ఆయన నా కన్నులు తెరచెను – Bible Verses Chapter 9 in Telugu

తొమ్మిదవ అధ్యాయము

ఆయన నా కన్నులు తెరచెను
(యోహాను 9:10)

ఆరవ సూచకక్రియ –
పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట (9:1-12) :

9:1 యేసు దేవాలయమునుండి బయటికి వెళ్ళిన తరువాత (8వ అధ్యాయము లోని సంగతులు జరిగిన తరువాత) ఇది జరిగియుండెను. ఇది మానవునియొక్క పరిస్థితిలో దేవుడు చేసిన అద్భుత కార్యమును వివరించుచున్నది.

9:2 శిష్యులాయనకు ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నవేసిరి. ప్రభువా ! వీడు పుట్టు గ్రుడ్డివాడుగా పుట్టుటకు కారణము వీడు చేసిన పాపమా? లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపముద్వారానా అని అడిగిరి.

వీరికి పునర్జన్మయందు నమ్మకమున్నదా? వీడు పుట్టిన తరువాత చేయు పాపములను దేవుడు ఎరిగియుండి, వీనిని గ్రుడ్డివానిగా పుట్టించెనా? వాని గ్రుడ్డితనము వారి కుటుంబములోని పాపమునకు కారణము అని వారు తలంచిరి.

కాని అట్లు కాదు. రోగము, బాధ మరియు మరణము పాపము వలన లోకములోనికి వచ్చెనను మాట నిజమైనను, ఒకవ్యక్తి తాను చేసిన పాపములకు బాధపడుచున్నాడనునది వాస్తవమైనది కాదు.

9:3,4 వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టెనని యేసు చెప్పెను. ఈ మనుష్యుడు పుట్టకమునుపే ఆ గ్రుడ్డికళ్ళను తాను బాగుచేయగలనని యేసుకు తెలి యును.

Read and Learn More Telugu Bible Verses

తాను సిలువ వేయబడక మునుపు మూడు సంవత్సరములు పరిచర్య చేయవలె ననికూడ తెలియును. ప్రతి క్షణము ఆయన దేవుని మహిమార్థమై పరిచర్యచేయవలసి యున్నది. పుట్టినప్పటినుండి గ్రుడ్డివాడుగా నుండిన ఒకడు ఇచ్చట కలడు.

అది సబ్బాతు దినము ఐనప్పటికి, ప్రభువైన యేసు అతని స్వస్థపరచి అద్భుతము చేయవలసి యున్నది. ప్రభువైన యేసు బహిరంగముగా చేయు పరిచర్య ముగియవలసియున్నది.

మరియు ఈ విధమైన అద్భుతములు జరిగించుటకు ఆయన ఈ భూమిపై వుండువాడు కాడు, పగటికాలము గతించిపోయి రాత్రి సమయము ఆసన్నమగుచున్నదను ఒక గంభీరమైన సత్యమును ఇది మనకు తెలియజేయుచున్నది. అనగా మన పరిచర్య కాలము సమీపించుచున్నది. అంగీకరింపబడురీతిలో ప్రభువు మనకిచ్చు సమయమును ఆయన మహిమార్థమై వినియోగపరచుదుము గాక !

9:5 యేసు ఈ లోకమునందున్నపుడు ఒక ప్రత్యేకమైన మరియు నిజమైన వెలుగై యుండెను. ఆయన అద్భుతములు చేసెను. మరియు పరలోక రాజ్యమును గురించి బోధించెను. ఈ లోకమునకు నిజమైనవెలుగు ఆ ప్రజల ముందుండెను. యేసు ఇంకనూ ఈ లోకమునకు వెలుగైయున్నాడు, కనుకనే ఆయనను వెంబడించువాడు చీకటిలో నడువడని ఆయన వాగ్దానము చేసెను. ఈ వాక్యములో భూమిపై ఆయన జరిగించుచున్న బహిరంగ పరిచర్యనుగురించి మాట్లాడెను.

