి మన సమస్త పాప దోషములను భరించిన క్రీస్తు ఆ చెట్టుమీద నుంచగా

  1. ఇవ్వబడిన ప్రవచన నిమిత్తముగాను (కీర్తన 22:1)
  2. అజాజేలు మేక ఛాయను నెరవేర్చు నిమిత్తముగాను 3) ఏకాంతముగా రక్తప్రోక్షణము చేయవలసిన ప్రధాన యాజకుని మాదిరి నిమిత్తముగాను
  3. పరిశుద్ధుడైన దేవుని నిష్కళంక దృష్టి నిమిత్తముగాను
  4. రక్షణ యొక్క వెల యింత విలువైనదని మనకందరికి నేర్పు నిమిత్తముగాను
  5. మనమే దేవుని సాన్నిధ్యమునుండి పారదోలబడి నిత్యనాశనమను దండనకు వెళ్ళిపోయి బాధ అనుభవించవలసియుండగా మనకు ప్రతిగా నిలిచిన నిమిత్తముగాను
  6. మనమీదనున్న దేవుని ప్రేమ నిరూపించి మనపట్ల దేవునికున్న చిత్తము సంపూర్ణము అగు నిమిత్తముగాను-

క్రీస్తు ఆ సిలువమీద భయంకరమైన కేకవేసి ప్రాణమును పెట్టి మనలను విముక్తు లనుగా చేసెను. దేవునికి స్తోత్రము. నమ్మినవారికే అనుభవ మగుచున్నది, కాబట్టి క్రీస్తు ఆ కేకవేసినదానిలో సాతానుకు యోడిపోయిన దానికి బదులుగా సాతానును జయించుచుండి గొప్ప అతిశయముతోనే ఆ జయకేకవేసి చనిపోయెనని బోధపడు చున్నది. కావున ఆ కేకకు అభ్యంతరపడక దానివలన రక్షణయొక్క విలువ యెంతో తెలిసికొని ఆ రక్షకుని ఆహ్వానించి నమ్మి మీ స్వంత రక్షకునిగా అంగీకరించి రక్షింప బడండి. అంతట క్రీస్తు సిలువమీద బాధ అనుభవించి భయంకరముగా కేకవేసినదాని కార్యము మీ మట్టుకు వృధాగా పోదు. దేవుని కృపను నిరర్థకము చేయవద్దు. (గలతీ 2:21).

తూర్పు పడమరల యుద్ధము లెట్లు?

తూర్పు పడమరల యుద్ధము లెట్లు?

ప్రశ్న:-

ప్రకటన 16:12-16, 13:11-18 లో నున్న తూర్పు పడమరల యుద్ధము వచ్చునా? ఎప్పుడు వచ్చును?

జవాబు:-

అవును, ప్రకటన 16:11-16 చూస్తే తూర్పునుండి వచ్చు రాజులు అనే గుంపువారు చెప్పబడియున్నారు. వారందరేకమై యుద్ధానికి వచ్చేది నిజము. ప్రకటన 9:16 లో కూడుకొనిన ఆ తూర్పు సైన్యముల లెక్క ఇరువది కోట్లని వ్రాయబడినది. అంతటి గుంపు వచ్చి లోకమును తల్లక్రిందులు పెట్టగా మనుష్యులలో మూడవ భాగము సంహరింపబడునని ప్రకటన 9:15 తెల్పుచున్నది. జరుగకముందుగానే ప్రభువు మనకు సత్యవచనములలో సమస్తమును వివరించి తెల్పుచున్నాడు. ఆయన నామము స్తుతింపబడుగాక.

ఈ గొప్ప సంహారము దేవుని యెరుకలో ఫలాని త్సరము, నెల, దినము, గంట అనే మట్టుకు నిశ్చయింపబడియున్నది. చూడండి. మెప్పుడు జరుగునను ప్రశ్నకు జవాబుగా ప్రకటన 9:15, అపొ. కార్య. 1:7 డి. యెందుకంటే నాకైనను దూతలకైనను తెలియనిది తండ్రి తానే తన చేతిలో నమయమును కాలము నుంచుకొనియున్నాడు. మరియు 1 కొరింథీ 11:3 లోని శిరస్సత్వమును కాపాడుట కొరకు మార్కు 13:32 ప్రకారము కుమారుడైన క్రీస్తుకు కూడ ఆ సమయము తెలియదని వ్రాయబడినది.

దైవత్వముగల క్రీస్తుకు సమస్తమును తెలుసును లెండి. గనుక రెండవ రాకడ సంగతియు క్రీస్తు యెరిగియున్నాడు. అయితే మాదిరికొరకు తండ్రికి లోబడి ఆ సంగతి తండ్రి కప్పగించియున్నాడు. మనముకూడ జరుగబోవు ఆ మహాయుద్ధము సంబంధముగా నెప్పుడు జరుగునో ఫలాని తేదికొరకు వెదకక క్రీస్తు రాకడ కొరకెదురుచూచుచు తత్సమయములో కార్య. 1:8 ప్రకారము ఆయనపరముగా సాక్ష్యమిచ్చుచుండవలయును. క్రీస్తు సంఘమెత్తి వేయబడనిదే ప్రకటన 9, 13, 16 మొ. అధ్యాయములో వ్రాయబడినవి నెరవేరజాలవు.

వెలుగు గాను, ఉప్పుగాను, అడ్డగించుచున్న వాడుగాను పనిచేయుచున్న సంఘము తీసివేయ బడుటతోనే 2 థెస్స. 2:7-9 చొప్పున ధర్మవిరోధి బయలుదేరి వచ్చి పనిచేస్తాడు. వాని దినములలోనే ఈ భయంకరమైన యుద్ధము జరుగును. ఆ యుద్ధములో యూదులు మర్దనపొందుదురు. ఎందుకంటే జెకర్యా 14:1,2 ప్రకారము వారి ముఖ్య పట్టణమైన యెరూషలేము అన్యజనులందరి సైన్యముల చేత చుట్టబడును. సమకూడి వచ్చిన వారొకరితో నొకరును మరియు యూదులతోను భయంకరముగా పోట్లాడుదురు

గనుకనేఆ ఘోర యుద్ధము విశేషముగా జరిగేతావు హెబ్రీభాషలో హార్ మెగిద్దోనని పిలువబడుచున్నది. తెలుగులో సంహార పర్వతమని అర్థము. (పకటన ్ర 16:15). ఈ పేరు రెండవ దిన. 35:22 లో కనబడుచున్న మెగిద్దోఅనబడిన లోయతో సంబంధించి యున్నది. మొన్న పాలస్తీనుకు వెళ్ళినప్పుడీలోయను జూచితిని. ఈ స్థలమున నొక కాలమందు జరిగిన యుద్ధములో రాజైన యోషీయా మరణకరమైన గాయము తగిలి యెరూషలేమునకు వెళ్ళి చచ్చెను.

ఆరంభములో యెహోషువ మెగిద్దోపద్రేశము నేలుచుండిన అన్యుడైన రాజునోడించి మెగిద్దోను పట్టు కొనెను. (యెహోషువ 12:9-24). అయితేబారాకు దెబోరాలు జీవించిన దినములలో అవసరమునుబట్టివారు జరిపిన యుద్ధము మరల ఆ చోటివరకు వ్యాపించగా మెగిద్దోకాలువల యొద్దశత్రువులపైవారు గొప్ప విజయము నొందిరి. (న్యాయాధి5:19). యూదా రాజైన అహజ్యా ప్రాణము విడిచినది యీ మెగిద్దోఅనబడిన యుద్ధస్థలములోనే. (2 రాజులు 9:27). మరియు యూదులిక బహుగా పల్రాపింపబోవు స్థలము మెగిద్దోఅని జెకర్యా 12:11 తెల్పుచున్నది. ఇదంతయు నొట్టుకు చేర్చి చెప్పితేఈ క్రిందికార్యములు జరుగనైయున్నవని గోచరించుచున్నది.