ఆరవ సూచకక్రియ - పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట (9:1-12) :

9:6 యేసు ఎందునిమిత్తమై ఉమ్మి నేలపై వేసి, ఆ బురదతీసి అతని కండ్లకు పూసెనో మనకు చెప్పబడలేదు. కొంతమంది – ఆ పుట్టు గ్రుడ్డు వానికి కనుగ్రుడ్లులేని కారణమున ప్రభువు వాటిని అప్పుడు ఏర్పరచెనని చెప్పుదురు. లోక దృష్టికి తృణీకార మైన దానిని దేవుడు ఉపయోగించుకొనునని మరొకరు చెప్పుచున్నారు. గుర్తింపులేని బలహీనమైన విషయములనే తన కార్యము సఫలపరచుటకు ప్రభువు వాడుకొనును. ఆత్మీయముగా గ్రుడ్డివారైయున్నవారికి చూపునిచ్చుటకు దుమ్ముతోను, మట్టితోను చేయబడిన స్త్రీ, పురుషులను ప్రభువు వాడుకొనుచున్నాడు.

9:7 పుట్టు గ్రుడ్డువాని విశ్వాసమును పరీక్షించు నిమిత్తము యేసు వానిని సిలోయ మను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని చెప్పెను. వానికి ఆ కోనేరు ఎచ్చట ఉన్నదో తెలియదు. గనుక తనకు చెప్పబడినట్లు చేయగలడు. “సిలోయము” అనగా పంపబడిన వాడని బైబిలు చెప్పుచున్నది.

ఇది పంపబడిన ‘మెస్సీయ’ను సూచించుచుండవచ్చును. ఈ అద్భుత కార్యమును జరిగించినవాడు తండ్రివలన యీ లోకమునకు పంపబడిన వాడు. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి ఆ కోనేటిలో కండ్లు కడుగుకొని చూపుపొందెను. అంతకు పూర్వము అతడు ఏమియు చూచియుండలేదు.

ఈ అద్భుతము తృటికాలములో జరిగినది. వెంటనే తన కండ్లను ఉపయోగపరచుకొనగలిగెను. అతడు చూడగలిగెను. అతనికి ఆ మొదటి చూపు తాను జీవించుచున్న ఈ లోకమును చూచినప్పుడు ఎంతటి ఆనందమును కలిగించెనో !

9:8 గ్రుడ్డివాని స్నేహితులందరు ఈ కార్యమునుచూచి ఉలిక్కిపడిరి. ఇంతవరకు గ్రుడ్డివానిగానుండి భిక్షమెత్తుకొనినవాడు ఇతడు కాదా ! అనుకొనిరి. (ఒకడు రక్షింప బడుటకూడా ఇట్లే. మన ఇరుగుపొరుగువారు మనలోని మార్పును గుర్తించ గలుగ వలెను).

9:9 కొంతమంది అతడే అనిరి. కొంతమంది అతడు కాడనిరి. అతనివలె ఉన్నా డనిరి. అతడైతే వారందరి అనుమానము తీరునట్లుగా తాను అంతకు మునుపు గుడ్డివాడుగానుండి ఇప్పుడు చూచుచున్నవాడనని చెప్పెను.

9:10 యేసుచేసిన అద్భుత కార్యములు అనేకరకములైన ప్రశ్నలను రేకెత్తించును. తరచుగా యీ ప్రశ్నలు ఒక విశ్వాసి ప్రభువుకొరకు సాక్ష్యమిచ్చుటకు ఉపయోగపడును. అసలు ఇదెట్లు జరిగెనని ప్రజలతనిని అడిగిరి. అందుకతని సాక్ష్యము సామాన్యము గాను, వారిని ఒప్పింపజేయునదిగా నుండెను.

9:11 తన్ను స్వస్థపరచిన వానికి ఘనతను చేకూర్చునట్లుగా తన స్వస్థతను గురించిన వాస్తవములను వారికి వివరించుచుండెను. అంతవరకు తన్ను స్వస్థపరచినది ప్రభువైన యేసు అని అతడు గుర్తించలేదు. అయితే అతడు ఆయనను ఒక సామాన్యమైన వ్యక్తిగా సంబోధించెను. తరువాత అతడు యేసు ఎవరో తెలిసికొనెను.

బాగుపడిన గ్రుడ్డివానిని ప్రశ్నించువారు యేసు ఎక్కడ ఉండెనో తెలిసికొనగోరిరి. మనము ప్రభువైన యేసుక్రీస్తును గురించి సాక్ష్యమిచ్చునపుడు ఇతరుల హృదయములలో ఆయనను గూర్చిన ఆసక్తిని కలిగింపవలసి యున్నాము.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

9:13-14 జరిగిన సూచకక్రియయందాసక్తి కల్గిన యూదులు గ్రుడ్డివానిని పరిసయ్యుల యొద్దకు తీసికొని వచ్చిరి జరిగిన విషయమై యూదుల అధికారులు ఎంత ఆగ్రహించిరో వారికి తెలియలేదు. యీ అద్భుతకార్యము యేసు సబ్బాతు దినమందు చేసెను. సబ్బాతుదినమున కనికరమైన కార్యములను చేయుటకు దేవుడు అభ్యంతరపరచడను విషయమును వారు గుర్తింపరైరి.