ఇరువదికోట్లసంఖ్య గల తూర్పు రాజుల సైన్యము యేర్పడికదలి వస్తుంది. (పకటన ్ర 9:16).

ఈ మహా గొప్ప సైన్యముతో కూడ లోకమంతటనున్న రాజులు వారివారిసైన్యములతో చేర్చబడుదురు – ఇందులో చేరక పత్ర్యేకముగా నుందామని ఏ రాజు చెప్ప వీలుపడదు. (పకటన ్ర 16:14). బహుశ ఈ సైన్యములు మృగమనేవాని ఆధీనముక్రింద నుంటవి. (పకటన ్ర 13:7).

మూడవ గుంపుగా నుత్తరమునుండిరష్యా సైన్యములు వచ్చును. యెహెజ్కేలు 38:2 లో చెప్పబడిన రోషు రష్యాయనియు, మెషెకు రష్యా రాజధానియైన మాస్కో అనియు అనుకుంటున్నాము. కాబట్టిదానియేలు 11:44 పక్రారము కడవరిదినము లలో (యెహెజ్కేలు 38:16)
సర్వలోకము మూడు గుంపులుగా విభాగింపబడి

తూర్పు రాజులు – వారిదొక సమూహము

ఉత్తరపు సైన్యము – రష్యావారు.

క్రీస్తు విరోధిసమకూర్చిన పదిమందిరాజుల గుంపువారందరును పాలస్తీనులో బడియూదులను దోచుకొందామని పయ్ర త్నించుదురు. అయితే యూదులకొరకు కొందరు నిలిచి పోట్లాడగా మెగిద్దాలో గొప్ప వధ జరుగును. గనుకనే ఆ స్థలము హర్మగెద్దోనని పిలువబడినది. “మెగిద్దో లోయలో జరిగెడి వధ” అని దాని అర్థము. అందరును యూదులపై పడరు. కొన్ని జనాంగములవారు దాడిగా వచ్చేవారి నెదిరించి జరుగబోవు తీర్పులో మత్తయి 25 ప్రకారము యూదులకు చేసిన యుపకార సహాయ ములనుబట్టి కుడితట్టు ఆశీర్వాదములతో దీవింపబడుదురు. (మత్తయి 25:35-37). రష్యా దోపిడి నెదిరించు సమస్య యెహెజ్కేలు 38:13 లో వివరించబడినది.

ఏది ఎట్లును లోక జనులలో మూడవ భాగము జనులు సంహరింపబడగా కట్టకడపటి మూడు శ్రమలలో రెండవ గొప్ప శ్రమ సంభవించినట్లుండును. (ప్రకటన 19:12).

దయ్యముల సహాయముతో లోకాధిపతులు ప్రేరేపింపబడి ఈ మహా యుద్ధమునకు వచ్చెదరు. (ప్రకటన 16:14-15). ఆ వేళ హిందూ దేశము ఆ తూర్పు రాజులతో నిలుచునా, లేక పదిమంది రాజులతో నిలుచునా లేక రష్యాతో సంయోజితమై నిలుచునా, యెవరు చెప్పగలరు? అయితే నిప్పుడు ఆ కష్టకాలము రాకపూర్వమే క్రీస్తు సువార్తచేత అనేకులు ఇండియాలో రక్షింపబడుదురుగాకని ప్రార్థించు చున్నాము. దానికి తగినట్లు కూడ కృషి చేయవలెను.

క్రమక్రమేణ మెగిద్దోలో జరిగిన పోరు దక్షిణముగా వచ్చివచ్చి ప్రబలముగా యెరూషలేము పట్టణమే ముట్టడివేయబడును. (జెకర్యా 14:1). శత్రువులు పోరాడగా యూదులోడిపోయినట్టు సూచనగా పట్టణము పట్టబడును. ఇండ్లు కొల్లపెట్టబడును. సిపాయిలు హద్దులేక ఆ యూదా స్త్రీలను చెరుపుదురు. యూదులు ఓడిపోయినట్లే కనబడుతుంది. అయ్యో పాపము!