9:15 ఇప్పుడా గ్రుడ్డివానికి ‘యేసు’ నుగూర్చి సాక్ష్యమిచ్చుటకు మరొక అవకాశము లభించెను. పరిసయ్యులు వానిని నీవెట్లు చూపు పొందితివని అడిగి, మరొకసారి ఆ వృత్తాంతమును వారు వినిరి.

అయితే వాడీసారి యేసు అను పేరు చెప్పకయే ఆ వృత్తాంత మును వివరించెను. ఆ విధముగా అతడు చెప్పుటకు భయపడి కాదుగాని, ఆ అద్భుత కార్యమును ఎవరు చేసిరో అందరికి తెలిసియుండుటచే తానట్లు చెప్పెను. ఆ సమ యమునకు యేసునుగూర్చిన సమాచారము యెరూషలేమునందంతట వ్యాపించెను.

9:16 యేసు ఎవరు ? అను సమస్య బయలుదేరెను. ఆయన సబ్బాతు దినమును ఆచరించలేదు గనుక అతడు దైవికవ్యక్తి కాదనిరి. మరికొందరు పాపాత్ముడైన మనుష్యు డిట్టి గొప్ప కార్యములు చేయలేడనిరి, కొన్ని సందర్భములలో ప్రజలలో భేదమును కలిగించువాడు యేసు. ప్రజలలో రెండు గుంపులేర్పడినవి. అవేవనగా యేసును వెంబడించువారు, యేసును వ్యతిరేకించువారు.

9:17 నీవు యేసును గూర్చి ఏమి తలంచుచున్నావని పరిసయ్యులాగ్రుడ్డి వానిని అడిగిరి. యేసు దేవుడని వాడు గుర్తించలేదుగాని, వాని యొక్క విశ్వాసము యేసును ఒక ప్రవక్తగా గుర్తించగలిగెను. అయితే వాడు ఆయన దేవుడు పంపిన వ్యక్తియనియు. ఆయనయొద్ద దైవికమైన వర్తమానము కలదని నమ్మెను.

ఆయన నా కన్నులు తెరచెను Bible Verses Chapter 9

9:18 జరిగిన యీ అద్భుత కార్యమును జరిగినట్లుగా యూదులు, పరిసయ్యులు ఒప్పుకొనుటకు అంగీకరించలేదు. కనుక వారు ఆ గ్రుడ్డివాని తల్లిదండ్రులను పిలువ నంపించి వారేమి చెప్పుదురోయని కనిపెట్టిరి.

9:19 సాధారణముగా ఒక బిడ్డ గ్రుడ్డివానిగా పుట్టినయెడల వాని తల్లిదండ్రులు కంటే ఎవరికి ఎక్కువ తెలియును? గనుక వారి సాక్ష్యము నమ్మదగినది. కనుక వారు వీడు మీ కుమారుడేనా? అయితే వీడెట్లు చూపు పొందెనని యడిగిరి.

9:20 – 22 వారు – వాడు తమ కుమారుడేనని ఒప్పుకొనిరి. ఎందుకనగా కొన్ని ఏళ్ళ తరబడి వాని గ్రుడ్డితనమును కృంగిన హృదయములతో భరించిరి. అంతకు మించి వారు చెప్పుటకు భయపడిరి.

తమ కుమారునికి చూపు ఎట్లు వచ్చినదో తెలియదనియు, మరియు ఎవరు చూపు అనుగ్రహించిరో తెలియదనియు చెప్పిరి. పరిసయ్యులను మరల తమ కుమారునే అడుగుమనిచెప్పిరి. ఎందుకనగా తనకు జరిగినదంతయు వాడు చెప్పగలడని చెప్పిరి.

ఎందుకనిన యేసు మెస్సీయ అని ఎవరైనను ఒప్పుకొనిన, వారిని సమాజమునుండి వెలివేయుదుమని యూదులు నిర్ణయించి యుండిరి. వెలివేయుట అనునది యూదులకు చాలా తీవ్రమైన సంగతి, అంతటి క్రయమును వారు చెల్లించనిష్టపడరు. తమ జీవనాధారమును పోగొట్టు కొనుటయేగాక, యూదామత సాంప్రదాయములను కోల్పోవుదురు.