శత్రువులు జయఘోష చేయుచుండగానే అబ్బో యెన్నడు లేవనిరీతిగా ప్రభువైన క్రీస్తుయేసు అను యెహోవా తానే ప్రస్తుతము కూర్చుండియున్న దానిలోనుండి లేచి రెండవసారి మహిమతో వచ్చి అందరి కగుపడి ఆ శత్రుసైన్యములను నలుదిక్కులు చెదరగొట్టి కొనకు గొప్ప రక్షణతో తన ప్రజలను రక్షించును. ఆయన పాదములు ఒలీవ కొండమీద నిలువగా నింత పని జరుగును. జెకర్యా 14 వ చదివితే అధ్యా పంచాంగమిట్లు భవిష్యత్తు చెప్పుచున్నదని గ్రహించుకుంటారు.

ఈ సంగతులు నిశ్చయము. అటు తరువాత మిగిలిపోయినవారికి తీర్పుతీర్చి క్రీస్తు సర్వలోకమునకు రాజు అగును. (జెకర్యా 14:9). తూర్పు సైన్యములను సంబంధించినట్లు సారిసారి ఫరాతు నది ప్రకటన 16:12 లోను 9:13,14 లోను సూచింపబడి నందున అరబీవారే ఈ కడపటి యుద్ధమునకు కారకులై యుంటారని యూహించుచున్నాము. ఎందుకనగా ప్రస్తుతము ఫరాతు నది ప్రాంతము వారి వశములోనే యున్నది. మరియు అరబీవారు యూదులమీద పట్టినపట్టు అతి తీవ్రమైనదని యెల్లరమెరిగియున్నాము. సందేహము లేకుండ తూర్పు పడమరల మహా యుద్ధము రానైయున్నది.

ఆ దినమున మీరెచ్చట నుంటారు? ప్రాణముతోనుండి ఆ సమస్యలో చేరుతారా, ఏ ప్రక్కను? యూదుల పరముగా వారికి విరుద్ధ పక్షముగానా? లేక బూర మ్రోగగా క్రీస్తుతో సదాకాల ముండుటకు మేఘములమీద కొనిపోబడుదురా? క్రీస్తులో నున్నారా? రక్షింపబడి యున్నారా? ఆలాగుంటే వచ్చే ఈ కష్టాలనెదిరించి తలయెత్తి సిద్ధపడియుండగలరు. (లూకా 21:26-28).

ప్రసిద్ధిచెందిన సహోదరుడు

ప్రసిద్ధిచెందిన సహోదరుడు

ప్రశ్న:

రెండవ కొరింథీ 8:18 లో చెప్పబడిన సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుడెవడు?

జవాబు:-

బైబిల్లో ప్రతి సంగతి వ్రాయబడలేదు, యెహోషువ భార్య యెవరు? ఏలీయా తల్లిదండ్రులెవరు? వాని వంశావళి ఏది? మున్నగు అనేక ప్రశ్నలకు బైబిలులో జవాబు దొరకదు. ఎందుకు? అక్కరకు వచ్చినదే యున్నది గాని, వారు వీరూరకయే అడిగెడి ప్రతిదానికి బైబిలులో దేవుడు జవాబు పెట్టలేదు.

మనకు సంబంధము లేదు గనుక పెట్టలేదు.అయితే రక్షణ సంబంధముగా అదేమిటో, ఎట్లు కలుగునో, కలిగితే సూచనలేవో, రక్షింపబడిన తరువాత ప్రవర్తించేది యెట్లో, నరకమెటువంటిది, తండ్రి యిల్లు యెటువంటిది మున్నగు విషయాలు దండిగాను వివరముగాను ఆకర్షణీయము గాను బైబిల్లో ప్రభువు వ్రాయించి పెట్టినందులాయనకు స్తోత్రము కలుగునుగాక.

ఈ రెండవ కొరింథీ 8:18 లో నున్నవాని పేరు మనకు బయలుపర్చబడలేదు. పేరు లేకపోయినా ఆయననుగురించి తెలియవచ్చిన సంగతులేవనగా :

రక్షింపబడినవాడై యుండెను – ఎందుకంటే సహోదరుడని పిలువబడు చున్నాడు.