9:23 ఇది వారి హృదయములలోనున్న గొప్ప భయాందోళన గనుక వారి ప్రశ్నకు సమాధానమును తమ కుమారునే అడుగమని తప్పించుకొనిరి.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

9:24, 25 “దేవునికి స్తుతి చెల్లించుడి” అను పదమునకు రెండు అర్థములు కలవు మొదటిగా నిదియొక ప్రమాణము. కనుకనే పరిసయ్యులు “నీవిప్పుడు సత్యమును చెప్పవలయును” “ఆ మనుష్యుడు పాపియని మాకు తెలియును,” జరిగిన ఈ అద్భుత కార్యమునకు దేవునికే మహిమ చెల్లునుగాని యేసును వారు పాపాత్ముడని తలంచుటకు మరియు ఆయనకెట్టి ఘనత చెందకూడదనియు వారి అభిప్రాయము.

పరిసయ్యులు ప్రతి సమయమందును ఓటమిని రుచిచూచుచుండిరి. ప్రతి సమయమందును వారు యేసుకు అపకీర్తి కలుగజేయుటకై ప్రయత్నించుచుండగా, వారి ప్రయత్నములన్నియు నిష్ప్రయోజనమై ఆయనకు మహిమను చేకూర్చుచుండెను.

వాని సాక్ష్యము బహుచక్కగా నుండెను. వానికి యేసునుగూర్చి ఎక్కువగా తెలియక పోయినను, ఒకటి తెలియును. అదేమనగా ఒకప్పుడు తాను గ్రుడ్డివాడు. ఇప్పుడు చూచుచుండెను. ఈ సాక్ష్యమును ఎవ్వరు తిరస్కరింపలేనిది.

ఇట్లే తిరిగి జన్మించిన వాని విషయములో నుండవలసినది. “నేను ఒకప్పుడు నశించితిని, ఇప్పుడైతే ప్రభువైన యేసు కృపనుబట్టి రక్షింపబడితిని.” అని నీవు చెప్పినప్పుడు లోకము నిన్ను అనుమానించ వచ్చును; వెక్కిరింపవచ్చును; తిరస్కరింపవచ్చును !

9:26 – 28 మరల పరిసయ్యులు అదే ప్రశ్నవేసి వానిద్వారా సమాధానము (విన నాశించిరి) వివరముగా విననాశించిరి. గతములో గ్రుడ్డివానిగానుండి చూపుపొందిన ఆ వ్యక్తి విసుగు జెందెను. వాడు తాను వాస్తవము చెప్పినను వారు నమ్మలేదని వారికి మరల గుర్తుజేసెను.

మీరు మరల ఎందుకు వినగోరుచున్నారు? మీరు ఆయన శిష్యులు కాగోరుచున్నారా? అని ఆ గ్రుడ్డివాడు వారిని అడుగుటలో వాస్తవముగా వారిని అపహసించెనని చెప్పవచ్చును. ఎందుకనగా పరిసయ్యులు యేసును ద్వేషించు చున్నారనియు వారతనిని వెంబడించుటకు ఇష్టపడరనియు ఆ గ్రుడ్డివానికి తెలిసినది.

“నీవు ఒకని ఇష్టపడనియెడల వానిని దూషింతువు” అదియే ఇక్కడ జరిగినది. పరిసయ్యులు వాడిచ్చు సాక్ష్యమును బలహీనపరచలేకపోయిరి. గనుక అతనిని దూషించిరి. అతడు యేసు శిష్యుడగుట ప్రపంచములో అదియొక నీచమైన సంగతియై నట్లు దూషించిరి. మరియు వారు మేము మోషే శిష్యులమని ఎంతో గొప్పగా చెప్పుకొనిరి.

9:29 పరిసయ్యులు “దేవుడు మోషేతో మాట్లాడెననియు, వీడెక్కడనుండి వచ్చెనో మాకు తెలియదనియు” యేసును దూషించిరి. వారు మోషేను విశ్వసించినయెడల ప్రభువైన యేసును అంగీకరించియుందురు. అయితే మోషే పుట్టుగ్రుడ్డువానికి ఎప్పుడైనను కండ్లు తెరచినట్లుగా చెప్పబడెనా? లేదు! అయినప్పటికి మోషేకంటే గొప్పవాడు వారి మధ్యనుండెను. అయితే వారికావిషయము తెలియపరచబడలేదు.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

9:30-33 పరిసయ్యులు ఊహించని రీతిలో కన్నులు తెరవబడిన గ్రుడ్డివాడు వారికి సమాధానమిచ్చి వారికి జ్ఞానమును బోధించుచున్నాడు. వారు ఇశ్రాయేలు దేశములో పాలించువారు మరియు యూదులకు బోధకులునై యుండియు, పుట్టుగ్రుడ్డు వానికి కండ్లు ఇచ్చుటకు శక్తిగలవాడు వారి మధ్యనుండగా ఆయన ఎక్కడి నుండి వచ్చెనో వారికి తెలియక పోవుట ఆశ్చర్యమే.

ఇది సిగ్గుకరమైన సంగతి, గ్రుడ్డివాడు సాక్ష్యమిచ్చుటలో ధైర్యము కలిగియుండెను. అతని విశ్వాసము అభివృద్ధి చెందు చుండెను. వారికొక ముఖ్య సందేశమును గుర్తుచేయుచుండెను. అదేదనగా దేవుడు పాపుల మనవి ఆలకింపడనియు, పాపిద్వారా ఇట్టి అద్భుత కార్యము జరిగింపడనియు, చెప్పెను.

ఆయన దుర్మార్గులను అంగీకరింపడనియు, శక్తివంతమైన పనులు చేయుటకు అట్టివారికి అధికారము అనుగ్రహించడనియు చెప్పెను. కాగా దేవుని ఆరాధించువారే దేవునియొక్క అధికారమును, ఆమోదమును పొందుదురని చెప్పెను.

ఈ గ్రుడ్డివాడు, ప్రపంచములో పుట్టు గ్రుడ్డుగా పుట్టి చూపు పొందిన వారిలో తానే మొదటి వాడని గ్రహించెను. ఇంతటి మహత్తర కార్యమును గాంచిన పరిసయ్యులు ఈ కార్యము జరిగించిన వానిలో తప్పు వెదుకుటకు కారణమేమో ఆ గ్రుడ్డివానికి బోధపడలేదు. ప్రభువైన యేసు దేవునికి చెందినవాడు కాని యెడల యీ అద్భుత కార్యమును చేయగలిగి యుండెడివాడు కాదు.

9:34 యూదులు మరల ఆయనను దూషించుట ప్రారంభించిరి. వాని గ్రుడ్డితనము కేవలము “పాపము” వలననే సంప్రాప్తమాయెననునది పరిసయ్యుల తప్పుడు అభిప్రాయము. ఒక గ్రుడ్డివానికి పరిసయ్యులకు బోధించు అధికారము కలదా? అధికారము కలదనుమాట సత్యమే.

“ఉన్నత స్థితిగల్గిన విద్యాధికులద్వారా కన్న అతి సామాన్యుడైన ఒక సహోదరునిద్వారా పరిశుద్ధాత్ముడు బోధించును” అని ‘రైల్’ చెప్పెను. వారతనిని వెలివేసిరని మనము చదువుదుము. అనగా వారతనిని సమాజమందిరము నుండి (వెలివేసిరి) వెళ్ళగొట్టిరి. యూదుల మతమునుండి తోలివేసిరి. వెలివేయుటకు ఆధారభూతమైన అంశమేమి? గ్రుడ్డివాడైన మనుష్యుడు సబ్బాతుదినమున చూపు పొందుట మరియు, తనకిట్టి అద్భుతకార్యమును చేసిన వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడకపోవుటయే!

9:35-38 యేసు వానిని ఇప్పుడు కనుగొనెను. “నిన్ను వారు చేర్చుకొనని పక్షమున, నేను నిన్ను చేర్చుకొందును” అని చెప్పెను. యేసు నిమిత్తము వెలివేయబడిన వానికి నష్టములేదుగాని, ఆయనే వానిని ఆహ్వానించును గనుక ఆయన సహవాసములో ఆశీర్వాదముండును.

ప్రభువైన యేసు వానిని తనవైపు ఆకర్షించుకొని వాని విశ్వాస మునుబట్టి తనను దేవుని కుమారునిగా ప్రత్యక్షపరచుకొనెను. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా? అని అడిగెను. అతడు బాహ్యముగా చూపు పొందినను, ఆత్మీయమైన కనుదృష్టి పొందనవసరముండెను.

అయితే ప్రభువా! నేను దేవుని కుమారునియందు విశ్వాసముంచుటకు ఆయన ఎవరు? అని వాడు అడిగెను ‘ప్రభువా’ అని అతడు సంబోధించినను అతడు సామాన్యముగా ఆయనను ‘అయ్యా’ అని పిలిచెను. ఇప్పుడు ప్రభువైన యేసు తన్ను తాను దేవుని కుమారునిగా ప్రత్యక్ష పరచుకొనెను.