తన్ను రక్షించిన ఆ గొప్ప సువార్త విషయమై మిక్కిలి ఆసక్తి గలవాడని తెలియుచున్నది; ఎందుకంటే సువార్త విషయములోనే చెప్పబడియున్నాడు.

ఒక స్థలములో కాదు, నానా స్థలములు తిరిగి ఆయా సంఘముల పరిచయము ఇతడు చేసినట్టున్నది; ఎందుకంటే సంఘములన్నిటిలో పేరుపొందినవాడతడు అని వ్రాయబడినది.

మంచి పేరు గలవాడు. ఇతని దగ్గర దుర్వాసన లేదు స్తోత్రము. ఎక్కడికి వెళ్ళిన మంచిపేరే గాని క్రీస్తుకు ప్రతికూలముగా నడిచినట్టు చెడ్డ సమాచారమే లేదు. గనుక అతని పేరు ప్రసిద్ధికెక్కినది సామాన్యము కాదు, యితనిలో నాయకత్వ గుణముండెను.

ఇతడు ఇతర సహోదరుల నమ్మకమునకు యోగ్యుడు కాబట్టి పౌలు కావేళ యప్పగింపబడిన యుపకార ద్రవ్యము (8:19) విషయమై ప్రయాణము చేయుటకు తీతుతో కూడా ఇతడు సహోదరులచేత ఏర్పరచబడెను. అహహా ఇట్టి యోగ్యుని పేరు స్పష్టముగా మనకు తెలిసియుంటే యెంతో మంచిది. చాలమంది చేతిలో కానుక డబ్బుపడితే కొడుకు పెండ్లికొరకో, భూమిని కొనుటలోనో దాని పాడుచేసి చెడ్డపేరు తెచ్చుకొనిరి. ఇట్లు పడకుండ పౌలు తనతో తీతును, వీనిని, 8:22 లో చెప్పబడిన మరియొకనిని తోడుచేసికొనెను. లేదా పోగైన చందా విషయమై మామీద నెవడైన తప్పు మోపునేమోయని పౌలు హెచ్చరిక కలిగి యుక్తముగానే ప్రవర్తించెను. (2 కొరింథీ 8:20).

ఇతడు సంఘ దూత అనియు లేక చిన్న అపోస్తలుడనియు రెండవ కొరింథీ 8:23 లో వ్రాసిన వాక్యము నాధారముచేసికొని చెప్పగలము. (మూలభాషలో చూడండి). ఇతడు క్రీస్తు మహిమయై యుండెనని 8:23లో నున్నది. అహహా, ఒక కాలమందు మనవలె దేవుని మహిమను పొందలేకపోయిన ఈ పేరు లేని వ్యక్తి క్రీస్తును నమ్మినందుచేత క్రీస్తు మహిమయైపోయెను చూడండి.

మహిమ లేనివారిలో క్రీస్తు తన మహిమ ధారపోసేవాడనియు గనుక సువార్త సారమేదనగా మహిమలేని వారికి క్రీస్తు చనిపోయి లేచినందు వలన మహిమ కలుగుచున్నదనియు దీనిలో తెలిసికొంటున్నాము. ఇతడు మూడవ సువార్తను దానితోకూడ అపొస్తలుల కార్యముల గ్రంథమును వ్రాసిన లూకాయని యొక నిఘంటువు సలహాయిచ్చుచున్నది.

ఈ సువార్తికుడైన లూకా పౌలుతో తిరిగినవాడని అపొ. కార్యములో అప్పుడప్పుడు “మేము” “మమ్మును” అనే పదము కనబడుటచేత తెలియుచున్నది. త్రోయకు రెండవ యాత్రమీద పౌలు సీలలు వచ్చినప్పుడు గ్రంథము వ్రాసిన లూకా వారిని కలిసికొన్నట్టున్నది. గనుక 16:10-18 వరకు తరచుగా “మేము” “మేము” అని వ్రాస్తున్నాడు. 16:19,40 లో లేచిన అల్లరి తొందరలలో లూకా లేడు. ఎచ్చటికో వెళ్లిపోయినట్టున్నది. తిరిగి మూడవ యాత్రలో త్రోయ చేరినది మొదలుకొని యెరూషలేము చేరువరకు లూకా వచ్చి పౌలును కలిసికొన్నట్టున్నది. 20:5,6,7,8; 21:1,7 మరియు 21:17 వరకు చూడండి. “మేము” అని తిరిగి వచ్చినది.

రోమాకు ఖైదీగా పౌలు వెళ్ళుచుండగా లూకా తోడుగానున్నాడు. కాబట్టి – అపొ. కార్య. 27,28 అధ్యాయముల సాక్ష్యము ద్వారాను, కొలొస్సై 4:14 వంటి వచనములద్వారాను ఎడబాయకుండ వైద్యుడైన లూకా తరచుగా పౌలును హత్తుకొని ఆయనతో యాత్ర తిరిగినది తెలియవచ్చి నందునను రెండవ కొరింథీ 8:18 లో పేరు లేకుండ ప్రసిద్ధిచెందిన సహోదరుడుగా సూచింపబడినవాడు లూకాయేయని కొందరు తీర్మానించిరి. ఆలాగుండవచ్చును. అయితే కొంత కాలమాగి ఆ ప్రశ్న నన్ను మహిమలో అడిగితే మరి మంచిది.

సంపూర్ణమైన జవాబు అప్పుడే యిస్తాను. ఇప్పుడు తెలియనివి యప్పుడు తెలిసిపోవును – 1 కొరింథీ. 13:12. లేక నన్ను అడుగక మీరే నేరుగా ప్రభువును విచారించి తెలిసికొంటారేమో! అక్కడికి మహిమలో రారేమో! లూకా తన యాత్రలవలనను వ్రాసిన తన గ్రంథాలవలనను సంఘములన్నిటిలో పేరుపొంది యుంటాడు. కాబట్టి చెప్పబడినవాడితడే అని నమ్మిన నమ్మవచ్చును. అయితే దీనిలో ముఖ్యమైన సంగతి ఏదనగా లూకాను గూర్చి లేక పేరు లేని ఈ సహోదరునిగూర్చి చెప్పబడినట్టు మీ సంగతి యెట్లు? రక్షింపబడితిరా లేదా? మంచి పేరున్నదా లేదా? సహోదరులలో ముల్లుగానా లేక ప్రసిద్ధికెక్కిన సహాయార్థముగానా, ఎట్లున్నది మీ సంగతి? ఇట్లు విచారించుకొని బ్రతుకు దిద్దుకొని క్రీస్తు మహిమకు జీవిస్తే నింతే చాలును. (1 కొరింథీ 10:31).

దావీదు భార్యలు

దావీదు భార్యలు

ప్రశ్న:- దావీదు భక్తుడైతే అతనికెందుకు నింతమంది భార్యలు? దేవుడు దానికి సమ్మతించినాడా? ఈ దినములలో ఒకని కెందరు భార్యలుండవచ్చును?

జవాబు:-

దావీదు భక్తుడైయుండి ఆ కాలములో రెండవ సమూయేలు 6:13,14 ప్రకారము రక్త బలులుగా దేవునికి నెద్దులను, క్రొవ్విన దూడలను అర్పించెను. ఈ దినములలో మనము అర్పించెదమా? అర్పించము. ఎందుకు? దేవుడు మారిపోయెనా? కాదు – ఆ కాలమందు లేని ఏర్పాటు ఈ కృప దినములలో జరుగుచున్నది.

ఆ దినములలో కాలము సంపూర్ణము కాక రాబోవు క్రీస్తు అప్పటికి అవతరించియుండనందున ఆ రక్త బలులు చెల్లెను. ఇప్పుడైతే చెల్లవు. ఎందుకంటే క్రీస్తు తానే బలిగా వచ్చి ఆ అపూర్ణ బలులను తనతో సంపూర్ణమునకు తెచ్చి వాటిని నిలిపివేసెను. గలతీ 4:4; యోహాను 19:30; రోమా 10:4.