ఈ అసాధారణమైన కార్యమును చేసినది ఒక సామాన్య మానవుడు కాదనియు వానికి కంటిచూపు ఇచ్చినది మానవమాత్రుడు కాదనియు, ఆయనే దేవుని కుమారుడనియు, “ఆయనను నీవు చూచుచున్నావనియు, ఆయనతో మాట్లాడుచున్నా” వనియు అతనితో చెప్పెను.

వెంటనే ఆ గ్రుడ్డివాడు ప్రభువైన యేసునందు విశ్వాస ముంచి, ఆయనకు సాగిలపడి నమస్కరించెను (ఆరాధించెను). అతడిప్పుడు రక్షింప బడినవాడును, స్వస్థతనొందినవాడునై యుండెను.

అతని జీవితములో ఆ దినమెంత ధన్యకరమైనది ! అతడు శారీరక, ఆధ్యాత్మిక దృష్టిని పొందెను. అతడు ప్రభువైన యేసును దేవుని కుమారునిగా గుర్తించనంత వరకు ఆయనను ఆరాధించలేదు అని మనము గమనించవలెను.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

తెలివిగల యూదునివలె ఇతనొక సామాన్య మానవుని ఆరాధించలేదు. తనను స్వస్థపరచినవాడు ‘దేవుడు’ అని గుర్తించినప్పుడే ఆయనను ఆరాధించెను. ఆయన చేసిన కార్యమునకు ఆయనకు మ్రొక్కలేదు గాని, ఆయన దేవుని కుమారుడని తెలిసినప్పుడే మ్రొక్కెను.

9:39 ఈ వాక్యము చూచుటతోడనే యోహాను 3:17 వాక్యమునకు భిన్నాభి ప్రాయము కలిగించినట్లగుపించును. “దేవుడు తీర్పు తీర్చుటకు తన కుమారుని లోకము లోనికి పంపలేదు” క్రీస్తు ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని, రక్షించుటకే వచ్చెను.

అయితే ఆయనను అంగీకరింపనివారికందరికి ఆ తీర్పు అనివార్యమైనది. సువార్తను ప్రకటించుటవలన మనము రెండు ఫలితములు జూచెదము. అవేవనగా మేము సరిగా చూడలేకపోవుచున్నామని చెప్పువారు దృష్టి పొందుదురు. ప్రభువైన యేసు లేకయే మేము బాగుగా చూచుచున్నామని చెప్పువారు గ్రుడ్డివారుగా మిగిలి పోవుదురు.

9:40,41 పరిసయ్యులలో కొందరు యేసు తమయొక్క గ్రుడ్డితనమునుగురించి మాట్లాడుచున్నాడని గ్రహించిరి. అందుకు వారు మేము గ్రుడ్డివారమా అని ఆయనను అడిగిరి. మేము గ్రుడ్డివారము కాము అని చెప్పిరి. అప్పుడు ప్రభువు వారితో మీరు గ్రుడ్డివారనియు, పాపులనియు.

మీకు రక్షకుడు అవసరమనియు మీరు ఒప్పుకొనిన యెడల మీరు క్షమింపబడి రక్షింపబడుదురు. అయితే మీరు మేము నీతిమంతుల మనియు మాకు పాపము లేదనియు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపములు క్షమించబడలేదు.

యేసు – ‘మీలో పాపము లేదని’ చెప్పుటలో వారు పాపరహితులని చెప్పలేదు గాని, మీ పాపము నిలిచియుండదని సాదృశ్యముగా చెప్పెను. (మెస్సీయను గుర్తించకపోవుటవలన తాము గ్రుడ్డివారమని ఒప్పుకొనని యెడల తాము చూచుచూ దేవుని కుమారుని గుర్తించకపోవుటవలన కలుగు పాపమునకు మిష లేదు).

వారు ఆయనను మెస్సీయగా గుర్తించుటలో తప్పిపోయినందుకు తమకున్న గ్రుడ్డితనమును గూర్చి ఒప్పుకొనినయెడల వారి పాపమేలాగు క్షమింపబడునో ఆలాగే తాము చూచుచూ ఆయనను దేవునికుమారునిగా గుర్తించలేనప్పుడు కలుగు పాపమును క్షమింపబడును.

Leave a Comment