దావీదు భక్తుడైయుండి ఆ పాత యూదా మత పద్ధతిచొప్పున సున్నతి పొందియుండెను. (1 సమూ. 17:36). సరి, భక్తుడైన దావీదు పొందినట్టు మనము ఈ దినములలో సున్నతి ఆచరించెదమంటే సరిపోవునా? సరిపోదు – ఇప్పుడు క్రీస్తునుబట్టి క్రొత్త జన్మము పొందుటయే అగత్యము.

ఈ నూతన జీవము సున్నతికంటే నెక్కువై ఆ పాతదానిని ముంచివేసియున్నది. కాబట్టి యిప్పుడు సున్నతి పొందుట యందేమియు లేదని వాక్యమనుచున్నది. (గలతీ 6:15). ఆలాగైతే దేవుడు మారెనని భావిస్తామా? అట్లనరాదు.

ఒక కాలమందు చెల్లినది ఆ అపూర్ణ కాలానికి సరిపోయెను. అయితే సంపూర్ణము రాగా అపూర్ణము నిలిచిపోయినది. దావీదు భక్తుడైయుండి పండుగగా అమావాస్యను ఆచరించెను. 1 సమూ. 20:18 చదవండి. మరియు సబ్బాతు దినముగా శనివారమును ఆచరించెను.

క్రొత్త నిబంధన చేతిలో లేక పాతదానినే ఆచరించెను. సరి, భక్తుడైన ఆయన ఆలాగు చేసినందున క్రీస్తుకు యివతల నున్న మనముకూడ ఆలాగే పాతవాటిని ఆచరించెదమందామా? కూడదు. కాలము వేరైపోయెను. అప్పుడివ్వబడని వెలుగు ఈ కాలమందు ప్రకాశించు చున్నది గనుక మనము పాతదానికి బద్ధులము కాము. (1 యోహాను 2:8).

ఆ పాత అమావాస్య అను పండుగ యేమి, సబ్బాతు దినమనేదియేమి, అవన్నియు రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో నున్నదని యిప్పుడు ప్రతివాడు గ్రహించి ఆ పాత పండుగలను ఆ పాత శనివారమును నిషేధించి క్రీస్తు అనే శిరస్సును హత్తుకొని ఆయనతోనే నిత్యము పండుగ నాచరించి ఆయనతోనే నిత్యము విశ్రాంతి అనుభవించి తృప్తి చెందియుండవలెను. (కొల. 2:17-19).

దావీదు క్రీస్తు పేరు ప్రార్థనలో చెప్పుకొనెనా? క్రీస్తు నామమందు మిమ్మును మనవి చేయుచున్నామనెనా? 2 సమూయేలు 7:18 చూడండి – నా ప్రభువా, యెహోవా అని ప్రార్థనలో చెప్పుకొంటూ ఆఖరికి ఆ ప్రార్థనను ముగింపబడుగాకనియున్నది. అంతే సరి. క్రీస్తు పేరు లేక ఆలాగు భక్తుడైన దావీదు ప్రార్థించెను.

మనమును నేటి దినములయందు క్రీస్తును లోపించి ప్రార్థింతామని చెప్పుకొంటే సరిపోవునా? సరిపోదు, ఆ కాలము వేరు, ఈ కాలము వేరు. దేవుడు మారెనా అంటే మారలేదులెండి గాని ఆయన బయలుపరచే సత్యము కాలక్రమేణ పరిపూర్ణతకు వచ్చెనని మనము తెలిసికొనవలెను. ఇప్పుడు క్రీస్తును మధ్యవర్తిగా పెట్టుకొని క్రీస్తు నామమందు దేవుని ప్రార్థింపవలెను – యోహాను 14:13, 15:16, 16:23.

దావీదు దినములలో బయలుపరచబడని సంగతి మన దినములలో వెలుగులోనికి వచ్చియున్నది. (2 తిమోతి 1:9,10). దావీదు భార్యల సంగతి యిట్లనే వివేచించవలెను. ఆరంభదశలో దేవుడు ఆదామునకు నొకే భార్యనిచ్చి వారిద్దరిని ఆ పెండ్లిలో నేక శరీరముగా చేయుటవలన, మనుష్యునికి భార్యలు కాదు, ఏక భార్యయుండతగినదని ప్రకటింపబడి స్థిరమాయెను. క్రీస్తు కూడ లోకమునకు వచ్చి ఈ గొప్ప పద్ధతికి మత్తయి 19:5-7 లో సమ్మతించి వారు ముగ్గురు లేక నలుగురు కారు, వారిద్దరును ఏక శరీరముగా నుండుట శ్రేయస్కరమని సూచించి పలికెను.

ఆ పాత భక్తులు వెలుగు లేక మామూలు చొప్పున నొక భార్య కాక వారిని వీరిని భార్యలనుగా స్వీకరించి వారితో కాపురముండినప్పుడు దేవుడు తన చట్టమును గాని పెండ్లియెడల తనకున్న తన ఆరంభ ఆపేక్షనుగాని, యుద్దేశమునుగాని మార్చక భక్తులు ఆ అపూర్ణ దినములలో అయోగ్యముగా చేసినది చూచియు చూడనట్టుగా నుండెను. రెండు తెలియుచున్నవి.

  1. ఇప్పుడున్నట్లు అప్పుడు జ్ఞానమంతగా లేదు. గనుక వివాహ సంబంధముగా భక్తులా దినములలో తొలిగినది యెహోవాకు తెలియకుండ పోలేదు గాని క్రీస్తు వచ్చేదాకా ఆ భక్తులను కనిపెట్టి వారితో నోర్చియోర్చి వచ్చెను. (అపొ.కార్య. 17:30).
  2. కాబట్టి క్రీస్తు రాక పూర్వము కొన్ని విషయములుగా వారు వీరు చెప్పే మిషలు చెల్లుచుండెను. ఇప్పుడైతే క్రీస్తు రావడముతో –
  • వెలుగు పరిపూర్ణమాయెను. 1 యోహాను 2:8.
  • సాకుకు గాని మిషకు గాని చోటులేదు. యోహాను 15:22. ఇ) నాకు తెలియదని చెప్పి అజ్ఞానముగానుండ వీలులేదు.అపొ. కార్య. 17:30,31.

గనుక ఈ కృపా దినములలో క్రీస్తు అధికారము క్రిందనుండే వ్యక్తి యొక భార్య తోనే కాపురముండి ఘనముగా జీవించతగినది. ఇందు నిమిత్తమే క్రీస్తు భక్తులకు మాదిరిగా నడుచుకొనదగిన సంఘాధ్యక్షులకు చట్టముగా నివ్వబడి చెల్లుచున్న నొక గొప్ప విధి యేదనగా ఏకపత్నీ పురుషత్వము. 1 తిమోతి 3:2,3. ఈ పద్ధతి లోపలనే ఇప్పుడు క్రీస్తువారు జీవించదగినది. వెనుకకు తిరిగి దావీదు సంగతి యెట్లని అడిగి విచారించి అనేక భార్యలతోనుండ వల్లపడదు. దేవుడు మారలేదు గాని కాలము వేరైపోయెను. అప్పుడివ్వబడని హక్కులిప్పుడు క్రీస్తులో మనకివ్వబడెను.

ఏకపత్నీ పురుషుడుగా నుండుమనే ప్రభువీ దినములలో నాలాగే బ్రతుకునట్టి శక్తినికూడ నివ్వకుండపోడు. క్రీస్తునుబట్టి భక్తులకు కలిగిన పరిశుద్ధాత్మద్వారా భక్తులలో కనిపించ తగిన నీతి క్రియలవంటి పరిశుద్ధత లేకపోకూడదు – ఈ సత్యము నుపేక్షించేవాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. జాగ్రత్త! (1 థెస్స. 4:8).